Monday 27 May 2024

శ్రీ గరుడ పురాణము (187)

 


ఒక వ్యక్తి తన జాతికి చెందిన ఎంతమంది పితరులకైనా బంధుబాంధవులకైనా, మిత్రులకైనా గయాభూమిలో విధిపూర్వకంగా పిండప్రదానాలను చేయవచ్చును.


ఇక్కడి రామతీర్థంలో స్నానం చేసిన మనుష్యునికి నూరుగోదానాల ఫలం దక్కుతుంది. మతంగ వాపిలో స్నానం చేస్తే సహస్ర గోదానాల ఫలం దక్కుతుంది. నిశ్చిరా సంగమంలో స్నానం చేసినవాడు తన పితరులను బ్రహ్మలోకానికి గొనిపోగలడు. వసిష్ఠాశ్రమంలో స్నానం చేసిన వానికి వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. మహాకౌశికీ తీర్థంలో నివాసముంటే అశ్వమేధ యజ్ఞ ఫలం దక్కుతుంది.


బ్రహ్మ సరోవరానికి దగ్గర్లోనే అగ్నిధారానది ప్రవహిస్తోంది. ఈ ప్రసిద్ధ నది మొత్తం ప్రపంచాన్నే పవిత్రీకరించగలదు. దీనికి కపిలయని మరో పేరు కూడా వుంది. ఇక్కడ స్నానం చేసి, పితరులకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించినవానికి అగ్నిష్టోమయజ్ఞ ఫలం లభిస్తుంది.


కుమారధారలో శ్రాద్ధకర్మ చేసిన వానికి అశ్వమేధయాగ ఫలం దక్కుతుంది. అక్కడ వెలసిన కుమారదేవుని దర్శించి, పూజించి, ప్రణామ నివేదనలు చేసిన వారికి మోక్షం లభిస్తుంది.


సోమకుండ తీర్థంలోస్నానం చేస్తే సోమలోక నివాసం అబ్బుతుంది. సంవర్త వాపియను తీర్థంలో స్నానమాచరించి పిండదానాలు చేసినవారు సర్వసౌభాగ్య ప్రాప్తి నొందుతారు.


ప్రేతకుండ తీర్థంలో పిండప్రదానం చేసిన వారికి అన్ని పాపాల నుండీ విముక్తి కలుగుతుంది. దేవనది, లేలహాన, మథన, జానుగర్త కాది ఇతర గయాంతర్గత తీర్థాలలో పిండ ప్రదానం కూడ పితరులను ప్రీతులను చేస్తుంది. అలాగే ఇక్కడి వసిష్ఠశ్వరాది దేవతలను శాస్త్రోక్తంగా పూజించి ప్రణామం చేసిన ప్రాణుల ఋణాలన్నీ తీరిపోతాయి."


(అధ్యాయాలు 82,83)


No comments:

Post a Comment