Friday 24 November 2023

శ్రీ గరుడ పురాణము (14)

 


అప్పుడు "నేను ('నేను' అనగా విష్ణువు) ఇలా ఆశీర్వదించాను. 'ఓ పక్షిరాజా! నీవడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది. నాగదాస్యం నుండి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది. దేవతల నందరినీ ఓడించి అమృతాన్ని అవలీలగా సాధించి తేగలవు. అత్యంత శక్తిసంపన్నతను కూడా సాధించి నా వాహనానివి కాగలవు. అన్ని రకాల విషాలనూ విరిచి వేసే శక్తి కూడా నీకుంటుంది. నా కృప వల్ల నీవు నా గాథలనే సంహితరూపంలో ప్రవచనం చేస్తావు. నా స్వరూప మాహాత్మ్యాలే నీవి కూడా అవుతాయి. నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరిటనే 'గరుడ పురాణ' మను పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది.


ఓయి వినతాసుతా! దేవగణాలలో ఐశ్వర్యానికీ శ్రీరూపానికీ నాకున్న విఖ్యాతియే పురాణాలలో నీ యీ గరుడపురాణానికుంటుంది. విశ్వంలో నా సంకీర్తనజరిగే ప్రతి చోటా నీ కీర్తన కూడా జరుగుతుంది. ఇక నీవు నన్ను ధ్యానించి పురాణ ప్రణయనాన్ని గావించు'


ఇంతవఱకూ చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు. 'పరమశివా! నా ద్వారా గ్రహించిన గరుడ పురాణాన్ని గరుడుడు కశ్యప మహర్షికి వినిపించాడు. కశ్యపుడీ పురాణాన్ని వినడం వల్ల అబ్బిన గారుడీ విద్యా బలం వల్ల ఒక కాలిపోయిన చెట్టును తిరిగి బ్రతికించ గలిగాడు. గరుడుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణులను పునర్జీవితులను చేశాడు.


*యక్షి ఓం ఉం స్వాహా అనే మంత్రాన్ని జపిస్తే గారుడీ పరావిద్యను పొందే యోగ్యత లభిస్తుంది. రుద్రదేవా! నా స్వరూపంచే పరిపూర్ణమైన, గరుడుని జ్ఞానముఖం ద్వారా వెలువడిన గరుడ మహాపురాణాన్ని మీరూ వినండి.


(అధ్యాయం - 2)


''యక్షి ఓ( ఉం స్వాహా' గానే దీన్ని పఠించాలి. అంటే ఓ తరువాత గల 'సున్న'ని సగమే పలకాలి.      


No comments:

Post a Comment