Tuesday 28 May 2024

శ్రీ గరుడ పురాణము (188)

 


గయ, గయా శీర్ష మహిమ విశాలుని కథ


వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన దానిని సూతమహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు.


"మహామునులారా! గయకు బయలుదేరదలచుకున్న వ్యక్తి ముందుగా తన గ్రామంలో శ్రాద్ధకర్మను గావించి సన్యాసి వేషాన్ని ధరించి గ్రామానికి ప్రదక్షిణచేయాలి. తరువాత పొరుగు గ్రామంలో కూడా సన్యాసిగానే తిరిగి శ్రాద్ధ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. గయాక్షేత్రానికి వెళుతున్నారు కదా అని ఎవరైనా ఎటువంటి దానాన్నిచ్చినా పుచ్చుకోరాదు. గయ వైపు యాత్రికుడు వేసే అడుగూ వాని పితరుల స్వర్గారోహణకు మెట్టుగా ఉపయోగపడుతుంది.


గృహాచ్చలిత మాత్రస్య గయాయాం గమనం ప్రతి |

స్వర్గారోహణ సోపానం పితృణాంతు పదే పదే || (ఆచార ...84/3)


కురుక్షేత్రం, విశాల (బదరీక్షేత్రం), విరజా (జగన్నాథక్షేత్రం), గయాక్షేత్రాలలో తప్ప మిగతా అన్ని క్షేత్రాలలోనూ శిరోముండనం, ఉపవాస నియమాలు ఉంటాయి. 


గయలో కనఖల నామక త్రైలోక్య ప్రసిద్ధి గాంచిన తీర్థమొకటుంది. ఇక్కడికి దేవతలు, మహర్షులు, సిద్ధులు వచ్చి సేవించుకుంటారు. మనసులోగాని స్వీయజీవిత చరిత్రలో గాని పాపమున్నవారు ఇక్కడ వుండలేరు. ఎందుకంటే పరమ విపరీత భయోత్పాదకములై నాలుకలతో విషాగ్నిని వర్షించే మహాసర్పాలిక్కడ నిత్యమూ తిరుగుతుంటాయి. అవి పాపాత్ములను రానీయవు.


ఉదీచి తీర్థంలో దేవర్షి సేవితమైన ముండపృష్ఠ తీర్థముంది. అక్కడ స్నానం చేసిన వారికి స్వర్గ ప్రాప్తి ఉంటుంది. అక్కడ పెట్టబడే శ్రాద్ధం అక్షయఫలాలనిస్తుంది. అక్కడ సూర్యదేవునికి నమస్కరించి పిండదానాది సత్క్రియలను చేయాలి.


మన పితృగణాలు, కవ్యవాహ, సోమ, యమ, అర్యమ, అగ్నిష్వాత్త, బర్హిషత్, సోమప నామధేయులు. శ్రాద్ధం ఏ పేరిట పెట్టినా ఈ దేవతలందరినీ పేరు పేరునా ఇలా ప్రార్థించాలి.


కవ్యవాహస్తథా సోమో యమశ్చై వార్యమాతథా ! 

అగ్నిష్వాత్తా బర్హిషదః సోమపాః పితృదేవతాః ॥ 

ఆగచ్ఛంతు మహాభాగా యుష్మాభిరక్షితా స్త్విహ । 

మదీయాః పితరోయే చకులే జాతాః సనాభయః ॥ 

తేషాం పిండ ప్రదానార్థమాగతో స్మి గయా మిమాం | (ఆచార 84/12-14)


No comments:

Post a Comment