Tuesday 21 February 2023

శ్రీదత్త పురాణము (57)

 


గురువులు నేర్పుతున్న అన్ని విద్యలలోనూ ఆరితేరుతున్నాడు. క్రమ క్రమంగా యుక్తవయస్సు వచ్చింది. యువరాజుకు పట్టాభిషేకం చేయిద్దామని కృతవీర్యుడు ఉబలాటపడుతున్నాడు. పైకి అంటే ఎవరు ఏమి అంటారోనని గేలిచేస్తారేమోనని సంశయిస్తున్నాడు. తీరా సింహాసనంమీద కూర్చోబెడితే సరిగా పరిపాలన కొనసాగించలేకపోతే బిడ్డడికి ప్రజల ముందు తలవంపులు తెచ్చి పెట్టిన వాళ్ళమవుతామని దిగులుతో వున్నాడు. దీనికి పరిష్కారం ఎలాగ ? అవి రేయింబవళ్ళు ఆలోచిస్తున్నాడు. దారి దొరకడం లేదు. చిరవకు ఆయుర్దాయమే తీరిందో లేదా ఆ దిగులే ప్రాణాలు హరించిందో గాని కృతవీర్యుడు హఠాత్తుగా దివంగతుడయ్యాడు.


అరాచకం ఏర్పడకూడదని మంత్రి పురోహితులు అందరూ ఒకనాడు కార్తవీర్యార్జునుణ్ణి సమీపించి పట్టాభిషేకమునకు అంగీకరించమన్నారు. అతడు మాత్రం అంగీకరించలేదు. అవిటివాణ్ణి, ప్రజారక్షణ చెయ్యలేను. అది చెయ్యలేనపుడు పెట్టాభిషేకం జరిపించుకో కూడదు. ప్రజలు పన్నులు కట్టేదిరాజు రక్షిస్తాడని దానికి సమర్ధుడు కానివాడు సింహాసనమెక్కి ప్రజాధనాన్ని భోగాలకు ఖర్చుపెడితే వాడు చోరుడు క్రింద లెక్క. రౌరవాది నరకాలకు పోతాడు. పోనీ పరిపాలన రాజ్య సంరక్షణ బాధ్యతలు మీకందరికి అప్పగించి నేను నామ మాత్రపు రాజుగా కిరీటం పెట్టుకొని కూర్చుందామంటే అప్పుడు మీ చేతుల్లో కీలు బొమ్మను అవుతాను. ఇది గుర్తించిన ప్రజలు నన్ను అపహాస్యం చేస్తారు. ఇరుగు పొరుగు రాజులు నవ్వుతారు. అవమానిస్తారు. నేను స్వయంగా నా అంతటనేను చేసుకోలేని పరిపాలన పరుల మీద ఆధారబడిన ఏలుబడి ఎంత అందంగా ఉంటుందో మనందరకు తెలిసిందే. అపరాధుల్ని నిర్ధారించలేము. నిరపరాధుల్ని రక్షించలేము. న్యాయమే జరుగుతుందో అన్యాయమే జరుగుతుందో గుర్తించలేను. ఇంకొకరి ఇష్టాఇష్టాల ప్రకారంగా నిరపరాధుల్ని శిక్షింపజేయవచ్చు. అపరాధుల్ని విడిపించవచ్చు. నా పరిపాలన గ్రుడ్డి దర్భారుగా వుంటుంది. పాపఫలాలు మాత్రం మిగిలి నరకానికిపోతాను. నూరు కళ్ళతో పరిపాలన కొనసాగించిన తెలియక జరిగే అపచారాలు ఉంటాయి. కాబట్టి రాజ్యం నరకం ధ్రువమ్ అన్నారు. అలాంటి నేను మరొకరి చేతుల్లో కీలు బొమ్మనయితే ఈ పుట్టుకలోనే ఇక్కడే నరకం అనుభవించవలసివస్తుంది. ఏ జన్మలో ఎవరికి ఏ అపచారం తెలిసి చేసానో, తెలియక చేసానో ఈ అవిటితనం సంప్రాప్తించింది. ఇప్పుడిక తెలిసితెలిసి పాపం మూటగట్టుకోలేను. అందుచేత ఈ కిరీటాన్ని నేను మోయలేను.


No comments:

Post a Comment