Wednesday 1 February 2023

శ్రీదత్త పురాణము (37)

 


సుమతీ కౌశికుల వృత్తాంతం


ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్యపేరు సుమతి. పేరుకు తగిన గుణవతి. మహా పతివ్రత. కొంతకాలంగా వాళ్ళిద్దరి యొక్క సంసారం అన్యోన్యంగా సాగింది. ఉన్నట్టుండి కౌశికుడికి ఏ పూర్వ జన్మ పాపమో కుష్టురోగం సోకింది. రోజులు గడుస్తున్న కొద్ది రోగం ముదిరి తనువంతా చీము, నెత్తురు కారుతుంటే సుమతి మనస్సులో కూడా ఏవగించుకోకుండా అతని శరీరాన్ని నీటితో కడిగి మెత్తని గుడ్డలతో వత్తి, వైద్యులిచ్చిన తైలములను మృదువుగా రాస్తూ ఉండేది. ఔషధాలను సమయానికి అందిస్తుండేది. మలమూత్రాలను ఎత్తిపోయడం, కంపు కొట్టే గుడ్డలు ఉతికి ఆరవేయడం, దగ్గరగా కూర్చుని వింజామరతో విసరడం, కాళ్ళు పట్టడం, మంచిగా చెప్పి ఇంత తినిపించడం, ఒకటేమిటి సకలోపచారాలు విసుగు విరామం లేకుండా చేసేది. రోగం తగ్గుముఖం పడుతుందని తొందరలోనే నయమవుతుందని ధైర్యం నూరి పోసేది. అయితే రోగబాధతో ఉన్న కౌశికుడు మాత్రం ఆమెపై అనుక్షణం మండిపడుతుండేవాడు. అయిన దానికి కాని దానికి తిట్టేవాడు. చిన్న, చిన్న విషయాలకే చిరాకు పరాకు ప్రదర్శించే వాడు. చేతికి ఏది అందితే అది తీసుకొని కొట్టేవాడు. నవ్వుతూ కనిపించినా, వీధిలోకి వెళ్ళి రావడం, క్షణం ఆలస్యమైన కుళ్ళు మాటలతో ఏడిపించేవాడు. అలాగని నవ్వకుండా ఉంటే ఏమీ నా సేవ చేయాలని ఏడుస్తున్నావా! ఎప్పుడు చస్తాడాని ఎదురుచూస్తున్నావా అంటూ చంపుకు తినేవాడు. పాపం సుమతికి నవ్వాలో ఏడ్వాలో తెలియదు. ఇది రోగ లక్షణం కాబోలు అనుకొని అలాగే సహనంతో, ప్రేమతో, భక్తితో సంవత్సరాల తరబడి సేవలు చేస్తూనే ఉంది.


ఒక రోజు ఉదయాన కౌశికుడుకి శరీరం అంతా శుభ్రం చేసి విభూధిరేఖలు దిద్ది శుభ్ర వస్త్రాలు కట్టి ఇంటి ముంగిట పంచలో మంచం వేసి, మెత్తని పడకలు ఏర్పరిచి సుఖంగా కూర్చోబెట్టి తాను వంట పనుల్లో తలదూర్చింది సుమతి. కౌశికుడు కులాసాగా వీధిన వచ్చిపోయేవాళ్ళని పలకరిస్తూ పుండ్ల మీద వాలుతున్న ఈగల్ని తోలుకుంటూ సరదాగా ఉన్నాడు.


అంతలోకే ఒక మెరుపు తీగలాంటి అమ్మాయి నడుచుకుంటూ ఆ వీధిలోకి వచ్చింది. 16 ఏళ్ళ పడుచుపిల్ల. ఆ పిల్ల చూపు మన్మధ భాణంగా ఉంది. ప్రతిష్ఠానపురంలో పెద్ద, పెద్ద ధనవంతుల కుమారులను సైతం లోకువకట్టి వెంట తిప్పుకొంటున్న సానిదాని కూతురు ఆ పిల్ల. కౌశికుడి కంటబడింది. కళ్ళు జిగేలుమన్నాయి. గుండెల్లోకి దిగింది మన్మధ బాణం. అసలే రోగంతో తిమ్మెరలు ఎక్కిన దేహం. జువజువలాడింది. ఆ కుర్రపిల్ల సోయగాలు విసురుతూ కౌశికుడు వైపుకు కొంటెచూపు విసిరి తుర్రుమని వెళ్ళిపోయింది. పాపం ఆ పిచ్చి బాపడు విలవిల్లాడిపోయాడు. ఆ హొయలు, వయ్యారం, రూపు, చూపు తలుచుకుంటూ మురిసిపోయాడు. తనవైపు ఎందుకు చూచిందీ అని ఆలోచించి కామంతో ఉడికిపోయాడు. కౌశికుడు తనని తాను చూసుకున్నాడు. అందంగా కనిపించాడు. ఏమైనాసరే సాని పాపను కలవాల్సిందే, లేదంటే మరణించవలసిందే. ఇందుకు శరీరం సహకరిస్తుందా! ఈ రోగంతో ఉన్న రూపాన్ని ఆమె అంగీకరిస్తుందా? ఇంతకీ వేశ్య ఇంటికి తనను తీసుకువెళ్ళేది ఎవరు? ఇలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి అతని మనస్సులో, ఆకలిదప్పికలు మరచిపోయాడు. ఇంతలో సూర్యుడు నడినెత్తికి చేరుకున్నాడు.


No comments:

Post a Comment