Tuesday 14 May 2024

శ్రీ గరుడ పురాణము (175)

 


ఇతర మణులు


(పుష్యరాగ, కర్కేతన, భీష్మక, పులక, రుధిరాక్ష, స్పటిక, విద్రుమ)


పుష్యరాగ (పుష్కరాగ) మణి బలాసురుని చర్మం హిమాలయ పర్వతంలో పడిన చోటినుండి ఉద్భవించింది. ఇది మహాగుణ సంపన్నం. సంపూర్ణ పీత, పాండుర వర్ణముల సుందరకాంతులను వెదజల్లు పుష్యరాగాన్నే పద్మరాగమణిగా వ్యవహరిస్తారు. అదే లోహిత, పీతవర్ణాల కాంతులను వెలారుస్తుంటే 'కౌకంటక'మని వ్యవహరిస్తారు. పూర్ణలోహిత వర్ణము, సామాన్య పీత వర్ణము సంయుక్తంగా వుండి మెరిసే పాషాణాలను 'కాషాయక' మణులంటారు. ఈ మణుల పూర్వరూపమైన పుష్పరాగమణి వైదూర్యముతో సమానమైన మూల్యాన్నే కలిగి వుంటుంది. ఫలితం కూడా పురుషుల విషయంలో సమాన ఉన్నత ఫలమే. స్త్రీలు పుష్యరాగాన్ని ధరిస్తే పుత్రప్రాప్తి నొందగలరు.


కర్కేతనమణి పరమపూజ్యతమం. బలాసురుని రత్నబీజ స్వరూపాలైన గోళ్ళను వాయుదేవుడు అత్యంతాదరంతో గొనివచ్చి ప్రసన్నతాపూర్వంగా కమల వన ప్రాంతంలో వ్యాపింపజేశాడు. అవి పృథ్విపై కర్కేతన నామంతో జన్మించాయి. ఇవి రక్త, చంద్ర, మధు, తామ్ర, పీత, నీల, శ్వేత వర్ణాలలో లభిస్తున్నాయి. ఇన్ని రంగుల్లో దొరకడానికి కారణం రత్నవ్యాధి అనే దోషమని పెద్దల మాట. ఈ రత్నాలు కఠోరంగా వుండడానికీ అదే కారణం.


సంతాప, వ్రణ వ్యాధులు రత్నాలకు కూడా వుంటాయి. ఆ వ్యాధి లేకుండా స్నిగ్ధ, స్వచ్ఛ, సమరాగ, అనురంజిత, పీత, గురుత్వ ధర్మాలతో నిండి, విచిత్ర వర్ణ కాంతులీను కర్కేతనమణి విశుద్ధ, పరమపవిత్ర మణిగా పూజలందుకుంటుంది.


స్వర్ణపాత్రలో సంపుటితం చేసి అగ్నిలో వేసి తీస్తే అత్యధిక దేదీప్యమాన కాంతులతో ప్రకాశించే మణి విశుద్ధకర్కేతనమణి. ఇది సర్వరోగాలనూ నశింపజేయగలదు; కలిదోషాన్ని నివారించగలదు; కులవృద్ధినీ కలుగజేయగలదు; సుఖమునూ ఇవ్వగలదు. ఈ కర్కేతనాలను ధరించినవారు పూజలందుకోగలరు; ధనాఢ్యులు కాగలరు; బంధు బాంధవ సంపన్నులు, ప్రసన్నులు కాగలరు. దూషిత కర్కేతనాన్ని ధరించరాదు. అలా చేస్తే, అంటే ధరిస్తే, సర్వ కష్టాలూ సంప్రాప్తిస్తాయి.


భీష్మకమణి మహారత్నదాతయైన బలాసురుని వీర్యం హిమాలయ పర్వతప్రాంతాల్లో పడగా నేర్పడిన రత్నాకరంలో సముద్భవించింది. అక్కడి భీష్మకమణి శంఖ, పద్మ సమాన, సముజ్జ్వలములూ, మధ్యకాలీన సూర్య ప్రభాసమాన శోభలూ వెదజల్లుతూ వజ్రమంత తరుణంగా ఉంటుంది.

No comments:

Post a Comment