Friday 15 March 2024

శ్రీ గరుడ పురాణము (120)

 


దానధర్మము కంటే శ్రేష్ఠమైన ధర్మము లేదు. ఎవరైనా దానమిస్తుంటే అడ్డుకొనేవాడు మరుజన్మలో పక్షిగా పుడతాడు. కరవు దెబ్బతిని మరణానికి దగ్గరవుతున్న మనిషిని చూస్తూ, తన దగ్గర అన్నీ పుష్కలంగా వున్నా కూడా అన్నదానం చేయకుండా పోయేవానికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది.


(అధ్యాయం 51)


ప్రాయశ్చిత్తాలు


బ్రాహ్మణుని చంపు బ్రహ్మహంతా, తాగుబోతూ, దొంతనంచేయు స్తేయీ, గురుపత్నితో రమించు, గురుపత్నీగామీ - ఈ నాలుగు రకాలవారూ మహాపాతకులు. వీరితో స్నేహం చేసి రాసుకు పూసుకు తిరిగేవాడు అయిదో రకం మహాపాపి. గోహత్యాది అన్య పాపాలు ఉపపాతకాలు. వీరికి ఈ పాపాల నుండి విముక్తి కలగాలంటే చేయవలసి కర్మకాండయే ప్రాయశ్చిత్తం.


బ్రహ్మహత్య చేసినవాడు అడవిలోకి పోయి ఒక కుటీరాన్ని నిర్మించుకొని ఉపవాస దీక్షతో అందులో పన్నెండు సంవత్సరాలుండాలి లేదా పర్వతంపై నుండి దూకి చనిపోవాలి.


అలా కాకుంటే అగ్నిజ్వాలలలో ప్రవేశించి గానీ అగాధ జలాల్లోకి దూకిగానీ ప్రాణ పరిత్యాగం చెయ్యాలి. గోవును గానీ బ్రాహ్మణుని గానీ రక్షించే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్న వానికి కూడా బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. ప్రాణత్యాగానికి ముందు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి.


అశ్వమేధయాగాంతంలో చేసెడి అవబృథ స్నానం కూడా బ్రహ్మహత్యా పాతకాన్ని నివారిస్తుంది. వేదవిదుడైన బ్రాహ్మణునికి తన సర్వస్వాన్నీ దానం చేసి వనవాసానికి పోవడం వల్లనూ, త్రివేణీ సంగమంలో మూడురాత్రులుపవాసముండి రోజుకి మూడుమార్లు 

స్నానం చేసే ద్విజునికి ఆ సంగమ మహిమ వల్లనూ, సేతుబంధ రామేశ్వరంలో కొన్నాళ్ళ పాటు రోజుకి ముమ్మారు స్నానం చేయడం వల్లనూ కూడా బ్రహ్మహత్యా పాతకం నివారింప బడుతుంది. అలాగే కపాలమోచన తీర్థంలోనూ వారణాసిలోకూడా.


No comments:

Post a Comment