Wednesday 22 May 2024

శ్రీ గరుడ పురాణము (183)

 


దీనికుత్తరాన కనకానది పారుతోంది. దాని మధ్య భాగంలో నున్న నాభి తీర్ధానికి దగ్గరగా బ్రహ్మ సదస్తీర్థం నెలకొనివుంది. అది తనలో భక్తిశ్రద్ధలతో స్నానం చేసిన వారిని బ్రహ్మలోకానికి పంపగలదు. ఆ ప్రాంతంలోనే గల హంస తీర్థస్నానం సర్వపాప వినాశకరం. కోటి తీర్థం, గయాలోలం, వైతరణి ఇంకా గోమక తీర్ధం ఈ తీర్థాలలో పితరులకు తర్పణాలిచ్చి శ్రాద్ధాలు పెట్టినవాడు తనతో బాటు తన ఇరువది యొక్క తరాల వారికి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించగలడు. బ్రహ్మ తీర్థ, రామతీర్థ, అగ్నితీర్థ (సోమతీర్థ) రామహ్రాదినీ తీర్థాలలో శ్రాద్ధం పెట్టిన వాని పితరులు బ్రహ్మ లోకానికి వెళతారు. ఉత్తరమానసీ తీర్థంలో శ్రాద్ధ కర్మలు చేసిన వారికి పునర్జన్మ వుండదు. దక్షిణ మానసీ తీర్థం బ్రహ్మలోకప్రదాయకం. స్వర్గ ద్వారా తీర్థమూ అంతే. భీష్మ పర్వతంపై శ్రాద్ధ కర్మలను పొందినవారు నరకాన్ని సులభంగా దాటిపోతారు. గృద్ధేశ్వర తీర్థమునందు పెట్టబడు శ్రాద్ధం పితౄణ ముక్తిదం. 


ధేనుకారణ్యంలో శ్రాద్ధం పెట్టి తిలధేనువును దానం చేసి మరల స్నానమాచరించి అక్కడ వెలసిన ధేనుమూర్తిని దర్శించినవాడు నిస్సందేహంగా తన పితృజనులను బ్రహ్మలోకానికి చేర్చగలడు. ఇంద్ర, వాసవ, రామ, వైష్ణవ, మహానదీ తీర్థాలలో శ్రాద్ధానికీ అదే ఫలము. సూర్యోత్పన్న శక్తులైన గాయత్రి, సావిత్రి, సరస్వతుల పేరిట వెలసిన తీర్థాలలో స్నానాలు, తర్పణాలు, శ్రాద్ధకర్మలు, సంధ్యావందనాలు చేసినవాడు తన నూటొక్క తరాల పితరులను బ్రహ్మ లోకానికి గొనిపోగలడు.


ఇక్కడి బ్రహ్మ యోని తీర్థం మిక్కిలి ప్రత్యేకత గలది. ప్రశాంతమనస్కులై పితరులనే ఏకాగ్రచిత్తంతో ధ్యానిస్తూ ఈ తీర్థాన్ని నియమానుసారం దాటి పితృగణాలకూ దేవతలకూ తర్పణలిచ్చిన వారికి పునర్జన్మ వుండదు.


కాకజంఘా తీర్థంలో తర్పణలందుకొన్న పితరులకు అక్షయ తృప్తి కలుగుతుంది. ధర్మారణ్య, మతంగవాపీ తీర్థాలలో శ్రాద్ధాలు పెట్టిన మనుష్యునికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ధర్మకూప, కూపతీర్థాలలో చేసే కర్మలకు పితౄణ విముక్తి కలుగుతుంది. ఇక్కడి శ్రాద్ధాది కృత్యాలను ఈ మంత్రం చదువుతూ చేయాలి.


ప్రమాణం దేవతాః సంతు లోక పాలశ్చసాక్షిణః ।

మయాగత్య మతంగేఽస్మిన్ పితృణాం నిష్కృతిః కృతా ॥ (ఆచార...83/36)


రామతీర్థంలో స్నానం చేసి ప్రభాస, ప్రేతశిలా తీర్థాలలో శ్రాద్ధకార్యాలు చేసిన వాని పితరులు పరమానందభరితులౌతారు. దీని వల్ల వాని నుండి ఇరువది యొక్క తరాలు ఉద్దరింపబడతాయి. అలాగే ముండపృష్ఠాది తీర్థాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని గావించినవారికి బ్రహ్మలోకమునకు తమ పితరులను గొనిపోయే శక్తి కలుగుతుంది.


No comments:

Post a Comment