Monday 20 February 2023

శ్రీదత్త పురాణము (56)



దత్తుడు ఉల్లాసంగా అమ్మపాదములకు నమస్కరించి అనుజ్ఞ తీసికొని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. అలా దత్తుడు సహ్యాద్రిని రాజధానిగా చేసుకొని ముల్లోకాలలోని భక్తులను ఉద్ధరిస్తూ, సాధుజనులను రక్షిస్తూ, క్రూర రాక్షసులను సంహరిస్తూ, యోగ రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆయన ప్రవృత్తి లోకోత్తరంగా వుంటుంది. ఆయన లీలలు ఊహాతీతంగా వుంటాయి. ఒకప్పుడు ఆయన శాంతమనోహరమైన యతిరూపాన్ని ధరిస్తే మరొకప్పుడు భీభత్స భయంకర రూపాన్ని పొందుతూ వుంటాడు. ఏ రూపంలో వున్నా పైకి ఎలా కన్పించినా ఆయన మాత్రం యోగ నిష్టుడే! ఆయన యోగానికి చ్యుతిలేదు. దానికి భంగంలేదు. ఆయన నామ స్మరణచాలు, మానవుల పాపాల్ని దహింపజేయడానికి. అశాంతిలో అల్లాడుతున్నవారు హృదయాన్ని నిర్మలం చేసుకోవాలంటే ఆయన కథల కన్నా ప్రశస్తమైన సాధనాలు లేవు. ఆయన కథలు, లీలలు అనంతములు. వాటిని వివరించి చెప్పాలంటే వేయితలల ఆదిశేషుడికైనా సాధ్యంకాదు.


మానవశరీరంతో అవతరించిన దత్తస్వామి ఎంతోమంది మానవులను పరిపరి విధాలుగా ఉద్ధరించాడు అంటూ సుమతి ముగించాడు. అప్పుడు సుమతి తండ్రి సుమతితో నాయనా రాజవంశంలో పుట్టి రజోగుణంతో జీవించే శ్రీకార్తవీర్యార్జునుడు దత్తుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకోవాలని వుంది. ఆ మహావీరుడి కథ చెప్పి, నా సంశయాలు తొలగించు అన్నాడు.


కార్త వీర్యార్జున వృత్తాంతం


తండ్రి తప్పకుండా చెబుతాను విను. హైహయవంశంలో కృతవీర్యుడు అనే రాజు వుండేవాడు. మాహిష్మతీపురమును రాజధానిగా చేసుకొని ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తూ వుండేవాడు. సర్వ సద్గుణ సంపన్నుడతడు. వేద విహితకర్మలు తాను ఆచరిస్తూ ప్రజలచేత ఆచరింపజేసేవాడు. ప్రజలకు ఎంత ప్రేమ పాత్రుడో శత్రువులకు అంత భయంకరుడు. ఇతడికి చాలాకాలం సంతానం లేదు. మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది. వ్రతాలు చేసింది. తీర్థయాత్రలు చేసింది. కనిపించిన దేవతకల్లా మ్రొక్కింది. ఏ దేవత కరుణించిందో గాని ఏ మహనీయుడి ఆశీస్సులు ఫలించాయోగాని, చివరకు ఆమె కడుపుపండి నవమాసాలు మోసిన పిదప మగబిడ్డడు చొట్ట చేతులతో జన్మించాడు. రాజదంపతులు దిగులు చెందారు. ప్రజలంతా అయ్యోపాపం అనుకున్నారు. అసలు సంతానమే లేకపోతే ఒక బాధ. కానీ ఈ అవిటివాణ్ణి చూస్తూ రోజూ బాధే. వీడు పరిపాలనకు పనికిరాడే. నా తరువాత ఈ రాజ్య భారాన్ని ఎవరు మోస్తారు, అని కృతవీర్యుడు బెంగ పెట్టుకున్నాడు. చూద్దాం రాజవైద్యుల కృషి ఫలితంగా కాని, ఏ మహానీయుడు దయవల్లనో అవిటితనం పోకపోతుందా అని తమని తాము నమ్మపలుకుకుంటూ కాలంగడిపారు ఆ రాజదంపతులు. సకాలంలో జాతకర్మాదిక్రియలన్నీ జరిపించి, భూరిదక్షిణలతో వేదశాస్త్ర విద్వాంసులను సంతృప్తిపరచి అర్జునుడు అని నామకరణం చేసారు. కృతవీర్యుని పుత్రుడు కనుక కార్తవీర్యార్జునుడు అయ్యాడు. చేతులు చచ్చుబడ్డాయి అన్నమాటే గాని అర్జునుడి శరీరం అంతా వజ్ర తుల్యంగా వుంది. తెలివితేటలు అపారం. 

No comments:

Post a Comment