Saturday 11 May 2024

శ్రీ గరుడ పురాణము (172)

 


కొన్ని మణులకు ఔషధాలతో రంగును సృష్టించి తయారు చేయడం జరుగుతుంది. సహజ వర్ణాలున్న రత్నకాంతులు పైకి ప్రసరిస్తాయి. మందులు పూయబడ్డ రత్నాలను ఆభరణాలలో వాడడం వల్ల నష్టం లేదు కాని లాభం కూడా వుండదు. సహజత్వాన్ని నిర్ధారించే ఊర్ధ్వగామి కాంతులు కూడా ఒకే ఒక ఏటవాలుగా కోణంలో కనిపిస్తాయి. అవనత దృష్టికి అసలు కనిపించవు.


శుభఫలితాల కోసం మరకతాన్ని ధరించదలచుకున్నవారు స్నానం, ఆచమనం, రక్షామంత్ర విధివత్ జపం, గో- సువర్ణ దానాలు చేసి ధరించాలి. దోషాలు లేని గుణాలు కలిగిన బంగారు త్రాటిలో దీనిని పెట్టుకొని పెట్టుకోవచ్చు. అన్ని దేవ, పితృ కర్మలలో మరిన్ని మంచి ఫలాలకై మరకత మణిని ధరిస్తారు. విషపీడితులను ఆ పీడ నుండి రక్షించే శక్తీ, సంగ్రామంలో విజయాన్ని సమకూర్చే శక్తీ ఈ రత్నానికుంటాయి.


ఇది పద్మరాగమణికంటె అధికమూల్యాన్ని కలిగి వుంటుంది. (అధ్యాయం 71)


ఇంద్రనీలమణి లక్షణాలు, పరీక్షా విధి


ఎక్కడ సింహళ దేశపు రమణులు లవలీ అనే సుగంధిత పుష్పాలతో వాటి వాసనలతో మనసును దోచే వృక్షాలనూ, పొగడలనూ తమ కరాగ్రాల స్పర్శచే కరుణిస్తుంటారో అక్కడ మహాదాత బలాసురుని వికసిత కమల సదృశ శోభలతో వెలిగే కన్నులు వచ్చి పడినవి. రత్న సమాన కాంతులీను ఆ నేత్రప్రభతో సముద్రతీరమంతా వెలుగులమయమై భాసించింది. అక్కడొక విశాలమైన క్షేత్ర మేర్పడింది. అక్కడే ఇంద్రనీలమణులకు గని కూడా ఏర్పడింది. అయితే అక్కడ అన్ని మణులూ లభిస్తాయి. ముఖ్యంగా అక్కడి మరకతమణులు అన్ని రంగుల్లోనూ వుంటాయి. - శ్రీ కృష్ణబలరాములు ధరించే పట్టుపంచెల వలె పచ్చగా, నీలంగా, నల్ల తుమ్మెద రంగులోనూ, శారంగధనుర్యుక్తమైన విష్ణు భగవానుని భుజకాంతులతో, హాలాహలధరమైన శివుని కంఠం రంగులో కూడా వుంటాయి.


ఆ సాగర తీరానికీ అక్కడ పర్వతానికీ నడుమ నున్న క్షేత్రం ఎన్నో జాతి రత్నాలకు నెలవుగా మారింది. వాటిలో కొన్ని తేట నీటి తరంగాల తెలుపుతో ప్రకాశించగా కొన్ని మయూర వర్ణంలో దర్శనమిస్తాయి. మరికొన్ని నీటి బుడగల వలె నుండగా ఇంకొన్ని కోయిల గొంతు వలె నిగనిగలాడతాయి. వీటన్నిటిలోనూ సమానమైన నిర్మలతా, ప్రభాశక్తుల భాస్కరతా బలీయంగా వుంటాయి. అయితే, ఆ పర్వత రత్నగర్భంలో దొరికే అన్ని రకాల రత్నాలలోకీ పరమశ్రేష్టము, అత్యధిక గుణశాలియైనది ఇంద్రనీలమణి.


No comments:

Post a Comment