Sunday 5 April 2015

హిందూ ధర్మం - 153 (వ్యాసుడు వేదవిభాగం చేయుట)

వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపుడు. అనంతమైన వేదాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవడం కలియుగంలో మానవులకు సంభవం కాదని, అసలు మొత్తం వేదం అధ్యయనం చేయుటకు వారి ఆయుర్దాయం సరిపోదని గ్రహించి, వారి మేధాశక్తి తక్కువగా ఉంటుందని, వేదంలో కొద్ది భాగాన్ని మాత్రమే గ్రంధస్థం చేశారు. వేదం అంతా ముఖ్యమైనదే అయినా, అందులో కూడా అతి ముఖ్యమైనది, కనీసం మానవులకు తెలియవలసిన భాగాన్ని నాలుగు వేదాల నుంచి సేకరిచి, వాటిని తిరిగి సంకలనం చేశారు. ఆ భాగాల్లో మిగిలిన అన్ని భాగాల యొక్క స్పర్శ ఉండేలా చూశారు. వేదం కోటి భాగాలనుకుంటే అందులో కేవలం 1 వంతు మాత్రమే వ్యాసుడు గ్రంధస్థం చేశారు.

అలా వ్యాసుడు తిరిగి వేదవిభాగం చేసి, నాలుగు వేదాలను గ్రంధస్థం చేశారు. అవే ఋగ్ వేదం, యజుర్ వేదం, సామవేదం, అధర్వణ వేదం. వాటికి అశ్వలాయనుడు మొదలైన మహర్షులు రాసిన వ్యాఖ్యానాలను చేర్చారు (వేదాలకు ఋషులు రాసిన వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారు). అవేగాక ఆరణ్యకాలు, ఉపనిషత్తులను కూడా వాటికి జోడించి వేదానికి సమగ్రమైన రూపాన్నిచ్చారు. అనంతమైన వేదాన్ని విభాగం చేశారు కనుక ఆయనకు వేదవ్యాసుడనే పేరు వచ్చింది. అప్పటివరకు వారి పేరు కృష్ణద్వైపాయనుడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. వ్యాసుడు వేదాన్ని గ్రంధస్థం చేశారు, అనగా వేదాన్ని ఒక పుస్తక రూపంగా అందించారు, కానీ ఆయన వేదాలను రచించలేదు. వేదం అపౌరుషేయం (మానవుల చేత రచించబడినది కాదు), వేదములు ఈశ్వరీయములు (ఈశ్వర ప్రసాదితములు).

వ్యాసుడే లేకుంటే ఇంత జ్ఞానం మానవజాతికి అందేది కాదు. అందువలననే 'వ్యాసోఛిష్టం జగత్సర్వం' అంటారు, వ్యాసుడు ఉఛ్చిష్టమే (వదిలివేసిన భాగం / ఎంగిలి) ఈ జగత్తంతా అని. మానవజాతికి ఇంత మేలు చేసిన వ్యాసుడిని స్మరించుకుని, పూజించి, కృతజ్ఞతలు తెలుపడం కోసం ఆషాఢ పూర్ణిమను వ్యాసపూర్ణిమగా, గురు పూర్ణిమగా జరుపుకుంటారు. నిజానికి గురుపూర్ణిమ రోజున మాములు గురువులను కాదు, వ్యాసుడినే పూజించాలి. తమతమ గురువులలో వ్యాసుడిని చూసుకోవాలి. వ్యాసుడు చేసిన మేలుకి ఇప్పటికి మానవజాతి ఋణపడి ఉంది.

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||

వేదాలను గ్రంధస్థం చేసిన తర్వాత తన 4 శిష్యులకు ఒక్కో వేదాలను నేర్పి, వాటిని అప్పగించి వేదప్రచారం చేయించారు. వైదికపరంపరను నిలిపారు. పైలుడికి ఋగ్ వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతుడికి అధర్వణ వేదాన్ని అప్పగించారు. ఇంత చేసిన వ్యాసుడు ఒక మత్స్యకన్యకు జన్మించారు. వ్యాసుడికి కులం అంటగట్టడం సరికాదు కాని కొందరికి అర్దమయ్యేలా చేప్పాలంటే మానవజాతి చేతులెత్తి మొక్కే వ్యాసుడు ఎస్.సి. వర్గానికి చెందినవాడవుతాడు. హిందూధర్మం బ్రాహ్మణుల కుట్ర, వేదం బ్రాహ్మణులు తమ స్వార్ధానికి రాసి, ఇతరులపై రుద్దారని ప్రచారం చేసే మూర్ఖశిఖామణులు ఈ విషయాన్ని విస్మరించడం గమనార్హం.  

To be continued ......................

2 comments:

  1. పోష్టు చాలా బాగుంది.మీ పోష్తుల్లో చాలామటుకు చదివాను.ముఖ్యంగా భారత యుధ్ధం నాడు అణుబాంబు వాడకం గురించి మీ పోష్తూ చూశాను,ఈ మధ్యనే కొత్తగా చాలా చదివాను.ఆశ్చర్యమనిపించింది.

