Wednesday 15 February 2023

శ్రీదత్త పురాణము (51)

 


మరొక రోజు సాయంకాలం సరోవరంలో స్నానానికి దిగాడు, శిష్యగణం, మిత్రగణం కూడా వెంట ఉన్నారు. ఉన్నట్టుండి దత్తుడు మాయమయ్యాడు. శిష్యులు హాహాకారాలు చేసారు. ఇంతలో ఎవరో శిష్యులలో ఒకడు ఇది మనకు మరో పరీక్ష. కంగారుపడకండి అన్నాడు. అనుకున్నట్టే దత్తస్వామి సరోవర మధ్యభాగంలో ప్రత్యక్షమయ్యాడు. దివ్యాంబరాలు ధరించి, దివ్యమయిన భూషణములతో దత్తుడు ధగధగ లాడుతున్నాడు. చేతిలో మధుపాత్ర ఆరారగా మద్యం సేవిస్తున్నారు. ఎరుపెక్కిన కన్నులు తడబడుతున్న పలుకులు, ఒక అందాలరాశి బంగారు పాత్రతో మద్యం తెచ్చి పాత్రలోనింపింది. దత్తస్వామి ఆమె కొంగు పట్టుకొని లాగాడు. ఆమె వయ్యారంగా నాట్యభంగిమలో వచ్చి స్వామి వారి ఒడిలో వాలింది. ముద్దులు, మురిపాలు ఆలింగనాలు ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. మధ్యమధ్యలో యిద్దరు ఒకే పాత్రలోని మద్యము సేవిస్తున్నారు. ఒకరు మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటున్నారు. కూనిరాగాలు తీస్తున్నారు. గిలిగింతలు పెట్టుకుంటున్నారు. విరగబడి నవ్వుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు వాలిపోతున్నారు. బుగ్గలు కొరుక్కుంటున్నారు. నెట్టుకుంటున్నారు. అంతలోకే మళ్ళీ దగ్గరకు లాక్కొంటున్నారు.

గట్టుపై నిలబడి వింతగా చూస్తున్న శిష్యులు, మిత్రులు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏమిటీ దారుణమని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇతన్ని మనం గురువుగా నమ్మింది. ఇతడా మనకు మోక్షం ప్రసాదించేది? యోగ సాధనంటే యిదేనా? మద్యపానము, మదవతీగా నమూనా? అయ్యోయ్యో ఎంత పొరపాటు చేసాం, ఎన్ని వందల సంవత్సరాలు వ్యర్ధం చేసుకున్నాం. అందరి మనుస్సులో యిదే ఆలోచన బయలుదేరింది. పదండి పదండి అనుకున్నారు. అందరు సరస్సువైపు తిరిగి చీత్కారాలు చేస్తూ కొందరు, మెటికలు విరుస్తూ కొందరు, ముక్కున వేలుంచుకుంటూ కొందరు, మొత్తం మీద అందరూ ఈ ఆశ్రమం పరిసర ప్రాతాలలోనే మనం ఉండకూడదు, దూరంగా పోదాం పదండి అనుకుంటూ వెళ్ళిపోయారు. దత్తాత్రేయుడు హమ్మయ్య అనుకున్నారు. మాయామదవతిని, మధుపాత్రను ఉపసంహరించాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి గట్టుకు చేరుకున్నాడు. ఆశ్రమంలోకి ప్రవేశించి యోగనిష్ఠలో కూర్చున్నాడు.

తండ్రీ! విన్నావు కదా, నీ మనస్సులో చాలా సందేహాలు తలెత్తాయని నాకు తెలుసు, మహాయోగికి సాధ్యాసాధ్యములు లేవు. అతడు సాధారణ నియమాలన్నిటికీ అతీతుడు. తన యోగసిద్ధికోసం అన్నింటినీ వదులుకుంటాడు, ఏదైనా చేస్తాడు. సృష్టి అంతా అతనికి ఒక ఆటబొమ్మ. ఒక్కొక్క బొమ్మతో కాసేపు ఆడుకుంటాడు. మరుక్షణంలో దానినే నిర్దాక్షిణ్యంగా కాలదన్నుతాడు. ఆయన దేనికీ లోనుకాడు. తండ్రీ! దేనిని ఆశించినా వాయువుకి అంటులేనట్లే, మహాయోగులకు కూడా ఏ దోషాలు అంటవు. వారేది చేసినా అది ఒక క్రీడ మాత్రమే. ఈ రహస్యం తెలియాలంటే యోగసాధనలో ఒకమెట్టైనా ఎక్కాలి. లేకపోతే ఆ శిష్య బృందాలవలె, అపార్థాలతో అసహ్యంతో పారిపోవలసివస్తుంది. తెలుసుకోగలిగిన వారు గురుకటాక్షానికి పాత్రులై ముక్తిపొందుతారు. అలా పొందిన వారు చాలా మంది ఉన్నారు. అందులో కార్త వీర్యార్జునుడు ఒకడు. తండ్రీ, దత్తయోగీంద్రుడని తలచుకుంటే చాలు సకల పాపాలు పటాపంచలవుతాయి. ముక్తి కాంత స్వయంగా మన ఎదురు నిలుస్తుంది.

No comments:

Post a Comment