Monday 15 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (174)



అయితే ఇక్కడ విఘ్నేశ్వరుని పాత్ర ఏమిటి? శివుని కొడుకు శివుడైతే ఇక విఘ్నేశ్వరుడు శివుని కొడుకు కాదా? దేవతలు కుమారస్వామికై తపస్సు చేస్తున్నారని చెప్పినపుడు అప్పటికి విఘ్నేశ్వరుడు పుట్టి యుండలేదా? అందువల్ల ఈ విషయం తేటతెల్లం కావడం కోసం స్కంద పూర్వజుడని ఇతనికి నామం ఏర్పడింది.


సరే బాగానే ఉంది. ఇక కుమారస్వామికి ముందే విఘ్నేశ్వరుడు పుట్టియుండగా మరొక శివపుత్రుని కోసం తపస్సు చేయాలా? గణపతి శివునితో సమానుడు కాదా? ఇతని ఘనత ఏనాడో వెల్లడైంది. త్రిపురాసురులపై శివుడు దండెత్తినపుడు విఘ్నం వస్తే శివుడే వినాయకుణ్ణి పూజించాడు కదా. ఇతని కీర్తిని దేవతలు విన్నా శివునకు మరొక సంతానం కావాలని ఎందుకు కోరుకున్నారు?


శూర పద్ముడు పొందిన వరంలో ఒక మెలిక దాగియుంది. అట్లా తెలివిగా వారు అడుగుతూ ఉంటారు కూడా. శివునితో సమానుడైనవాడు, స్త్రీ పురుషుల కలయిక లేకుండా పుట్టాలని, అట్టివాడే మమ్మల్ని చంపగలడని అన్నారు. అట్టిది కుదురుతుందా ? 


విఘ్నేశ్వరుడు పెక్కువిధాలుగా పెక్కు రూపాలు ధరించాడు. అందొక రూపం, అమ్మవారు ఒంటికి రాసుకున్న పసుపు నుండే. ఇంకా అనేక కథలున్నాయి. కైలాసంలోని విలాస భవనంలో ప్రణవాక్షరం చాలా అందంగా గీయబడి యుంది. దానిని శివపార్వతులు రెప్పలార్పకుండా ఒక్కసారే ఇద్దరూ చూసారు. వెంటనే వినాయకుడు పుట్టినట్లు కథ. రెండు ఏనుగులకు పుట్టినట్లుంది. అమ్మవారు ఆడ ఏనుగు కాగా, అయ్యవారు మగ ఏనుగయ్యాడట. ఈ కథను తేవారంలో జ్ఞాన సంబంధులు పేర్కొన్నారు.


No comments:

Post a Comment