Wednesday 29 May 2024

శ్రీ గరుడ పురాణము (189)

 


ఇలా ప్రార్ధించి ఫల్గుతీర్థంలో పిండం పెట్టి పితామహుడైన బ్రహ్మదేవునీ, గదాధరుడైన మహావిష్ణువునీ దర్శించిన వానికి పితృణం పూర్తిగా తీరుతుంది. అలా చేసిన వ్యక్తి తరువాత ఫల్గు తీర్థంలో మరల స్నానం చేసి గదాధరుని దర్శనం చేసుకుంటే అతడు ఉద్దరింపబడుటే గాక తన తండ్రితో తనతో సహా ఆపై పదితరాల వారిని కూడా సముద్ధరించగలడు. తన తరువాతి పది తరాల వారిని కూడా ఉద్దరించగలడు.


భక్తుడు, సంప్రదాయ విధేయుడునైన మహావ్యక్తి గయాక్షేత్రాన్ని చేరుకున్నాక మొదటి రోజే చేయవలసినది పైన చెప్పబడింది.


ద్వితీయ దినం నాడు ధర్మారణ్యం చేరుకొని అక్కడి మతంగవాపిలో శ్రాద్ధకర్మం, పిండప్రదానం చేయాలి. ధర్మారణ్యంలోకి వెళ్లడం వల్ల మనుష్యునికి వాజపేయ యజ్ఞ ఫలమూ, ఆ తరువాత బ్రహ్మ తీర్థం వెళ్ళడం వల్ల రాజసూయ, అశ్వమేధ యజ్ఞాల ఫలాలూ దక్కుతాయి. తరువాత కూప, యూప నామక తీర్థాల మధ్య శ్రాద్ధ, పిండోదక కృత్యాలను గావించాలి. కూపోదకం ద్వారా చేసే శ్రాద్ధాది కార్యాలకు అక్షయ ఫలాలు లభిస్తాయి.


మూడవరోజు బ్రహ్మసద తీర్థానికి పోయి అక్కడస్నానం చేసి తర్పణాలిచ్చి వెంటనే యూప, కూప తీర్థాల మధ్య శ్రాద్ధాన్నీ పిండప్రదానాన్నీ చేయాలి. తరువాత గో ప్రచార తీర్థానికి పోవాలి. అక్కడ బ్రహ్మచేత కల్పింపబడిన బ్రాహ్మలుంటారు. వారిని పూజించి, సేవించినంత మాత్రాన ఆ మనుజుని పితృజనులు మోక్షాన్ని పొందుతారు. యూపతీర్ధానికి భక్తిగా ప్రదక్షిణ చేస్తే వాజపేయ యజ్ఞఫలం సిద్ధిస్తుంది.


నాలుగవ రోజు ఫల్గుతీర్థంలో స్నానం చేసి దేవతలకూ పితరులకు తర్పణాలిచ్చి గయాశీర్షానికి పోయి అక్కడి రుద్రపదాది తీర్థాలలో పితరులకు శ్రాద్ధాలు పెట్టాలి. ఆ తరువాత వ్యాస, దేహిముఖ, పంచాగ్ని, పదత్రయ నామక తీర్థాలలో పిండదానాలనిచ్చి, సూర్య, సోమ, కార్తికేయ తీర్థాలకు పోయి అక్కడ చేయు శ్రాద్ధ కర్మలకు అక్షయ ఫలాలుంటాయి.


నవదైవత్వ, ద్వాదశ దైవత్యములను పేర్లతో రెండు రకాల శ్రాద్ధాలున్నాయి. వీటిని గయలోనే పెట్టాలి. అన్వష్టక అనగా పుష్ప, మాఘ, ఫాల్గున మాసాల్లో నవమీ తిథినాడు, వృద్ధి చంద్ర నవమీ తిథులలోనూ లేదా తల్లి మృతి చెందిన తిథినాడు ఈ క్షేత్రంలో తల్లికి శ్రాద్ధకర్మను చేయవచ్చును. మిగతా చోట్ల తండ్రి కర్మతో కలిపే తల్లిది కూడా చేయాలి.


శ్రాద్ధంతు నవదైవత్వం మర్యాద్ ద్వాదశ దైవతం । 

అన్వష్టకాసు వృద్ధౌ చ గయా యాం మృతవాసరే || 

అత్ర మాతు: పృథక్ శ్రాద్ధ మన్యత్ర పతినా సహ ! (ఆచార... 84/24,25)


దశాశ్వమేధ తీర్ధంలో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకొని రుద్రపాదాలను స్పృశించిన వానికి పునర్జన్మ వుండదు.


No comments:

Post a Comment