    ఈ దేశ చరిత్రలో కొన్ని విషయాల గురించి నాకు స్పష్టంగా తెలియడం లేదు,మీకు తెలిస్తే జవాబు చెప్పగలరు!ఒకవేళ తెలియకపోయినా మీరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి.ఈ దేశంలో కుల వ్యవస్థ గతానుగతికంగా యెట్లాంటి మార్పుల్ని తీసుకున్నదనే విషయం మీద నేను ఒక పోష్టు రాశాను," దోపిడీ->యుధ్ధం->రాజ్యం->కులం->అణిచివేత?->వైప్లవ్యం!" అనే పేరుతో..
    లింక్ ఇది: http://harikaalam.blogspot.in/2015/02/blog-post_7.html
    కానీ పూర్తయ్యాక మళ్ళీ చదుకుంటుంటే బలమైన రెండు సందేహాలు కొత్తగా పుట్టుకొచ్చాయి!

    కానీ పూర్తయ్యాక మళ్ళీ చదుకుంటుంటే బలమైన రెండు సందేహాలు కొత్తగా పుట్టుకొచ్చాయి!

    1.నేను పరిశోధించిన చాలాచోట్ల సింధులోయ నాగరికత కి వైదిక యుగానికి మధ్య చాలాకాలం పాటు యేమిజరిగిందో తెలియని ఒక శూన్యం వుంది!దానికి వాతావరనం లోని తీవ్రమైన ఆటుపోట్ల వల్ల స్థానచలనం జరగడం కారనమని చెప్తున్నారు,నిజమేనా?

    2.నా వ్యాసంలో అనుకోకుండానే మొదలు పెట్టిన సింధులోయ నాగరికత,వైదిక నాగరికత ఉత్తరదేశానికి సంబంధించినవి అయితే ఆ తర్వాత మన ఆంధ్రప్రాంతానికి దూకేశాను.అయితే యెక్కడివి చెప్పినా తేడాగా అనిపించకపోవటానికి అంతటా సామాజిక వాతావరణం ఇట్లాగే ఉండటంతో ఇదే విశ్లేషణని ఆంధ్ర గురించి చెప్పినదే తమిళనాడులో లింగాయతులు,పన్నియర్లు అనే విధంగా మార్చి చెప్పుకున్నా కధ అట్లాగే వుంటుంది.

    నాకు ఇందులో కొత్తగా కలిగిన సందేహం - అందరూ సింధులోయ నాగరికత గురించి హరప్పా వుదాహరనతోనే చెప్తున్నారు కదా,ఆ కాలంలో దక్షిణాది పరిస్థితి యెట్లా వుండేది?యేదో ఒక ప్రాంతం వాళ్ళు అన్ని ప్రాంతాలకీ వ్యాపించడం వల్ల ఇట్లా మొత్తం దేశమంతటా యేకసూత్రత వచ్చిందా!యెవరు యెవరి వైపుకి ప్రభావితం చేసుకుంటూ కదిలారు?అది యుధ్ధం ద్వారా దుర్మార్గంగా జరిగిందా లేక్ పరస్పర సమాశ్రయణం ద్వారా శాంతియుతంగా జరిగిందా?

    వీటికి జవాబులు దొరికితే రెండో భాగం కూడా కలిపితే ఈ దేశపు సామాజిక చరిత్ర గురించి రేఖామాత్రంగా ఒక అవగాహన రావచ్చు - సూక్షంలో మోక్షం లాగ.

    ఇంకో రెండు కొసరు ప్రశ్నలు:తిలక్ గారి ఆర్యుల ఉత్తర ధృవ నివాసం సిధ్ధాంతం పూర్తిగా కొట్టిపారేశారా?ఆయన మరీ మూర్ఖుడేమీ కాదే యెక్కడ పొరపాటు పడ్డాడు?

    నా పోష్తులో కూడా వేశాను," వీరు(వైదిక ఆర్యులు) నిజంగా సింధు నాగరికతా శిధిలాల నుంచి వచ్చిన వారేనా అనేది?యెందుకంటే ఋగ్వేద సాహిత్యంలో గానీ మిగిలిన వైదిక సాహిత్యంలో గానీ ఇవ్వాళ కనుక్కున్న సింధు లోయ నాగరికతకి సంబంధించిన ప్రస్తావనలు లేవు,యెందుకని?!" అని మీకేమైనా తోస్తున్నదా?

    నిజంగా యుధ్ధ పరికరాల అవసరమే లేని ఒక అధ్భుతమైన నాగరికతలో యెంత హీనపక్షంగా లెక్కేసినా వెయ్యేళ్ళ పాటు ప్రశాంతంగా గడిపిన జనసమూహమే కాలాంతరంలో యుధ్ధమే సమస్తంగా బ్రతికే జీవన విధానానికి మారడం ప్రపంచ చరిత్రలోని అత్యంత దుర్భరమైన విషాదా లన్నింటిలో ఒకటి కదా?!

