Monday 28 January 2013

గంగావతరణం(13)

ఓం
గంగావతరణం(13)

ఈ గంగ దేవలోకంలో మందాకిని అని పేరుతోనూ,భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది, పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు. దీన్ని ఉద్యేశించే గంగకు త్రిపధగ అనే పేరు వచ్చింది. త్రిపధగ అంటే మూడులోకాల్లో ప్రవహించేదని అర్దం.

శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ 7 పాయలుగా విడిపోయింది. అందులో మూడుపాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి.  వాటికి లాధిని, నళిని, పాధిని అని పేర్లు. మూదు పాయలు పశ్చిమదిక్కుకు వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అని ఆ 3 పిలువబడుతున్నాయి. మిగిలిన  పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది. అదే భాగీరథి.

రామాయణంలో చాలా తక్కువ సంఘటనలకు మాత్రమే ఫలశృతి చెప్పారు వాల్మీకి మహర్షి.

ఫలశ్రుతి :
ఈ గంగావతరణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తలమీద గంగపడుతున్నట్టుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతరణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా? అన్న సందేహం లేకుండా మొత్తం కధను మనసులో ఊహించుకుంటారో, అటువంటి వారికి ఇంతకముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలే తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశృతి చెప్పారు.

ఇటువంటి పరమపవిత్రమైన గంగావతరణాన్ని సోమవారం నాడు పూర్తిచేయడం మరింత పుణ్యప్రదమైనది.


రామాయణం మనకిస్తున్న సందేశం ఏమిటి?

ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు భగీరథుడు. తన కోసం కాదు, తన పితృదేవతలను ఉద్దరించడానికి. మనం రామాయణానికి వారసులం, మనం మన తల్లిదండ్రులను నిరంతరం, ముఖ్యంగా పెద్దవయసులో చూసుకోవాలి, వారికి ఆ సమయంలో కావలసినవి ప్రేమలే. వారిని వృద్ధాశ్రమాల్లో పడేయడం, సూటిపోటి మాటలనడం, భారంగా భావించడం లాంటివి చేయకూడదు. కాలక్రమంలో వారు మరణిస్తే వారికి చేసే శ్రాద్ధకర్మ తప్పకుండా ప్రతి సంవత్సరం చేయాలి. అలాగైన మనం వారి జ్ఞాపకాలతో ఒక్క రోజైనా గడుపుతాం. మన తల్లిదండ్రులు, తాతముత్తాతల గురించి ఆ రోజైన మన పిల్లలకు తెలుస్తుంది.

పర్యావరణాన్ని, ప్రకృతిని, భూమాతను కాపాడుకోవాలి. సాక్షాత్ బ్రహ్మదేవుడే ఈ గంగావతరణంలో చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని భూమాతను భూతాపం నుండి రక్షించాలి. నదులు పవిత్రమైనవి. మనకు తల్లితో సమానం. అందుకే వాటిని కలుషితం చేయకూడదు.   హిందూ ధర్మాన్నే ఆచరించండి. " స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ", హిందువుగా జీవించండి. హిందువుగానే మరణించండి.

ఇందులో అతికొద్ది భాగంతప్ప మిగితాది మొత్తం పూజ్య గురువులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గంగావతరణం ప్రవచనం విని వ్రాసినదే.

సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు
ఓం నమః శివాయ
ఓం శాంతిః శాంతిః శాంతిః

No comments:

Post a Comment