Tuesday 12 March 2024

శ్రీ గరుడ పురాణము (117)

 


దానధర్మం - దేవతోపాసన


సత్పాత్రులకు శ్రద్ధాపూర్వకంగా సంతోషంగా వినియోగానికై ఇచ్చే ద్రవ్యం కర్త చేయు దానమనబడుతుంది. ఈ దానం 'ఇక్కడ' సుఖభోగాలనూ 'అక్కడ' మోక్షాన్నీ కర్తకు సంపాదించి పెడుతుంది. అయితే, ఎవరైనా, న్యాయపూర్వకంగా ఆర్జించిన దానిని దానం చేస్తేనే ఆ ఫలితం వుంటుంది.


అధ్యాపనం(చదువు చెప్పుట), యాజనం, ప్రతిగ్రహం ఈ మూడూ బ్రాహ్మణుని వృత్తి ధర్మాలు. వీటి ద్వారా సంపాదించిన ద్రవ్యాన్నిగాని విద్యను గానీ సుపాత్రులకు బ్రాహ్మణులు కూడా దానం చెయ్యాలి. దానమనేది నాలుగు ప్రకారాలు. నిత్య, నైమిత్తిక, కామ్య, విమల.


ఫలాభిలాష లేకుండా ప్రత్యుపకార భావనారహితంగా బ్రాహ్మణునికి ప్రతిరోజూ చేసేది నిత్యదానం. తన పాపశాంతికై బ్రాహ్మణులకు చేయునది నైమిత్తిక దానం. సంతాన, విజయ, ఐశ్వర్య, స్వర్గప్రాప్తి ఇటువంటి వానిపై ఇచ్ఛతో ఇచ్చే దానిని కామ్యదాన మంటారు. దైవప్రీతికై బ్రహ్మజ్ఞానులకు చేసేది విమలదానం. ఇది కల్యాణకారి.


చెఱకు లేదా యవ లేదా గోధుమ (లేదా వరి) పంటతోనిండి వుండి సస్యశ్యామలమైన భూమిని వేదవిదులైన బ్రాహ్మణులకు దానమిచ్చువానికి ఇక పునర్జన్మే వుండదు. భూదానాన్ని మించిన దానం లేదు, వుండదు.


బ్రాహ్మణునికి విద్యాదానం చేస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మచారికి ప్రతిదినమూ శ్రద్ధగా చదువు చివరిదాకా నేర్పువానికి బ్రహ్మలోకంలో పరమపదం ప్రాప్తిస్తుంది.


వైశాఖ పున్నమినాడుపవాసముండి అయిదుగురుగాని ఏడుగురుగాని బ్రాహ్మణులను పద్ధతిగా పూజించి వారికి తేనె, నువ్వులు, నెయ్యి దానమిచ్చి సంతుష్టపఱచి గంధాదులతో అలంకరించి ఈ క్రింది మంత్రం ద్వారా పూజించినవారికి ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తత్క్షణమే నశిస్తాయి.


ప్రీయతాం ధర్మరాజేతి

యథామనసి వర్తతే ॥


(ఆచర 51/13)


ఇక్కడ ధర్మరాజనగా యమధర్మరాజే.


No comments:

Post a Comment