    ReplyDelete
  2. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలండి. మీకు ఎటువంటి సందేహాలు కలిగాయో, ప్రారంభంలో నాకు అలాగే చాలా సందేహాలు తలెత్తాయి. మీ పోస్టు చదివాను, చాలా బాగుంది. మీరు అడిగిన ప్రశ్నల్లో కొన్నిటికి జావాబులు దొరికినా కుల వ్య్వస్థ ఎలా ఏర్పడిందన్న విషయం మీద నేను ఇంకొంత పరిశోధన చేయాల్సి ఉంది. అది పూర్తైతే దాదాపు ఒక అభిప్రాయానికి రావాచ్చు. కానీ ఒక్క విషయం ఏమిటంటే కులవ్యవస్థ ధర్మంలో లేదు, కేవలం సమాజంలో మాత్రమే ఉంది. దానికి ధర్మాన్ని, వేదాన్ని నిందించవలసిన అవసరం లేదు.

    మీరు సింధూ లోయ నాగరికత అన్నారు. సింధూలోయ నాగరికతతోనే భారతచరిత్ర మొదలవుతుందని ఇప్పుడు పిల్లల పుస్తకాల్లో చెప్తున్నారు. కానీ నిజానికి అది సింధూ నగరికత కాదు, సరస్వతీ నాగరికత. కాలక్రమంలో అది సింధూ నాగరికతగా మారిపోయింది. ఈ లింక్ చూడండి. http://ecoganesha.blogspot.in/2013/06/blog-post_18.html

    సింధూ నాగరికత ఆర్యులది అంటున్నారు. ఆర్యులు భారతదేశం మీద దండయాత్ర చేసి వచ్చారు, వారిదే హిందూ మతం. ఇక్కడవారికి వేరే మతం ఉండేదని మనకు చెప్తూ వచ్చారు. కానీ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని తేలిపోయింది. దానికి ఎటువంటి పురావస్తు ఆధారాలు లభించలేదు. ఈ విషయం మీద బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు పరిశోధన చేసారు. భారతదేశంలో నివసిస్తున్న అనేకమంది డి.ఎన్.ఏ. నమునాలను సేకరించారు. దాని ఆధారంగా తేలింది ఒకటే. బ్రాహ్మణులు, దళితులు, అంటరానివారు, శూధ్రులు, అందరు........ ఒకే కుటుంబానికి, జాతికి చెందినవారు. గత 80,000 సంవత్సరాల పూర్వమ వరకు ఈ దేశంలోకి కొత్తగా ఎవరు వచ్చి స్థిరపడింది లేదు. ఈ దేశంలో ఉంటున్న అన్ని వర్గాల వారు ఒకే సమూహానికి చెందినవారని, ఈ దేశం నుంచే ఐరోపా, పశ్చిమ ఆసియా ఖండాలకు జనం వలస వెళ్ళారని ఆ పరిశోధన తేల్చింది. https://www.google.co.in/?gws_rd=ssl#q=aryan+invasion+theory+debunked
    https://www.youtube.com/watch?v=5Y3ZFvRfZXE
    https://www.youtube.com/watch?v=DWBVhT-7yL8
    https://www.youtube.com/watch?v=Z_aXkwP2Shg
    https://www.youtube.com/watch?v=K_P4-Va0Y4o
    https://www.youtube.com/watch?v=T8Jl5Qft0oY
    http://archaeologyonline.net/artifacts/genetics-aryan-debate
    http://arisebharat.com/2008/01/21/bbc-accepts-that-the-aryan-invasion-theory-is-flawed/
    http://uwf.edu/lgoel/documents/amythofaryaninvasionsofindia.pdf
    http://timesofindia.indiatimes.com/city/varanasi/Indian-scientist-set-to-change-world-history/articleshow/5301655.cms

    ఆర్యులు దండయాత్ర జరిగిందని చెప్తున్న కాలానికి పూర్వమే ద్వారక ఉండేదని పురావస్తు సాక్ష్యాలే చెప్తున్నాయి. ద్వారక కృష్ణుడి నగరం. కృష్ణుడి సమయంలోనే భారతదేశం వ్యవస్థీకృతంగా ఒక దేశంగా, రాజ్యాంగంతో ఏర్పడింది. అంటే అప్పటికే ఏకసూత్రత ఉందని అర్దమవుతోంది. అదీగాక జనమేజయుడి సర్పయాగం జరిగింది దక్షిణకర్ణాటకలో. ఇక్కడివరకు వారి రాజ్యం విస్తరించిందనడానికి అక్కడ దొరికిన శాసనాలే ఆధారం.

    మీరు ఒకసారి ఆర్యులు దండయాత్ర మీద ఆధునికపరిశోధనల ఫలితాలు చూడండి. అది అసత్యం తప్పించి, అందులో విషయం ఏమీ లేదని పునఃపునః నిరూపించబడింది. ఆ ఒక్క విషయంలో స్పష్టత వస్తే, మీకు భారతచరిత్ర మీద నూతనదృక్పధం ఏర్పడుతుంది.

    ReplyDelete