Wednesday 17 July 2024

శ్రీ గరుడ పురాణము (237)

 


కర్మవిపాక నిరూపణ


మునులారా! పాపకర్మం వల్ల నరకంలోపడి అనుభవించే నారకీయయాతన పూర్తికాగానే ఆ పాపకర్మ క్షయమై పోతుంది. అనగా తగ్గిపోతుంది కాని పూర్తిగా నశింపదు. ఆ మిగిలిన పాపం శమించే దాకా ప్రాణి మరల మరల జన్మలెత్తుతునే వుండాలి.


బ్రహ్మ హత్యా పాతకుడు నరకంలో ఘోర శిక్షలననుభవించి మరల భూమిపై ముందు కుక్కగా, పిదప గాడిదగా, ఆపై ఒంటెగా జన్మించాలి. మదిరాపానం చేసిన మహా పాతకులకు కప్ప ఆపై పేను జన్మలుంటాయి. బంగారం దొంగ క్రిమిగా, కీటకంగా, గురుతల్పగామి గడ్డిగా, కలుపు మొక్కగా జన్మించి గతించినా వారిపాపం ఇంకా మిగిలేవుంటుంది. అది పోవడానికి వారు క్రమంగా క్షయరోగులుగా నల్లటి పళ్ళవారిగా, వంకర గోళ్ళ వారిగా చివరగా కుష్టు రోగులుగా జన్మించి జీవించి గతిస్తారు.


అన్నం దొంగ రోగిగా, మాటతప్పినవారు మూగవారిగా, ధాన్యం దొంగ అధికాంగునిగా, నూనె దొంగ దానినే తాగి బతికే నీచ కీటకంగా, చెడు సలహాలిచ్చే వాడు దుర్గంధముఖునిగా పుడతారు.


బ్రాహ్మణ ధనాన్నపహరించిన వారూ కన్యని కొనేవారు బ్రహ్మ రాక్షసులుగా ఆపై ఎద్దులుగా, కూరల దొంగ నెమలిగా, పుష్పచోరుడు చుంచెలకగా, ధాన్యాన్ని దౌర్జన్యంగా అపహరించినవాడు ఎలుకగా, పండ్ల దొంగ కోతిగా, పశువులను దొంగిలించిన వాడు మేకగా, పాలదొంగ కాకిగా జన్మిస్తారు. మాంసం దొంగ గ్రద్దగా, బట్టల దొంగ తెల్లమచ్చల 

జీవిగా, ఉప్పుదొంగ కీచురాయిగా జన్మిస్తారు.


ఈ విధంగా పాపాలన్నీ నశించిన పిమ్మట భగవంతుడు వీరిని దరిద్రులుగా పుట్టించి ఒక అవకాశాన్నిస్తాడు. ఆ జన్మలో మంచి పనులు చేస్తే ఉత్తమ జన్మలభించవచ్చు; యోగిపుంగవులుగా మారితే మరుజన్మేలేకపోవచ్చు.


(అధ్యాయం 104)


No comments:

Post a Comment