Wednesday 13 March 2024

శ్రీ గరుడ పురాణము (118)

 


అలాగే కృష్ణమృగచర్మంపై బంగారంతో బాటు పై వస్తువుల నుంచి దానమిచ్చిన వారికి ఆ క్షణంలోనే అన్ని రకాల పాపాలూ నశిస్తాయి.


వైశాఖమాసంలో ఘృత, అన్న, జలాలను దానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఆ నెలలో బ్రాహ్మణులకు యమధర్మరాజును స్మరిస్తూ ఆ ద్రవ్యాలను దానమిచ్చిన వారికి అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. ద్వాదశి నాడు ఉపవాసం చేసి సకలపాప వినాశకుడైన విష్ణుభగవానుని పూజించాలి. ఆ మాసంలో ఏ దైవాన్ని నమ్ముకున్నవారైనా బ్రాహ్మణులలో ఆ దైవాన్ని భావించుకొని పూజించి దానం చేస్తే ఆ దేవతలు తప్పకుండా దాత పట్ల సుప్రసన్నులవుతారు. స్త్రీ దేవతలనుపాసించేవారు సౌభాగ్యవంతులైన స్త్రీలను రావించి పూజచే భోజనాదులచే దానంచే సంతృప్తిపరిస్తే ఆయా దేవీమతల్లులు ప్రసన్నులవుతారు.


సంతానాన్ని కోరుకొనేవారు ఇంద్రదేవుని పూజించాలి. బ్రహ్మ వర్చస్సు కావలసిన వారు బ్రాహ్మణులలో బ్రహ్మదేవునాపాదించుకొని వారిని పూజాదానాలతో తృప్తి పఱచాలి. ఆరోగ్యం కావాలనుకొనేవారు. ఇదే పద్ధతిలో సూర్యభగవానుని ఆరాధించాలి. అలాగే 'ధనానికి అగ్నినీ, కార్యసిద్ధికి వినాయకునీ, భోగానికి చంద్రునీ, బలప్రాప్తికి వాయుదేవునీ, మోక్షానికి హరినీ పూజించాలి.


ఇంకా ఏయే దానాల వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో బ్రహ్మ ఇలా విధించాడు.


వారిదస్తృప్తి మా ప్నోతి 

సుఖమక్షయ మన్నదః |

తిలప్రదః ప్రజామిష్టాం 

దీపదశ్చక్షురుత్తమం ॥

భూమిదః సర్వమాప్నోతి 

దీర్ఘమాయు ర్హిరణ్యదః । 

గృహదోగ్యణి వేశ్మాని 

రూప్యదోరూపముత్తమం ॥


No comments:

Post a Comment