Saturday 1 March 2014

హిందూ ధర్మం - 25

లోకంలో విషయాలను ఇంద్రియాల ద్వారా మనసు గ్రహిస్తుంది. ఇంద్రియాలే మనసుకు ఇన్‌పుట్ అందిస్తాయి. చూడకూడనివి చూడడం, వినకూడనివి వినడం, తినకూడనివి తినడం, మాట్లాడకూడనివి మాట్లాడటం, మాట్లాడవలసిన అవసరం ఉన్న చోట మౌనంగా ఉండడం, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళటం, చేయకూడనివి చెయ్యటం, చేయాల్సినవి చేయకపోవడమే పాపమంటే. ఇంద్రియాల ద్వారానే మనసుకు ఆహారం అందుతుంది. ఆహారం అంటే ఇక్కడ లోకంలో విషయాల జ్ఞానం అని అర్ధం.

ఎక్కడికో ప్రయాణం చేస్తుంటాం. ఎవరో అసభ్యకరమైన మాటలు ముచ్చటించుకుంటున్న సమయంలో చెవులు వాటిని వినడానికే ఆసక్తి చూపుతాయి. లేదు అశ్లీలకర సన్నివేశాలు, మనసును రెచ్చగొట్టే సన్నివేశాలు చూడటానికే కళ్ళు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తాయి. ఇవన్నీ పాపపు పనులే కదా. ఇవన్నీ మనసుకు ఇన్‌పుట్‌ను అందిస్తాయి. మీ మనసుకు అందిన  సమాచారాన్ని అనుసరించే, మీ ప్రవర్తన ఉంటుంది. ఇన్‌పుట్‌ను బట్టే ఔట్‌పుట్ కూడా ఉంటుంది కదా. మనం చూసే, వినే, చదివే ప్రతి విషయమూ మన మనసుపై చెరగని ముద్ర వేస్తుంది, శాశ్వతంగా నిలిచిపోతుంది. మన ప్రవర్తన మీద దీని ప్రభావం అధికంగా ఉంటుంది.

మీకెప్పుడు క్రైంవాచ్ ప్రాగ్రాంలు, హింస ఉండే సన్నివేశాలు చూస్తే, మనలో మనకు తెలియకుండానే నేరపూరిత లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఒక నేరం జరిగినప్పుడు. అది ఏలా జరిగిందో, ఆ సన్నివేశాలను చూపించడం అనవసరం, అసలు అలా చూపించకూడదని, అది సమాజంలో నేరాల సంఖ్యను పెంచుతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు సీరియల్స్ కూడా ఇందుకు భిన్నం ఏమి కాదు.

ధర్మం కూడా అదే అంటొంది. మీ మనసుకు మంచి విషయాలనే అందించండి. చెడు విషయాలను, అసభ్యకరమైన, అశ్లీలకరమైన అంశాలను నుంచి మీ ఇంద్రియాలను వెనక్కు తీసుకోండి. అంటే చెడు విషయాలు చూడాలని ఉన్నా, అక్కడి నుంచి మొదట మీ దృష్టిని మళ్ళించండి, చెడ్డ మటలను వినకుండా మీ చెవులను మంచి విషయాలను వినేలా చేసుకోండి. ఇలా ప్రతి విషయంలోనూ, మీ ఇంద్రియాలను నిగ్రహించుకోండి, వెనక్కు లాగండి. అదే ఇంద్రియ నిగ్రహము.

To be continued...........

No comments:

Post a Comment