Thursday 16 February 2023

శ్రీదత్త పురాణము (52)

 

తన కుమారుడు యింతగా చెప్తుంటే తండ్రికి నమ్మిక నెమ్మది నెమ్మదిగా కుదురుతోంది. నాయనా! సుమతీ! అంతో ఇంతో అనుభవం ఉండి సాత్విక మార్గంలో తపస్సు చేసుకొనే మునికుమారులే దత్తుడి లీలలు అర్ధం చేసుకోలేక దూరమయ్యారంటే యిక నేనెంత. నా తెలివెంత? దత్తుని లీలలు అత్యద్భుతంగా ఉన్నాయి. యింకా యింకా వినాలనిపిస్తున్నది. సుమతీ! త్రిమూర్తిస్వరూపుడైన దత్తుని కనిన అనసూయాత్రిదంపతులు ఎంత పుణ్యాత్ములో వారి తపోమహిను ఎంతగొప్పదో కదా అని అడిగాడు.


అప్పుడు సుమతి ఇలా చెప్తున్నాడు. తండ్రీ! అత్రి మహర్షి ఋగ్వేదంలోని శాకల శాఖా పంచమ మండలాన్ని తన తపో మహిమతో దర్శించగలిగాడు. ఆ వేద భాగంలో అగ్నిలింగస్తుతి, అమరేంద్ర ప్రస్తావన మొదలైన అంశాలు ఉండటంవల్ల అది ఐహికాముష్మికాలు రెండింటిని నిరుపద్రవంగా సాధించగల సామర్ధ్యం కలది.


ఒకసారి కృత యుగంలో రోగాలు పెచ్చుపెరిగి ప్రాణిలోకానికి హాని అవుతుంటే అత్రి మహానుభావుడే ఆయుర్వేదమనే ఉపదేశాన్ని సందర్శించి ప్రాణికోటికి అందించాడు. మరొక్కప్పుడు మనువు చేత భోదింపబడిన ధర్మశాస్త్రం దురవగాహంగా వుందని ప్రజలంతా చింతిస్తూ వుంటే, తేట తేట మాటలతో తానే స్వయంగా ఒక ధర్మశాస్త్ర స్మృతిని ప్రవేశపెట్టాడు.


మరొకప్పుడు దేవదానవ యుద్ధంలో సూర్యచంద్రులు శత్రువులకు బందీలైన కారణంగా లోకం అంధకారమయం కాగా దేవతల ప్రార్ధనల వల్ల ఆ మహానుభావుడే తానే సూర్యుడు చంద్రుడు అయ్యి లోకాలకు వెలుగు అందించాడు.


అలా అత్రి మహర్షి లోక కళ్యాణ నిమిత్తమై చేసిన అద్భుత కృత్యాలు ఎన్నెన్నో. ఎన్నింటినని మనం చెప్పుకోగలం. ఇక అనసూయా సాధ్వి గురించి చెప్పాలంటే అద్వితీయ పాతివ్రత్య రూప మహాద్భుత తపః పరమావధియైన అమ్మ చేసిన మహత్తర కృత్యాలకు సాటిలేదు.


ఒకప్పుడు ఎండలు విపరీతమయి గంగానది ఎండిపోతే అనసూయమ్మ మునిజనుల సౌకర్యార్ధమై నదిని మరల పునరుజ్జీవింప చేసింది. మరొకప్పుడు మహాక్షామం సంభవించి నేలలో మొలకన్నది కూడా లేకుండా మాడిపోతూ వుంటె అనసూయా సాధ్వి అనేక వందల, వేల మంది మునిజనులకు తానే స్వయంగా వండి వడ్డించింది. వారందరికి కందమూల ఫలాలు ఇచ్చి పోషించింది.


No comments:

Post a Comment