Tuesday 4 March 2014

హిందూ ధర్మం - 28

ఈ ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా మనసు చూస్తోంది. మీరు పాపం చేయాలన్నా, పుణ్యం చేయాలన్నా, దానికి ఆధారం మనసే. సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మనసు. ఇక్కడున్న మనసు మరొక క్షణంలో వేరొక చోట ఉంటుంది. మనసుది చంచల స్వభావం అంటే ఒక చోట కుదురుగా ఉండదు. #దమము అంటే మనసును పాప కార్యాల నుంచి, అధర్మం నుంచి నిగ్రహించడం, అంటే కంట్రోల్ చేయడం, ట్రెయిన్ చేయడం. అసలు మనసును ట్రయిన్ చేయడమెందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

స్వామి వివేకానందులు ఇలా చెప్తారు. మనం చేసిన ప్రతి పనికి మనం ప్రతి ఫలం ఏ విధంగా అనుభవిస్తామో, అదే విధంగా మనం చేస్తున్న ఆలోచనలు కూడ మన మీద, సమాజం మీదా ప్రభావం చూపిస్తాయి, తిరిగి ప్రతిచర్య (Reaction) గ్రహిస్తాయి. మనం గమనిస్తే, ఒక వ్యక్తి చెడు పనులకు అలవాటు పడితే, రోజురోజుకు మరింత చెడ్డవాడిగా మారిపోతున్నాడు, అతను మంచి పనులు చేయడం మొదలుపెడితే, మరింత మంచివాడిగా మారిపోతున్నాడు. ఎందుకు?

నేను ఒక పని చేస్తున్నామంటే, నా మనసు ఒక ప్రత్యేక స్థితిలో ఉంటుంది. దాని నుండి కొన్నిvibrations  ఉద్భవిస్తాయి. ప్రపంచంలో నా మానసిక స్థితికి సమానమైన స్థితిలో వేరే ఏ ఇతర వ్యక్తులు మనసులు ఉంటాయో, వారి ఆలోచనలతో నా మనసు ప్రభావితం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక గదిలో అనేక సంగీత వాయిద్యాలను ఒకే రకంగా ట్యూన్ చేసి పెట్టి, అందులో ఏ ఒక్క సంగీత వాయిద్యాన్నైనా ఒక ప్రత్యేక రాగంతో మ్రోగిస్తే, మిగితా అన్ని సంగీత పరికరాలు ఎవరు మ్రోగించకుండానే, అదే విధమైన రాగంతో శబ్దం చేస్తాయి. దీని గురించి ఫిజికల్ సైన్సు చెబుతుంది.

అదే విధంగా ఒకే స్థితిలో ఉన్న వివిధ మనసులు, ఒకే ఆలోచనతో సమానంగా ప్రభావితం అవుతాయి. నేను ఒక చెడుపని చేస్తుంటే, నా మనసులో కొన్ని తరంగాలు(vibrations) ఏర్పడతాయి, అవి ప్రపంచంలో నా మానసిక స్థితిని పోలిన ఇతర మనసులపై ప్రభావం చూపుతుంది. దాంతో వారు కూడా చెడు పనులు అధికంగా చేస్తారు. నేను మంచి పని చేస్తే, నా మానసిక స్థితిని పోలిన ఇతర మనసులపై దాని ప్రభావం పడి, వారు కూడా మంచి పనులు చేస్తారు. అట్లాగే వారి మానసిక స్థితి మన మనసుపై అదే విధమైన ప్రభావం చూపిస్తుంది. అంటే మన ఆలోచనలు మంచిగా ఉంటే, మన మనసు మంచి Vibrationsను గ్రహించి, మనం మంచివారిగా మారుతాం. అదే చెడుగా ఉంటే, చెడ్డవారిగా మారుతాం. అందుకే మన ఋషులు మనసును చెడు ఆలోచనల నుంచి నిగ్రహించండి అన్నారు.

To be continued...........

No comments:

Post a Comment