Thursday 24 July 2014

హిందూ ధర్మం - 105

హిందు అన్న పదం జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయినా, పురాతన కాలం నుంచి శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైనవి మనలని భారతీయులుగా, భూమిని భారతభూమిగా గుర్తించింది. భారతీయులంటే స్వాతంత్రానంతరం మనం ఏర్పర్చుకున్న రాజ్యాంగం ప్రకారం ఇవ్వబడిన గుర్తింపు కాదు ఇది. ఇది దానికి భిన్నమైనది.

పూర్వం ఈ ప్రదేశాన్ని (ఇప్పుడున్న భారతదేశాన్ని) శకుంతలా దుష్యంతుల కుమారుడు, చంద్రవంశపు రాజైన భరతుడు పరిపాలించిన కారణం చేత దీని భరత భూమి అనే పేరు వచ్చింది. ఈ భరతుడి తర్వాతే పండవులు రాజ్యం చేపట్టారు. కాగా, భరతుడు ఈ భూమిని పరిపాలించకముందు నుంచే ఈ భూమికి భరత భూమి, భరతఖండం అనే పేరు ఉంది. విష్ణుపురాణంలో భారత అనే పేరు గురించి ఒక ప్రస్తావన ఉంది.

उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।
वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।।

సముద్రానికి ఉత్తరంలో, హిమాలయాలకు దక్షిణదిశలో ఉన్న ప్రదేశాన్ని భారతం అంటారని, అక్కడ పుట్టినవారు భారతీయులని, భారతభూమి సంతతి అని పై శ్లోకం చెప్తోంది. భగవద్గీతలో కూడా భారత అని అర్జునుడిని పలుమార్లు సంబోధిస్తాడు కృష్ణపరమాత్మ. వేదం ప్రధానంగా చెప్పే కర్మ యజ్ఞం. అగ్నిఆరాధనకు వేదం విశిష్టవంతమైన స్థాణం ఇచ్చింది. భారత లేక భారతీయులనే పదం కూడా దీనికి సంబంధంగానే పుట్టిందని, అగ్ని ఆరాధకులే భారతీయులని, నిత్యం అగ్ని ఆరాధన జరుగుతుంది కనుక దీనికి భారతదేశమని పేరని కొందరు పండితుల మాట.

అగ్ని అనంతమైనది. అగ్ని అంతటా వ్యాపించి ఉంది. అగ్ని అనగా శక్తి. శక్తి కారణంగానే సృషి ఏర్పడింది. సూర్యుడి నుంచి వచ్చే సౌరశక్తి కూడ అగ్నియే. సర్వజీవులయందూ ఆకలి రూపంలో ఉంటూ, జీవాన్ని నడిపిస్తున్న జఠరాగ్ని కూడా ఈ అగ్ని యొక్క అంశయే. లోకంలో అశాంతి ఏర్పడినప్పుడు, వేదమంత్రాల ద్వారా యజ్ఞంలో ఇవ్వబడిన హవిస్సును దేవతలకు (ప్రకృతి శక్తులకు) చేర్చి, లోకశంతిని చేకూర్చుతున్నది కూడా అగ్నియే. ప్రకృతిలో అసమతూకం ఏర్పడి, అల్లకల్లోలం జరగకుండా, తనలో వేయబడిన ఆవునేతిని, ఇతర ఔషధ ద్రవ్యాలను స్వీకరించి, అప్పుడు జరిగే రసాయన ప్రతిచర్య చేత ప్రకృతి యందు సమతూకం తిరిగి ఏర్పడేలా చేసి, సర్వులను రక్షిస్తున్నది అగ్నియే.  

To be continued .....................

No comments:

Post a Comment