Monday 13 May 2024

శ్రీ గరుడ పురాణము (174)

 


వైదూర్యమణి - పరీక్షా విధి


(వై'డూ'ర్యమనే మాటే తెలుగులో ఎక్కువగా వాడబడుతోంది. కాని సంస్కృత మూలం విదూర-జ, వైదూర్య)


సూతుడిలా చెప్పసాగారు, "హే శౌనకాది మహామునులారా! వైదూర్యాది ఇతర మణులను అనగా వైదూర్య, పుష్ప, రాగ, కర్కేతన, భీష్మక మణులను గూర్చి బ్రహ్మదేవుడు మా గురువు గారికి చెప్పగా ఆయన నాకాజ్ఞానాన్ని ప్రసాదించారు.


బలాసురుని యొక్క నాదం ప్రళయకాల క్షుభిత సముద్ర ఘోషవలె నున్నపుడు దాని నుండి వివిధ వర్ణాలు గల, సౌందర్య సంపన్నములైన వైదూర్యాలుద్భవించాయి. బలాసురుని నుండి పుట్టిన మణి బీజము ఉత్తుంగ శిఖరాన్ని కలిగిన విదూరమను పేరు గల పర్వతానికానుకొనియున్న కామభూతిక సీమక్షేత్రంలో పడగా అదే రత్నగర్భగా మారింది.


ఈ వైదూర్యం మహాగుణసంపన్నం మూడు లోకాలలోనూ దీనికి పేరు ప్రతిష్ఠలున్నాయి. ఈ మణుల కాంతి ఎంత ఎక్కువగా వుంటుందంటే వాటి నుండి నిప్పురవ్వలు రాలుతున్నాయేమోననిపిస్తుంది.


పృథ్విపై పద్మరాగమణి ఎన్ని వర్ణాల్లో లభిస్తోందో వైదూర్యం కూడా అన్ని వర్ణాల్లోనూ దొరుకుతోంది. వీటిలో నెమలి కంఠం రంగూ, వెదురు పత్రం రంగూ వున్నవి శ్రేష్ఠాలుగా చెప్పబడ్డాయి. చషకనామక పక్షి వర్ణంలో వున్నవి ప్రశస్తం కావు.


గుణయుక్తమైన వైదూర్యం తన యజమానికి పరమ సౌభాగ్య సంపన్నునిగా చేయగలదు. దోషయుక్తమణి తన యజమానిని కూడా దోష సంయుక్తుని గావిస్తుంది కాబట్టి ఈ మణి విషయంలో గట్టి పరీక్ష అవసరం.

కొండగాజు, శిశుపాల, గాజు, స్పటిక మణులు కూడా వైదూర్యం లాగే వుంటాయి. దాని వలెనే కాంతులను కూడా వెలారుస్తాయి. కానీ జాగ్రత్తగా పరీక్షిస్తే లేఖన సామర్థ్యం లేకపోవడం వల్ల గాజు, గురుత్వభావహీనత్వం వల్ల శిశుపాల, కాంతి భేదం వల్ల గిరిగాజు, సముజ్జ్వల వర్ణం వల్ల స్ఫటికమణీ వైదూర్యాలు కావని తేలిపోతుంది. ఎనభై రత్తీల బరువున్న ఇంద్రనీలమూ రెండు పలంల బరువున్న వైదూర్యమూ ఒకే ధర పలుకుతాయి.


కొన్ని రాళ్ళు రత్నాల కంటె అధికంగా మెరుస్తాయి కాని రత్నాలకుండే స్నిగ్ధత, మృదుత్వం లఘుత వాటికుండవు. పట్టిచూడాలే గాని ఇంకా ఎన్నో భేదాలు కనిపిస్తాయి.


మంచిమణులను సజాతీయమణులనీ, కాని వాటిని విజాతీయ మణులనీ రత్నశాస్త్ర పరిభాషలో వ్యవహరిస్తారు.


రత్నాల గూర్చి బాగా తెలిసిన వానిని ఉపయోగం ద్వారా తద్ జ్ఞానాన్ని పొందిన వానిని మణిబంధకుడు, మణివేత్త అంటారు. వారు పరిశీలించి నిష్కర్షగా సజాతీయ మణి యేదో చెప్పగలరు. అటువంటి మణి సాధారణ మణి కంటే ఆరు రెట్లు ధర పలుకుతుంది. సముద్రతీరంలో ఆవిర్భూతమైన మణులకున్న విలువ భూమి నుండి ఇతర స్థానాల్లో తీయబడిన మణులు, సజాతీయాలైనా సరే, వాటికి వుండదు.


మనువు పదహారు మాశలు ఒక 'భారం'తో సమానమని నిర్ణయించాడు. దానిలో ఏడవ భాగమొక 'సంజ్ఞ'. నాలుగు మాశలు ఒక 'శాణ'. ఒక పలంలో పదోభాగం 'ధరణం'. అయిదు 'కృష్ణలాలు' ఒక 'మాశ'


(అధ్యాయం - 73)




No comments:

Post a Comment