Thursday 1 August 2024

శ్రీ గరుడ పురాణము (252)

 


కుక్కకాటుకి గురైనవాడు ఔషధసేవనం గావించి గాయత్రి మంత్రాన్ని జపిస్తే అశౌచం పోతుంది. స్వయంగా దాన్ని జపించే అర్హత లేనివారు బ్రాహ్మణునెవరినైనా ఆశ్రయించి ఆయన చేత ఈ జపాన్ని చేయించాలి. చండాలాదుల ద్వారా చంపబడిన బ్రాహ్మణుడు స్వయంగా అగ్నిహోత్రి అయితే ఆయనను లౌకికాగ్నితో దహనం చేయవచ్చును. ఆయన అస్థికలను సేకరించి మరల మంత్రపూర్వకంగా ఆయన యొక్క అగ్నిహోత్రశాల నుండి అగ్నిని తెచ్చి, అంతకు ముందే పాలతో శుద్ధి చేసిన ఆయన అస్థికలను అందులో దహనం చేయాలి. వ్యక్తి పరదేశంలో మరణిస్తే ఇక్కడి పరిజనులు తమ గృహాలలోనే కుశలతో ఆ వ్యక్తి శరీరాన్ని తయారుచేసి అగ్నికి ఆహుతిచేయాలి. ఆ పరదేశ మృతుడు అగ్నిహోత్రియైతే మృగచర్మంపై ఆరువందల పలాశ ఆకులను అతని ఆకారంలో పఱచి శిశ్నభాగంలో శమీ, వృషణభాగంలో అరణీ పెట్టి కుడిచేతి జాగాలో అన్నం కుండనీ ఎడమచేతి జాగాలో యజ్ఞియపాత్రనీ వుంచాలి. వక్షోభాగంలో సోమరసం తయారీలో వాడే రాతినుంచాలి. ముఖభాగంలో నేతిలో ముంచిన తిలలనూ, తండులాలనూ నేత్రాల వద్ద నేతికుండనూ ఉంచాలి. కనులు, చెవులు, ముక్కు, నోరు ప్రాంతాలలో చిన్న చిన్న బంగారు ముక్కలనుంచే పద్దతి కూడా వుంది. ఇలా అగ్నిహోత్రం యొక్క సమస్త ఉపకరణాలనూ వుంచి ఆ అగ్నిహోత్రి ఊహాకల్పిత కళేబరాన్ని 'అసౌస్వర్గాయ లోకాయ స్వాహా' అనే మంత్రాన్ని చదువుతూ నేతిని ఒక ఆహుతి నిచ్చి... అగ్నికి ఆహుతి చేస్తే ఆయనకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.


హంస, చిలుక, క్రౌంచం, చక్రవాకం, కోడి, నెమలిలలో దేనిని వధించినా ఒక పగలూ ఒక రాత్రీ ఉపవాసం చేస్తే పాపం పోతుంది. నాలుగు కాళ్ళ పశువును (గోవును కాదు) దేనిని వధించినా ఒక రోజంతా నిలబడి, ఉపవసించి, గాయత్రిని జపిస్తే పాపశాంతి కలుగుతుంది.


శూద్రుని వధిస్తే కృచ్ఛవ్రతం చేయాలి. వైశ్యుని హత్య చేస్తే అతికృచ్ఛవ్రతము చేయాలి. క్షత్రియుని చంపితే ఇరవై రెండూ, బ్రాహ్మణుని మృతి నొందిస్తే ముప్పదీ చాంద్రాయణ వ్రతాలు చేయాలి".


(అధ్యాయం 107)


No comments:

Post a Comment