Thursday 24 January 2013

గంగావతరణం(9)


ఓం
గంగావతరణం(9) 

భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒంటరిగా కాకుండా సమస్త దేవతలకు కూడి ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు సంతోషించాను, ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు భగీరథుడు " నా పితృ దేవతలు కపిలమహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు. వారి మీద నుండి దేవలోకంలో ఉండే గంగ ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమలోకాలు పొందలేరు. అందువల్ల గంగా వారి భస్మరాశుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలివ్వండి. అలాగే నాకు సంతానం కలగాలన్నాడు ". వరం ఇస్తున్నా అన్నాడు బ్రహ్మదేవుడు.

నీ రెండవకోరిక ఉందే అది సులువైనది. కాని మొదటి కోరిక, గంగను భూమికి తీసుకురావడం, అది అంత సులభమైన పని కాదు. గంగ భూమి మీద పడితే ఈ భూమి బద్దలవుతుంది. గంగను తట్టుకునే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగను పట్టగల సమర్ధుడు పరమశివుడు ఒక్కడే. అందువల్ల ఆయన గురించి తపస్సు చేయమన్నాడు.

ఎవరి కోసం భగీరథుడు ఇన్నిన్ని సంవత్సరములు, ఇన్ని సార్లు తపస్సు చేస్తున్నాడు. తన కోసం కాదు. తన పితృదేవతలకోసం. మనిషై పుట్టినవాడి కర్తవ్యం ఏమిటి? పితృదేవతలను ఉద్దరించడం, వారికి ఉత్తమ గతులు కల్పించడం. అందుకే భగీరథుడు గంగను భుమికి రావాలని వరం అడిగాడు. తాను వివాహం చేసుకుని సంతానం పొంది పితృ ఋణం తీర్చుకోవడం కూడా పుట్టిన ప్రతి మనిషి కర్తవ్యం. అందుకే తనకు సంతానం కలగాలని కోరుకున్నాడు.

మనకు రామాయణం నేర్పుతున్నదేమిటి? కోడుకై పుట్టినవాడు తండ్రి దగ్గర ఆస్తులు తీసుకోవాలని ప్రయత్నించడం కాదు. తన తల్లిదండ్రులు బ్రతికున్నతకాలం వారిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాలి. వారు మరణిచాక వారికి ఉత్తమలోకాలను కల్పించేందుకు పిండప్రధానం చేయాలి, తర్పణలివ్వాలి, వారి మరణతిధి రోజున వారికి పితృకర్మ చేయాలి.

కాని ఈ కాలం వారు చేస్తున్నది, బ్రతికున్నప్పుడే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు, పసివయసు నుండి ఎంతో ప్రేమగా పెంచినా, ముసలివయసు రాగానే తల్లిదండ్రులను చూసూకోవడం మా వల్ల కాదు, వీరితో మేము సర్దుకుని బ్రతకలేమంటూ వారిని తిట్టిపోస్తూ ఇంటిలోనుండి తోసేయడం. బ్రతికిఉండగానే వారిని చంపేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. ఇక వారు చనిపోయాక తర్పణలివ్వడం వృధా ఖర్చుగా భావిస్తున్నారు. రామాయణం చెప్పినవేవి ఆచరించకుండా శ్రీ రాముడి ఆలయలు చుట్టూ తిరుగుతూ, శ్రీ రాముడి దీవెనలు పొందాలని చూడడం మూర్ఖత్వమే అవుతుంది.            

మళ్ళీ భగీరథుడు పరమశివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. కాలి బొటనువేలి చివరి భాగం మీద నిలబడి ఒక్క సంవత్సరం తపస్సు చేశాడు. శివుడు త్వరగా వరాలిస్తాడు. అందుకే ఆయన బోళాశంకరుడు, భక్త వశంకరుడని పేర్లు. ఓం నమః శివాయ. ఆయన ఒక్క సంవత్సరానికే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవ్వగానే నీకే వరం కావాలి అని కూడా అడగలేదు. గంగను నా తలమీద జటాజూటంలో ధరిస్తాను అన్నాడు శివుడు. అడగకుండానే వరలిచ్చాడు శివుడు.

to be continued....................

No comments:

Post a Comment