Sunday 24 March 2024

శ్రీ గరుడ పురాణము (129)

 


మహాదేవా! క్రౌంచద్వీపానికి రాజు మహాత్ముడైన ద్యుతిమంతుడు. ఆయనకు కూడా ఏడుగురు కొడుకులే. వారి పేర్లు కుశలుడు, మందగుడు, ఉష్ణుడు, పీవరుడు, అంధకారకుడు, ముని, దుందుభి. ఈ ద్వీపంలో క్రౌంచ, వామన, అంధకారక, దివావృత్, మహాశైల, దుందుభి, పుండరీకవాన్ నామక సప్త పర్వతాలున్నాయి. ఇక్కడ గౌరి, కుముద్వతి, సంధ్య, రాత్రి, మనోజవ, ఖ్యాతి పుండరీక నామములు గల నదులు ప్రవహిస్తున్నాయి.


శాకద్వీపరాజైన భవ్యునికి కూడా జలద, కుమార, సుకుమార, అరుణీబక, కుసుమోద, సమోదార్కి, మహాద్రుమ నామధేయులైన ఏడుగురు కొడుకులున్నారు. ఇక్కడ నలిని, సుకుమారి, కుమారి, ధేనుక, ఇక్షు, వేణుక, గభస్తి అను పేరుగల ప్రసిద్ధ నదులు ప్రవహిస్తున్నాయి.


పుష్కర ద్వీపపాలకుడైన శబల మహారాజుకి మహావీరులైన ఇద్దరుకొడుకులు పుట్టారు. వారి పేర్లు మహావీరుడు, ధాతకి. వారి పేర్లతోనే ఇక్కడ రెండు వర్షాలేర్పడ్డాయి. ఈ రెండిటి మధ్య మానసోత్తరమను పేరు గల మహాపర్వతముంది. ఇది యాభైవేల యోజనాల ఎత్తుతో, అంతే విస్తీర్ణంలో పఱచుకొని వుంది. ఈ పుష్కర ద్వీపానికి నలువైపులా స్వాదిష్ట జలాల సముద్రముంది. ఈ రుచికరమైన చల్లని జలాలలోనే ఈ ద్వీపానికి కాస్త దూరంలో ఒక నిర్జనమైన స్వర్ణమయమైన ప్రపంచం కనిపిస్తుంటుంది. అక్కడ పదివేల యోజనాల విస్తీర్ణంలో పఱచుకొని లోకాలోకమను పేరు గల పర్వతముంది. అది ఎల్లప్పుడూ చీకటి  చేత కప్పబడి వుంటుంది. ఎంత కష్టపడి దానిని చూడడానికి ప్రయత్నించినా, సామాన్య మానవులకి అదేదో అండకటాహంచే ఆవరింపబడినట్లు అనగా నల్లటి గుడ్డు పెళ్ళ చేతనో తాబేటి చిప్పతోనో మూయబడినట్టు మాత్రమే కనిపిస్తుంది.


కపర్ద్యాది దేవతలారా! ఈ భూమి ఎత్తు డెబ్బది వేల యోజనాలు. ఇందులో పదేసి వేల యోజనాల దూరంలో పాతాళ లోకాలున్నాయి. వాటిని అతల, వితల, నితల, గభస్తిమాన్, మహాతల, సుతల, పాతాళ లోకాలని వ్యవహరిస్తారు. ఈ లోకాలలో భూమి కృష్ణ, శుక్ల, అరుణ, పీత, శర్కర సదృశ, శైల, స్వర్ణ వర్ణాలలో వుంటుంది. అదే దైత్యుల, నాగుల నివాస భూమి దారుణ పుష్కర ద్వీపంలోనే నరకాలుంటాయి.


No comments:

Post a Comment