Monday 20 May 2024

శ్రీ గరుడ పురాణము (181)

 


గయలో పిండ ప్రదానం ద్వారా కలిగే సత్ఫలితాలు వందకోట్ల సంవత్సరాలు చెప్పినా తరగవు.


కీకటదేశంలో గయ పుణ్యశాలి. అలాగే వనాల్లో రాజగృహం, భూములలో నదీజలాలతో తడిసేనీ పరమశ్రేష్ఠాలు.


గయకు తూర్పున ముండపృష్ఠ తీర్థమున్నది. అది నలుదిక్కులూ విస్తరించియున్నది. దాని విస్తృతి ఒకటిన్నర కోసులు. (ప్రస్తుత భాషలో నాలుగున్నర కిలోమీటర్లు. గయాక్షేత్ర పరిమాణం అయిదు కోసులు) గయాశిరం ఒక కోసు పరిమాణంలో వున్నాయి. ఇక్కడ పిండ దానం చేసిన వాని పితరులు శాశ్వత తృప్తి నొందుతారు.


పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయాశిరః | 

తత్రపిండ ప్రదానేన తృప్తిర్భవతి శాశ్వతీ ॥


(ఆచార... 83/3)


విష్ణు పర్వతం నుండి ఉత్తరమానసం దాకా గల భాగాన్ని గయా శిరమంటారు. దానినే ఫల్గు తీర్థమనీ వ్యవహరిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం పొందిన పితరులకు పరమగతి ప్రాప్తిస్తుంది. గయకి వచ్చినంతనే వ్యక్తి పితౄణముక్తుడవుతాడు.


గయాగమన మాత్రేణ

పితౄణా మనృణో భవేత్ ||


(ఆచార...83/5)


ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాన్మహావిష్ణువే పితృదేవతల రూపంలో విహరిస్తుంటాడు. పుండరీకాక్షుడు, జనార్దనుడునైన ఆ భగవన్మూర్తిని దర్శించినంతనే వ్యక్తులు ఋణత్రయ (దేవ, భూత, ఋషి) విముక్తులౌతారు. గయ సింహద్వారానికి నమస్కరించినా, రుద్ర కాళేశ్వర, కేదారనాథులను సందర్శించినా మనిషి భూత, అతిథి ఋణ విముక్తుడవుతాడు.


అక్కడ పితామహుడైన బ్రహ్మని దర్శిస్తే పాపవిముక్తీ, ప్రపితామహుని దర్శిస్తే (* దర్శించడమనగా శ్రాద్ధకర్మ చేయుటయే) అనామయలోక ప్రాప్తి కలుగుతాయి. అలాగే గదాధరుడైన విష్ణుమూర్తికి ప్రణామం చేస్తే పునర్జన్మ లేకుండా మోక్షమే ప్రాప్తిస్తుంది.


అక్కడి మౌనాదిత్య, కనకార్క మహాత్ములను దర్శించి బ్రహ్మను పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. మౌనధారణ ఇక్కడి పూజా నియమాలలో నొకటి.


ఇక్కడ ప్రాతఃకాలమే లేచి స్నానాదికములను ముగించి సూర్యునిలో గాయత్రిని దర్శించి విధివిధానాలతో పూర్వసంధ్యను సంపన్నం చేసిన వారికి అన్ని వేదాలనూ చదివిన పుణ్యం లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం సావిత్రిని, సంధ్యను పద్ధతి ప్రకారం ఉపాసించిన వారికి యజ్ఞం చేసిన ఫలం వస్తుంది. సాయంత్రం సూర్యశక్తి సరస్వతిని జపించి దర్శించి సంధ్య వార్చిన వారికి ఉత్తమ దానాలిచ్చిన పుణ్యం లభిస్తుంది.


No comments:

Post a Comment