Wednesday 15 May 2024

శ్రీ గరుడ పురాణము (176)

 


తమ కంఠంలో స్వర్ణసూత్రంలో ముడిపెట్టి ఈ విశుద్ధ భీష్మక మణిని ధరించినవారు సదా సుఖసమృద్ధితో సంపదల కలిమి కలుగగా జీవించగలరు. వీరు వనాలలో తిరుగుత్నుపుడు ఆ మణిని దూరం నుండే చూసి సింహ, వ్యాఘ్ర, శరభాది మహామృగాలూ, తోడేళ్ళవంటి హింస్రక జంతువులూ కూడా మరింత దూరం పారిపోతాయి. వారికి ఏ రకమైనా పీడా సోకదు; ఏ విధమైన భయమూ కలుగదు. మానవులు కూడా వారిని అపహాస్యం చేయడానికి గానీ నిందించడానికి గానీ జడుస్తారు.


ఈ భీష్మకమణినిపొదిగిన ఉంగరాన్ని ధరించి పితృకార్యం చేస్తే ఆ పితరులు కొన్నేళ్ళ దాకా గొప్ప సంతృప్తిని పొందుతారు. దీని ప్రభావం వల్ల సర్ప, వృశ్చికాదుల విషప్రభావం మణిధారి వంటికి ఎక్కదు. జల, శత్రు, చోర భయముండదు. నాచు మరియు మబ్బు రంగులోనుండి కఠోరమై, పచ్చటి కాంతులను వెదజల్లుతూ, మలినద్యుతినీ వికృతవర్ణాన్నీ కలిగియుండే భీష్మకమణిని దూరం నుండే చూసి మరింత దూరంగా తొలగిపోవాలి. అది అంత ప్రమాదకరం.


పులకమణి కూడా వాయుదేవుని చలవే. ఆయన బలాసురుని గోళ్ళ నుండి భుజాల దాకా గల శరీరాన్ని విధ్యుక్తంగా పూజించి శ్రేష్ఠ పర్వతాలలో, నదుల్లో, ఉత్తర దేశంలోని కొన్ని ప్రసిద్ధ స్థానాల్లో స్థాపితం చేశాడు. దశార్ణ, వాగదర, మేకల, కళింగాది దేశాల్లో ఈ ప్రకాశరూపియైన బీజం నుండి వచ్చిన పులకమణులు గుంజాఫల, అంజన, మధు, కమలనాళ వర్ణాలలో వుంటాయి. గంధర్వ, అగ్ని దేశాలలో పుట్టిన పులకమణులు అరటి పండు రంగులో వుంటాయి. ఈ వర్ణమణులన్నీ ప్రశస్తాలే. కొన్ని పులకమణులు విచిత్ర భంగిమలతో శంఖ, పద్మ, భ్రమర, సూర్య ఆకారాలలో వుంటాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం గుచ్చి మెడలో ధరిస్తే అసంఖ్యాకంగా సుఖాల్నీ, శుభాల్నీ కలుగజేస్తాయి. ఐశ్వర్యాభివృద్ధినీ ప్రాప్తింపజేస్తాయి. కొన్ని పులకమణులు మాత్రం మిక్కిలి భయంకరమైనవి. ముఖ్యంగా కాకి, గుఱ్ఱం, గాడిద, తోడేలు, రూపాలతో నున్నవి, మాంసంతో రక్తంతో నున్న గ్రద్ద ముఖ సమాన వర్ణంలో నున్నవి మృత్యుదాయకాలే. శ్రేష్ఠ, ప్రశస్త ఏకపల మాత్ర భారమున్న పులకమణి ధర అయిదువందల ముద్రలు పలుకుతుంది.


రుధిరాక్షరత్నం అగ్నిదేవుని అనుకంప (దయ) వల్ల మనకు దక్కింది. దానవరాజు బలాసురుని శరీరంలోని కొన్ని అంశాలను నర్మదానదీ తీర ప్రాంతంలోనూ మరికొన్ని అంశాలను దానికి దిగువ భూములలోనూ స్థాపించిన అగ్నిదేవుడే మనకు రుధిరాక్షరత్నం లభించడానికి కారకుడు. ఎఱ్ఱగా చిలకముక్కు రంగులోనూ, ఇంద్రగోప కీటవర్ణంలోనూ ఈ మణులు దొరుకుతున్నాయి. కొన్ని తెల్లగా నుండి మధ్య భాగంలో పాండుర వర్ణంతో అత్యంత విశుద్ధంగా వుంటాయి. ఆ రుధిరాక్షలు ఇంద్రనీలమణితో సమానమైన శక్తులను కలిగి వుంటాయి. ఈ రత్నాలను ధరించేవారికి అన్ని ఐశ్వర్యాలూ, భృత్యాది అభివృద్ధులూ అబ్బుతాయి. దీనిని పాకక్రియ ద్వారా శోధన చేస్తే దేవ వజ్రంలా మెరుస్తుంది.


No comments:

Post a Comment