Wednesday 7 December 2016

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 3



మృత్తికే దేహిమే పుష్టిం త్వయీ సర్వం ప్రతిష్టితం |
తన్మే నిర్ణుదా మృత్తికా తయా హతెనా పాపేన గచ్ఛామి పరమాంగతిం ||

ఓ మృత్తికా! నాకు పుష్టినివ్వు. సర్వంలో నీలోని దాగి ఉంది, అన్ని సంపదలకు మూలం నీవు. నాకు మార్గదర్శనం చేసి, నా పాపాలను తొలగించు. నువ్వలా నా పాపాలను నశింపజేయగానే నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలను, నీ దయతో పరమగతి అయిన మోక్షాన్ని సైతం పొందగలను.

ఒకసారి రాజీవ్ దీక్షిత్ గారు పూరీ జగన్నాధస్వామి రధోత్సవం చూడాటానికి వెళ్ళగా, అప్పుడు వారికి అక్కడ పప్పన్నం ప్రసాదం పెట్టారట. అది ఎంతో రుచిగా ఉండడంతో, ఇది ఎలా వండారు, దీని ప్రత్యేకత ఏమిటని ఆరా తీస్తే, అక్కడ మట్టిపాత్రలలో వండి నివేదన చేస్తారని తెలుసుకున్నారు. అక్కడున్న శంకరాచార్య పీఠాధిపతితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ మట్టిపాత్రలలో ప్రసాదం వండడానికి గల కారణం ఏమిటి? అని అడగ్గా, మట్టి పవిత్రమైనది, భగవంతునికి నివేదన చేసేది పవిత్రంగానే ఉండాలి, అందుకే మట్టి పాత్రలలో వండుతామని స్వామి వారు సమాధానమిచ్చారు. అయితే దీన్ని పరీక్ష చేయించాలనుకున్న రాజీవ్ దీక్షిత్ గారు దాన్ని భువనేశ్వర్ లో ఉన్న సి.ఎస్.ఐ.ఆర్. (CISR) కు తీసుకెళ్ళి పరిశోధించమంటే, దానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందని, అయినా తమ వద్ద అన్ని పరికరాలు లేవని, అందుకని ఆ ప్రసాదాన్ని దిల్లీ వెళ్ళి పరీక్ష చేయించమని చెప్పారు. అది అప్పటికి వండి కొన్ని గంటలు గడించి, దిల్లీ వెళ్ళాలంటే సుమారు 36 గంటలు పడుతుంది. అప్పటికి ఇది పాడవుతుంది కదా అని రాజీవ్ గారు అనగా, అది పూరీ ప్రసాదమని, మట్టి పాత్రలో వండబడుతుంది కనుక పాడవ్వదు అని చెప్పారు అక్కడి శాస్త్రవేత్తలు. ఆయన దాన్ని దిల్లీ తీసుకెళ్ళి పరీక్షలు చేయించగా తేలిందేమిటంటే పప్పులో 18 రకాల సూక్ష్మపోషకాలుంటాయి (Micro Nutrients), అవే దానిలో ఉన్న బలం, ఆ 18 లో ఒక్కటి కూడా ఈ ప్రసాదంలో తగ్గలేదట. పూర్తిగా 100% ఉన్నాయట. వంటనే ఆయన ప్రెషర్ కుక్కర్ లో వండిన పదార్ధాన్ని పరీక్ష చేయిస్తే, అందులో కేవలం 13 శాతం పోషకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, మిగితా 87 % పోషకాలు లోపించాయని (నశించాయని) తేలింది. ఆ విషయం చెప్పి రాజీవ్ దీక్షిత్ గారంటారు పూరీలో పూజారులు సైన్సు చదవలేదు, అందుకని వాళ్ళు శాస్త్రీయంగా చెప్పలేకపోయారు, అయినా మట్టి పవిత్రమైనదని చెప్పారు. నేను సైన్సు చదివి కూడా పరీక్ష చేయిస్తే గాని తెలుసుకోలేకపోయాను. అందుకే మన భారతీయ సంస్కృతిలో అనాదిగా మట్టి పాత్రలలో వంట వండడమే సంప్రదాయంగా వస్తోంది. అల్యూమీనియం ముడిపదార్ధం మన భూమిలో పుష్కలంగా ఉన్నా, మన పూర్వీకులు ఏనాడు దాన్ని ఉపయోగించలేదు. అదేకక మట్టి పాత్రలో వండిన పదార్ధానికి రుచి కూడా అద్భుతంగా వస్తుంది. మట్టికి ఆ శక్తి ఉంది.

ఇంకా వారంటారు వైజ్ఞానికంగా మన శరీరం అంతటా ఉండేది మట్టియే. ఈ శరీరానికి కావల్సిన 18 సూక్ష్మపోషకాలన్నీ మట్టిలోనే ఉంటాయి. ఆ పోషకాలనే మొక్క గ్రహించి పప్పుధాన్యాల్లో నిక్షిప్తం చేస్తుంది. అందుకే ఆ 18 పోషకాలు పప్పులో ఉంటాయి. మళ్ళీ ఇవే 18 పోషకాలు గోమూత్రంలో కూడా ఉంటాయి.

అందుకే ఇప్పటికీ లలితా సహస్రనామ పారయణ చేసేవారు అమ్మవారికి, ఆ నామావళిలో చెప్పబడిన నివేదనలు సిద్ధం చేయడానికి ఇప్పటికీ మట్టిపాత్రలనే వాడతారు, ఆవు పిడకలను వంటచెరుకుగా వాడుతూ కుంపటి మీద వండుతారు. పవిత్రత కోసమని. అదే శ్రద్ధకు నిదర్శనమని లలితాసహస్రనామ బాష్యం ప్రవచనం చెప్తూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు అన్నారు.

అందుకే సారవంతమైన మట్టిని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే శరీరానికి పుష్టికరమైన ఆహారం అందుతుంది. ఇప్పుడు అఘమర్షణ సూక్తంలో చెప్పిన 'మృత్తికే దేహిమే పుష్టిం' అనే మాట ఎంత సత్యమో అర్దమయ్యిందా? ఈ పొషకాలే కాకుండా ఇంకా ఏమేమి పోషకాలున్నాయో పరిశీలిద్దాం.

To be continued ...........

1 comment: