Friday 17 February 2023

శ్రీదత్త పురాణము (53)


ఇంకొకసారి పాపరతులైన జనుల స్పర్శవల్ల గంగాదేవి తన పవిత్రతను కోల్పోయి నల్లబడగా ఆ తల్లి తన కమండలంలోని జలాన్ని చల్లి గంగాదేవి కాలుష్యాన్నంతా క్షణంలో భస్మంచేసింది. ఇలాంటి మహాకార్యాలు చాలా చేసారు ఆ పుణ్యదంపతులు. అంతటి పుణ్యదంపతుల, తపోతేజోవంతుల గారాలబిడ్డడే మన దత్తుడు.


అంతే కాదు తండ్రీ! త్రిమూర్తులు వారి గర్భాన్నే జన్మించడానికి ఇంకా కారణాలు వున్నాయి. విను చెప్తాను. ఒకనాడు నారదుడు త్రిలోకాల్లో తిరుగుతూ తిరుగుతూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అనసూయాసాధ్వి గొప్ప దనాన్ని పొగుడుతూ వున్నాడు.


ఏం చిత్రమోగాని ముల్లోకాలు ఏలే ముగ్గురు అమ్మలకు సామాన్య మానవ మాత్రురాలను పొగుడుతూ వుంటే అసూయ బయలు దేరిందట. దాంతో వారు ఆమెను పరాభవించాలనే ఉద్దేశ్యంతో ఇనుప గుండ్లను సృష్టించి అవి వండించమని నారదుని చేతికిచ్చి పంపారట. నారదుడు ఇనుపగుండ్లను తీసికొని ఋక్షాద్రిపై తపస్సు చేస్తున్న అత్రి అనసూయల ఆశ్రమానికి వచ్చి అత్రి అనసూయల మహాత్మ్యాన్ని వేనోళ్ళ పొగిడి తన దగ్గరున్న శనగలు అమ్మచేతికిచ్చి అవి వండి పెట్టమని ప్రార్థించాడట. అవి మాత్రం ఇనుపగుళ్ళలా వున్నాయి. అనసూయామాత చేతి స్పర్శ వాటికి తగలగానే వాటిలో కఠినత్వం పోయిందట. అమ్మ తన సంకల్పబలంతో వాటిని అవలీలగా మ్రగ్గించి నారదుని చేతికిచ్చిందట. క్రమంగా అవి కమ్మని సువాసనలు వెదజల్లాయట. నారదుడు పరమానంద భరితుడై శెలవుతీసికొని వెళ్ళిపోయాడు.


నారదుని ఎదుట తమకు జరిగిన పరాభవం భరింపరానిదై ముగ్గురమ్మలు పట్టుబట్టి ఈమారు స్వయంగా తమ భర్తల్నే పంపించారు. అమ్మ పాతివ్రత్య మహిమను తగ్గించమని కోరారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో అత్రి ముని ఆశ్రమం చేరుకొని భవతీ భిక్షాందేహి అని అడిగారు.


అప్పుడు అనసూయాదేవి వారిని జూచి అయ్యలారా అత్రిముని తపస్సుకై అరణ్యంలోకి వెళ్ళారు. వారు వచ్చేంతవరకూ కూర్చుని మా ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరింది. అప్పుడు వారు అమ్మా మీ వారెప్పుడు వస్తారో తెలియదు. వారు వచ్చే వరకూ మేము ఉండలేము. ఆకలి మమ్మల్ని బాధిస్తున్నది. భోజనం పెట్టు అన్నారు. అనసూయాదేవి కుటీరంలోకి వెళ్ళి భోజనాలు త్వరత్వరగా సిద్ధంచేసి వారు కూర్చుని తినడానికి వీలుగా ఆసనాలు సిద్ధంచేసి వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇచ్చి భోజనానికి దయజేయమని వేడుకున్నది. అప్పుడు వారు అమ్మా మాకు ఆతిధ్యమిస్తానని మాట ఇచ్చావు కాని మాదొక నియమం ఉన్నది. నీవు కట్టుకున్న బట్టలను విడిచి నగ్నంగా మాకు వడ్డిస్తేనే మేము భోంచేస్తాము అన్నారు.


No comments:

Post a Comment