Friday 24 May 2024

శ్రీ గరుడ పురాణము (191)

 


ఒకనాడు గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడనే వణిజునికి ఒక ప్రేతం కనిపించి, 'ఓ వణిజుడా! నీవు గయాశీర్ష తీర్ధంలో నా పేరిట పిండదానాన్ని చేసి పెట్టు. నేను ఈ ప్రేత యోని నుండి విముక్తుడనౌతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది' అని చెప్పగా అతడలాగే చేశాడు. తరువాత విశాలుడు తన తమ్ములతో కలసి గయ అంతా కలయతిరిగి తన పితరులకు పిండప్రదానాలు చేయగా వారంతా, ప్రేతంతో సహా ముక్తులైనారు. గయ నుండి తన వూరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం, అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకొని మరల పుడమిపై పుట్టినపుడు విశాలదేశానికి రాజపుత్రునిగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులకు 'ఏయే సత్కార్యాలు చేస్తే మంచి పుత్ర సంతానమూ, సుఖజీవనమూ లభిస్తాయి?" అని అడిగాడు. వారు 'విశాల రాకుమారా! గయాతీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలూ తీరుతాయి' అని చెప్పారు.


విశాలుడు వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు గావించి వచ్చాడు. శీఘ్రమే పుత్రవంతుడైనాడు. ఒకరోజు అతనికి ఆకాశంలో ముగ్గురు పురుషులు దర్శనమిచ్చారు. అతడు వారికి సమస్కరించి 'మహాపురుషులారా! మీరెవరు?' అని అడిగాడు.


వారిలో శ్వేతవర్ణంలో నున్న పురుషుడు' నాయనా విశాలా?నేను నీ తండ్రిని నీ పుణ్యం వల్ల నేను స్వర్గానికి వెళుతున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్యను చేసి అవీచి నామక నరకంలో పడ్డాడు. ఆ శ్యామల వర్ణంలో నున్నవాడు నా తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు. నీవు గయా శీర్షతీర్ధంలో చేసిన పిండప్రదానం వల్ల నేను ప్రేత రూపం నుండీ, వారు నరకకూపం నుండీ విముక్తులపై స్వర్గానికి వెళుతున్నాము. నీకు శుభమగు గాక అని చెప్పి ఇతరులతోపాటు అంతర్జానం చెందాడు.


విశాలుడు సమర్ధవంతంగా రాజ్య పాలనం చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకాన్ని చేరుకున్నాడు.


గయాతీర్థంలో పిండప్రదానం చేసినప్పుడు ఈ క్రింది మంత్రాలను చదవాలి.


యేఽ స్మత్కు లే తు పితరో లుప్తపించోచక క్రియాః ॥ 

యే చాప్యకృత చూడాస్తు యేచ గర్భాద్విని స్మృతాః | 

యేషాం దాహో న క్రియా చ యేఽ గ్నిదగా స్తథా పరే ||

భూమౌ దత్తేన తృప్యంతు తృప్తా యాంతు పరాంగతిం |

మాతా పితామహశ్చైన తధైన ప్రపితామహః ॥ 

మాతా పితామహీ చైన తధైవ ప్రసితా మహీ । 

తథామాతా మహశ్చైవ ప్రమాతా మహ ఏవచ ॥ 

వృద్ధ ప్రమాతా మహశ్చ తథా మాతా మహీపరం | 

ప్రమాతామహీ తథా వృద్ధా ప్రమాతా మహీతివై ॥ 

అన్యేషాం చైవ పిండోఽయ మక్షయ్య ముపతిష్ఠతాం (ఆచార... 84/43-47)


'మా వంశంలో సరైన సంస్కారాలు జరగకముందే మరణించిన వారికి, మరణానంతర సంస్కారాలు సరిగా జరగని వారికి, నా తండ్రికి ఆయన పితరులైన స్త్రీ పురుషులకి, నా తల్లికి ఆమె పితరులైన స్త్రీ పురుషులకి ఈ నా గయా క్షేత్ర కృత పిండప్రదానాలు అక్షయాలై అందాలి గాక! వారంతా తృప్తులై ముక్తి చెందాలి గాక' అని దీని భావము


(అధ్యాయం - 84)


No comments:

Post a Comment