Friday 24 April 2015

24 ఏప్రియల్ శ్రీ సత్యసాయి బాబా వర్ధంతి

24 ఏప్రియల్ శ్రీ సత్యసాయి బాబా వర్ధంతి 
ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో 24 నవంబరు 1926 లో ఈశ్వరమ్మ, పెద్దవెంకమరాజులకు జన్మించారు సత్యనారాయణరాజు (సత్య సాయి బాబా). 20 వ శతాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, గొప్ప మానవతావాది ఈయన. 24 ఏప్రియల్ 2011 న నిర్యాణం చెందారు.
"మీ హృదయాలలో ప్రేమ అనే దీపం వెలిగించి దానిని అనుదినం ప్రజ్వలింపజేయడానికే నేను వచ్చాను" అని తన సందేశాన్ని ప్రపంచానికి పంచారు సత్యసాయి. Love all, Serve all (అందరిని ప్రేమించండి, అందరికి సేవ చేయండి) అన్నది సత్యసాయి వారి సందేశం. 
ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో 1200 సత్యసాయి కేంద్రాలను సత్యసాయి సంస్థ వారు స్థాపించారు. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. సత్యసాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించి, అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఏ విధమైన ఖర్చులు లేకుండా ఉచితంగా వైద్యసేవలు, ఆపరేషన్లు చేస్తున్నారు.
166 దేశాల్లో అనేక విద్యాలయాలు, ఆసుపత్రులు, ఇతర సేవాసంస్థలను స్థాపించారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి విశ్వవిదాలయం, విమానాశ్రయము కట్టించారు. పుట్టపర్తిలో ఉన్న విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తితో కూడినది. ప్రతిభ ఆధారంగా మాత్రమే అందులోకి ప్రవేశం ఉంటుంది. అత్యంత నాణ్యతా ప్రమాణాలకు ఆ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. ఈయన విద్యాసంస్థల్లో చదువుకున్నవారు ప్రపంచంలో అత్యంత గొప్ప కంపెనీల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. మంచి విలువలు కలిగి, నిజాయతీగా జీవిస్తున్నారు, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటున్నారు. మంచి ప్రతిభను కనబరుస్తున్నారు. కులమత ప్రాంతాలకు అతీతంగా అందరికి వేదవిద్యను అందించి, కులవ్యవస్థ నిర్మూలనకు తనవంతు కృషి చేశారు.
అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలకు, చెన్నై నగరానికి త్రాగు నీరు అందించడానికి లక్షల రూపాయల ప్రాజెక్టులు చేపట్టి విజయవంతం చేశారు. ఆ జిల్లాలో ఈ రోజు జనం దాహం తీరుతోదంటే అందుకు కారణం సత్యసాయిబాబావారి సేవా కార్యక్రమాలు తప్ప వేరొకటి కావు. ప్రభుత్వాలు చేయలేని పనిని నిస్వార్ధంగా చేశారు సత్యసాయిబాబా. సత్యసాయి బాబా గారు కనుక ఇంకొనెళ్ళు బ్రతికి ఉంటే, మహబూబ్‌నగర్ జలకళతో కళకళలాడేది.
ఎక్కడైన విదేశాల్లో స్థిరపడిన భారతీయులను చూసి ఉంటాం, కానీ పుట్టపర్తిలో మాత్రం విదేశీయులు వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. పూర్తి హిందూ సంప్రదాయం దుస్తులు ధరించి, ముఖాన బొట్టు పెట్టుకుని కనిపిస్తారు. హిందూ సంస్కృతిని అవలంబిస్తున్నారు. 
ఈయన మీద అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే బిల్ ఐట్కిన్ అనే సాయి భక్తుడు, ధార్మిక విశ్లేషకుడు, యాత్రికుడు,"Sri Sathya Sai Baba: A life" అనే పుస్తక రచయిత చెప్పిన ప్రకారం బాబా మీద అపనిందలు అధికంగా బాధ్యతా రహితమైనవి, దురుద్దేశ్య పూర్వకమైనవి, పరిశీలనకు నిలవనివి. కాకపోతే బి.బి.సి. వంటి ఛానళ్ళు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించడానికి కారణం 'చర్చి' వ్యవస్థకు పోటీ నిలవ గలిగే ఉద్యమాల పట్ల వారికున్న అనాదరణా భావమేట.  ఎందుకంటే బిబిసి పోప్, క్రైస్తవ ఆదేశాలకు, ప్రయోజనాలకు లోబడి పనిచేస్తుంది. 166 దేశాల్లో ప్రజలు ప్రేమతో సత్యసాయిబాబావారిని అనుసరించడం వల్ల ఆయా దేశాల్లో క్రైస్తవం దెబ్బతింటుందని, ఈయన పోప్‌ను కూడా ఓడించి ప్రపంచాన్ని శాసిస్తారన్న భయంతో చర్చి ప్రోద్బలంతో అన్యమతాలపై ద్వేషం నింపుకున్న బి.బి.సి బాబాపై బురదచల్లే కార్యక్రమాలు చేపట్టింది. దాన్ని భారతీయ కుహనా లౌకిక మీడియా అందిపుచ్చుకుంది. కానీ బాబాపై ఆరోపణలను ఋజువు చేయలేకపోయాయి.
సత్యసాయిబాబా గారి సనాతన హిందూ ధర్మ వ్యాప్తికి చేసిన సేవ ఎనలేనిది. హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను ప్రపంచం వ్యాప్తంగా అనేకమందికి పరిచయం చేశారు. అందుకు ఉదాహరణయే ఈ వీడీయో. చూడండి, విదేశీయులు పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి సమాధి సమక్షంలో వేదాన్ని స్వరంతో ఎంత చక్కగా చదువుతున్నారో. అద్భుతం, అత్యధ్బుతం ఈ వీడియో. అందరూ తప్పక వీక్షించవలసినది.

Originally Posted: 23 April 2013
1st Edit: 23 April 2014
2nd Edit: 23 April 2015

No comments:

Post a Comment