Saturday 25 May 2024

శ్రీ గరుడ పురాణము (185)

 


క్రౌంచపద తీర్థానికి ఉత్తరంలో నిశ్చిరా నామంతో ప్రసిద్ధమైన జలాశయముంది. అక్కడికి వెళ్ళి పిండ ప్రదానం ఒక్కమారు చేసిన వానికి జీవితంలో ఒక దుర్లభమైనదేదీ ఇక వుండదు. ఇక నిత్య నివాసం చేస్తూ అక్కడే వుండే వారెంత పుణ్యశాలులో కదా!


మహానది నీటిని స్పృశిస్తూ పితృదేవతలకి తర్పణాలిచ్చిన వానికి అక్షయలోకాల ప్రాప్తి కలుగుతుంది; కుటుంబమూ ఉద్దరింపబడుతుంది. ఇక సావిత్రి తీర్థంలో ఒకమారు సంధ్యావందనం చేసినవానికి పన్నెండేళ్లు సంధ్యవార్చిన పుణ్యం దక్కుతుంది.

ఒక మాసం అనగా రెండు పక్షాలూ పూర్తిగా గయలో నివసించి పితృకార్యాలను సంపన్నంచేయువాడు తప్పక తనతో బాటు ఏడుతరాల వారినుద్ధరించగలడు. ఇక్కడి ముండపృష్ఠ, అరవిందపర్వత, క్రౌంచపాద తీర్థాలను సేవించిన వారి పాపాలన్నీ నశిస్తాయి.


గ్రహణాలలోనూ మకర సంక్రాంతినాడూ గయలో వుండి పిండప్రదానం చేస్తే వచ్చే ఫలితం ఎంత గొప్పదంటే దానిని మూడు లోకాల్లోనూ ఎవరూ ఎప్పుడూ పొంది వుండరు. అది అతి దుర్లభం.


మహాహ్రదం, కౌశికీ తీర్థం, మూలక్షేత్రం, గృధ్రకూట పర్వత గుహ - ఈ నాలుగు చోట్లా శ్రాద్ధ కర్మ చేసిన వారికి మహా ఫలాలబ్బుతాయి.


గయలోని మాహేశ్వరీలో మహేశ్వరుడైన శివుని యొక్క జటాజూటము నుండి బయలుదేరిన గంగ యొక్క ధార వచ్చి ప్రవహిస్తుంటుంది. ఆ పరమ పవిత్ర మాహేశ్వరీ ధార ప్రవహించే తీర్థంలో పితృకర్మ చేసినవారు ఋణ విముక్తులౌతారు. (విశాల గూర్చి తదుపరి అధ్యాయంలో వుంటుంది)


గయ వెళ్ళి తమకి పిండంపెడతాడనే ఆశయే మానవులను పుత్రసంతానం కోసం, అవసరమైతే యజ్ఞాలైనా చేసి, ప్రయత్నించేలా చేస్తుంది. గయకి వచ్చిన పుత్రుల వైపు లేదా పిండాధికారులవైపు పితరులు గొప్పగా మురిసి చూస్తుంటారు. 'ఇక మనకి నరకభయం లేద'నే ధీమా వారి మనసంతటా నిండి వుంటుంది.


గయాప్రాప్తం సుతందృష్ట్యా పితౄణా ముత్యవోభవేత్ |

పద్భ్యామపి జలం స్పృష్ట్వా అస్మభ్యం కిల దాస్యతి || 


(ఆచార ... 83/60)


No comments:

Post a Comment