Thursday 30 May 2024

శ్రీ గరుడ పురాణము (190)

 


గయాశిర తీర్ధంలో శ్రాద్ధమును పెట్టడాన్ని మించిన పుణ్యకర్మలేదేమో! ఎందుకంటే విత్త పరిపూర్ణ సమస్త పృథ్విని మూడుమార్లు దానం చేస్తే వచ్చే పుణ్యం ఈ శ్రాద్ధకర్మ వల్ల లభిస్తుంది. ఇక్కడ శమీపత్ర పరిమాణంలో పిండాలను తయారుచేసి పెట్టాలి. దాని వల్ల పితృగణాల వారు దేవగణాల వారై పోతారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానమూ అవసరం లేదు.


త్రిర్వేత్తపూర్ణ పృథివీం దత్త్వా యత్ ఫలమాప్నుయాత్ । 

సతత్ఫల మవాప్నోతి కృత్వాశ్రాద్ధం గయా శిరే ॥ 

శమీపత్ర ప్రమానేన పిండం దద్యాడ్ గయాశరే ॥ 

పితరోయాంతి దేవత్వం నాత్ర కార్యా విచారణా


(ఆచార...84/26-28)


ముండపృష్ఠ తీర్ధంపై పరమేశ్వరుడు తన పాదాలను మోపి విశ్రమించాడు. అందుచేత ఈ తీర్థంలో స్వల్పమాత్రం చేసినా ఘన తపశ్శక్తి, అత్యధిక ఫలాలూ కలుగుతాయి.  


గయాశీర్ష తీర్థంలో పేరు పేరునా ఎవరెవరికైతే పిండాలు పెట్టబడతాయో వారిలో నరకంలో వున్నవారు స్వర్గానికి పోగా, స్వర్గంలో నున్నవారు మోక్షాన్ని పొందుతారు. 


ముండపృష్ఠే పదంన్యస్తం మహాదేవేన ధీమతా ॥ 

అల్పేన తపసాతత్ర మహాపుణ్యమవాప్నుయాత్ । 

గయాశీషేతుయః పిండాన్నామ్నా యేషాంతు నిర్వపేత్ ॥ 

నరకస్థా దివం యాంతి స్వర్ణస్థా మోక్షమాప్నుయుః (ఆచార... 84/28-30)


అయిదవ రోజు గదాలోల తీర్ధంలోస్నానం చేసి అక్కడి అక్షయపటం క్రింద పిండదానం చేసిన వారు తమ కుటుంబం సమస్తాన్నీ ఉద్దరించగలరు. అక్షయ వట మూలం వద్ద శాక, ఉష్ణోదక సహితమైన భోజనాన్ని పెడితే కోటిమంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. ఆ తరువాత బ్రహ్మదేవుని పూజించి, దర్శించి అక్షయ లోకాలను పొందవచ్చు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వేరే ఆలోచన లేకుండా భక్తిశ్రద్ధలతో గావించిన వారి నూరుతరాలు ఉద్దరింపబడతాయి.


ఏష్టవ్యా జపానః పుత్రాయ చ్యేకోఽ పి గయాంప్రజేత్ (ఆచార... 84/33)


No comments:

Post a Comment