Thursday 16 May 2024

శ్రీ గరుడ పురాణము (177)

 


స్ఫటికరత్నం మనకు బలరాముడిచ్చిన వరం. ఈయన బలాసురుని మేధాభాగాన్నందు కొని కావేరి, వింధ్య, (నేటి చైనా), నేపాల ప్రాంతాల్లో ప్రయత్నపూర్వకంగా వెదజల్లాడు. ఆకాశ సమాన నీలవర్ణంలో తైల-స్పటిక అను పేరు గల రత్నాలు ఆయాప్రాంతాల్లో లభిస్తున్నాయి. ఇవి తెల్లకలువ, శంఖ వర్ణాల్లో వుంటాయి. ఈ ధవళ వర్ణమే కాక మరికొన్ని రంగుల్లో కూడా లభిస్తాయి. పాప వినాశనంలో ఈ మణికి సాటి లేదు. దీన్ని ధరిస్తే అన్ని పాపాలూ నశిస్తాయి. శిల్పకారులు దీనికి వెలకట్టగలరు.


విద్రుమమణి ఆదిశేషునిచే భూలోకానికి ప్రసాదింపబడింది. ఈయన బలాసురుని అంత్రభాగాన్ని గ్రహించి కేరళాది దేశాలలో వదిలాడు. ఈ మహాగుణ సంపన్నమైన విద్రుమ మణుల్లో కుందేలు రక్తం రంగులోనూ, గుంజాఫల లేదా జపాకుసుమ సదృశ ఎఱ్ఱటి వర్ణంలోనూ వున్నవి. శ్రేష్ఠతమాలుగా పరిగణింపబడుతున్నాయి. నీల, దేవక, రోమక దేశాలు ఈ మణులకు జన్మభూములు. అక్కడి విద్రుమమణులు చిక్కటి ఎరుపులో ప్రకాశిస్తుంటాయి. అన్యస్థానాల్లో కూడా విద్రుమాలు దొరుకుతున్నాయి గాని అవి ప్రశస్తాలు కావు. శిల్పకళలో విశేషమైన నేర్పు గలవారే వీటికి వెల కట్టగలరు. సుందరంగా, కోమలంగా, స్నిగ్ధంగా ఎఱ్ఱగా వుండే ఈ మణులను ధరించేవారికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది; అంతేకాక విషాదిక దుఃఖాలు దూరమవుతాయి" ఈ విధంగా వివిధ రత్నాలకు సంబంధించిన జ్ఞానాన్ని విష్ణువూ, బ్రహ్మా మనకు ప్రసాదించారు. 


(అధ్యాయాలు 74-80)

గంగాది తీర్థాల మహిమ


సూతుడు శౌనకాది మహామునులకు గరుడ పురాణాన్ని ఇంకా ఇలా చెప్పసాగాడు.


"శౌనకాచార్యాదులారా! ఇపుడు మీకు మన సమస్త తీర్థాలనూ వాటి మహిమనూ వినిపిస్తాను. అన్ని తీర్థాలలోనూ ఉత్తమము గంగ. గంగానది సర్వత్రా సులభమైనా హరిద్వార, ప్రయాగ, గంగా సాగర సంగమాల్లో దుర్లభం.


సర్వత్రసులభాగంగా త్రిషుస్థానేషు దుర్లభా ॥

గంగాద్వారే ప్రయాగే చ గంగాసాగర సంగమే ।


(ఆచార... 81/1,2)


మరణించేవానికి ముక్తినీ, బతికున్నవానికి భుక్తినీ కూడా ప్రసాదించే ప్రయాగ పరమశ్రేష్ఠ తీర్థం. ఈ మహాతీర్థంలో స్నానం చేసి తమ పితరులకు పిండ ప్రదానం చేసేవారు తమ తమ పాపాలన్నీ పూర్తిగా నశింపగా సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు.


No comments:

Post a Comment