Thursday 23 May 2024

శ్రీ గరుడ పురాణము (184)

 


గయాక్షేత్రంలో తీర్థంకాని చోటులేదు. అక్షయ ఫలాలూ బ్రహ్మలోక ప్రాప్తి అడుగడుగునా లభింపజేసే పుణ్యస్థాన సముదాయం గయ.


గయాయాం నహి తత్ స్థానం

యత్ర తీర్థం న విద్యతే |

పంచక్రోశో గయాక్షేత్రే

యత్ర తత్ర తు పిండదః ॥

అక్షయం ఫల మాప్నోతి

బ్రహ్మ లోకం నయేత్ పితౄన్ |


(ఆచార...83/39,40)


స్వపిండాన్ని జనార్దనుని చేతిలో పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి.


ఏషపిండో మయా దత్త స్తవ హస్తే జనార్దన |

పరలోకం గతే మోక్షమక్షయ్యముపతిష్ఠతాం ॥


(ఆచార...83/41)


గయాక్షేత్రంలో నెలకొనియున్న ధర్మపృష్ఠ, బ్రహ్మసర, గయాశీర్ష, అక్షయ వట తీర్థాలలో పితరుల కోసం చేసే కర్మలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ధర్మారణ్య, ధర్మపృష్ఠ, ధేనుకారణ్య తీర్థాలను దర్శించిన వ్యక్తి తన ఇరవై తరాలను ఉద్ధరించగలడు.


ఇక్కడి మహానది యొక్క పశ్చిమభాగాన్ని బ్రహ్మారణ్యమంటారు. దానికి తూర్పులో బ్రహ్మసనం, నాగాద్రి పర్వతం, భరతాశ్రమం వున్నాయి. భరతాశ్రమంలోనూ, మతంగ పర్వతం పైనా పితృకర్మలను చేయాలి.


గయాశీర్ష తీర్థానికి దక్షిణంలోనూ మహానదీ తీర్ధానికి పశ్చిమంగానూ చంపక వనమొకటుంది. అందులో పాండుశిలయను తీర్థముంది. ఆ తీర్థంలో తదియనాడు పెట్టే శ్రాద్ధం పరమప్రశస్తం. ఆ తీర్థానికి దగ్గర్లో నిశ్చిరా మండల, మహాహ్రద, కౌశికీ ఆశ్రమాలున్నాయి. ఈ పవిత్ర తీర్థాల్లో చేయబడు శ్రాద్ధకర్మలు అక్షయఫలితాలనిస్తాయి.


వైతరణీ నదికి ఉత్తరంలో తృతీయా అను పేరుగల జలాశయమొకటుంది. అక్కడే క్రౌంచపక్షులు నివసిస్తాయి. ఇక్కడ శ్రాద్ధం పెట్టేవానికీ, పితరులకూ స్వర్గం లభిస్తుంది.


No comments:

Post a Comment