Saturday 18 February 2023

శ్రీదత్త పురాణము (54)

 


అప్పుడు అమ్మ ఆలోచించి ధర్మాధర్మాల మధ్య చేజిక్కించుకో జూచిన వీరు సామాన్యులు కారని తలచి అయ్యలారా అలాగే వడ్డిస్తాను దయజేయమని వేడుకున్నది.


అనసూయదేవి కుటీరము లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకలకు నమస్కరించి స్వామి గృహస్థుల ఇంటికి దేహి అని వచ్చిన వారికి చేతనయినది సమర్పించవలెనని నియమం. అట్లుగాక ఆ నియమాన్ని మీరితే ఆకలితో తిరిగివెళ్ళిపోయినవారు గృహస్థుల పుణ్యాన్ని తీసికొని పోతారు అన్నది శాస్త్ర వాక్యము. కనుక నేను వారు నా బిడ్డలనే భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకొని నగ్నంగా భోజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురూ పసిపిల్లలై కేరింతలు కొడుతూ వున్నారు. అప్పుడు అమ్మకు స్తన్యం వచ్చింది. బట్టలను ధరించి ముగ్గురు పసిబాలురను మూడు ఉయ్యాలలలో పడుకోబెట్టి జరిగిన కథనే జోలగాపాడుతూ వుంది అమ్మ. ప్రపంచాన్ని సృష్టిచేసి అలసినవాడిలా బ్రహ్మ జగత్తు పాలించి సోలిపోయిన వానిలా విష్ణువు హాయిగా ఉయ్యాలల్లో ఆదమరచి నిద్రపోతున్నారు. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగింది తెలుసుకొని వారిని స్థుతించాడు. అతని సోత్రములకు తృప్తి చెందిన త్రిమూర్తులు తమతమ నిజరూపాలతో దర్శనమిచ్చారు. అత్రిమహర్షి అనసూయాదేవితో "దేవీ వీరు నీ పాతివ్రత్యం పరీక్షించడానికి వచ్చారు. నీకు కావలసినవరం కోరుకో" అన్నాడు. అప్పుడు అనసూయాదేవి పాపుల్ని ఉద్దరించడానికి లోకకళ్యాణ నిమిత్తం ధర్మాన్ని సంరక్షించటం కొరకు మీ ముగ్గురు పుత్రులుగా జన్మించాలని కోరిక అంది.


ఇంతలో అక్కడ ముగ్గురమ్మలు ప్రత్యక్షమై సిగ్గుతో తలలు వంచుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు, చూచారా, అమ్మ మహిమ అని తమతమ భార్యలతో అన్నారు. వారు మరింత సిగ్గుతో తలలు దించుకున్నారు. అపుడు త్రిమూర్తులు అమ్మతో " అమ్మా! మమ్ము మేము మీకు సంపూర్ణంగా దత్తత చేసుకుంటున్నాము. అలనాడు సుమతీ కౌశికుల విషయంలో మీకు వరం ఇచ్చాం కదా అని దివ్యమైన అనుగ్రహాన్ని ప్రసాదించారు. అట్టి వరప్రభావం వల్లనే అనసూయ గర్భాన్ని ధరించి త్రిమూర్తులను తన బిడ్డలుగా చేసుకోగలిగింది అని సుమతి తన తండ్రితో త్రిమూర్తుల ఆవిర్భావానికి గల పుణ్యగాధను వినిపించాడు.


No comments:

Post a Comment