Friday 18 July 2014

హిందూ ధర్మం - 100 (హిందు పదప్రయోగం)

ఒకసారి ఒకతను ఆర్షవిద్యా గురుకులం స్థాపకులు దయానంద సరస్వతీ గారి వద్ద హిందు అనే శబ్దానికి చెడు అర్ధాలున్నాయని, ఆ పదం పరాయివాళ్ళు అవమానించడం కోసం పెట్టిన పేరని ప్రస్తావించినప్పుడు, ఆయన బదులిస్తూ 'ఇంత గొప్ప సంస్కృతి, సంప్రదాయం, ఎవరో అనమాకులు అర్దంపర్దం లేని పేరును పెట్టిపోతే, ఎట్లా అంగీకరిస్తుంది? హిందు అన్న పదానికి శాస్త్రీయత ఉన్నది' అనిఉన్నది అని చెప్తూ హిందు అంటే హింసానాం దూషయతి, ఖండయతి ఇతి హిందు అని వ్యుత్పత్తి, హింసకు, పాపానికి దూరంగా ఉండేవాళ్ళు, హింసను ఖండించేవారు హిందువులని అర్దం అని బదులిచ్చారు.

హిందు అనే పదం ఉచ్చారణలో తేడా కారణంగా సప్తసింధు అనే పదం నుంచి ఉద్భవిచింది కనుక, ఇది కూడా సప్తసింధు అంత పురాతమైనదై కొందరు పండితుల వాదన. అదే కాకుండా ఈ హిందు పదం సంస్కృత వాజ్ఞ్మయంలో లేదని చాలా కాలం వరకు అనేకులు వాదిస్తూ వచ్చారు. కానీ సంస్కృత భాషలో రాసిన దాదాపు 15 పురాతన గ్రంధాల్లో హిందు పదం ప్రయోగించబడింది. క్రీ.శ.4-6 శతాబ్దాల మధ్యలో శైవ సప్రదాయానికి చెదిన మేరు తంత్రం అనే గ్రంధంలో హిందు పదం కనిపిస్తుంది.

శబ్దకల్పధ్రుమ అనే గ్రంధంలో కూడా హిందు పదం ఉంది. రెండు గ్రంధాలు హిందు అంటే అల్పమైన, నీచమైన, క్షుద్రమైన, తుచ్ఛమైన వాటిని త్యజించేవాడు అని అర్దాలు చెప్తున్నాయి. బృహస్పతి ఆగం అనే గ్రంధం

హిమాలయస్య సమారంభ్య యావదిందు సరోవరం
తస్యదేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రశశ్తయత్

అని చెప్పింది. హిమాలయల నుంచి ఇందు సరోవరం (హిందూ మహాసముద్రం) వరకు ఉన్న ప్రదేశమంతా దేవతల చేత ప్రత్యేకంగా నిర్మితమైందని, అందువల్ల ఇది దేవభూమి అని, దీనికి హిందుస్థానమని పేరు అని చెప్తోంది.

మంగళ్ నాధ్‌జి అనే స్వామిజీకి బృహన్నరది అనే ఒక పురాతన గ్రంధం పంజాబ్‌లోని హోషియార్‌పూర్ దగ్గరలో షాంపూర్ అనే ప్రానతంలో లభ్యమైంది. దాని ప్రకారం హిమాలయాల్లో 'హిం' అనే ధాతువును, ఇందుసరోవరంలో 'ందు' అను ధాతువును కలిపి, ఈ భూమికి హిందుస్థానమని పేరు వచ్చిందని పేర్కొంటోంది.

హిమాలాయలంత ఉన్నతమైన విలువలు, ఆశయాలు, సముద్రమంత లోతుగా అందరిని, అన్నిటిని అర్దం చేసుకునే మనస్తత్వం ఉన్నవారు హిందువులు అని అర్దం.

To be continued.................


No comments:

Post a Comment