Wednesday 29 November 2023

శ్రీ గరుడ పురాణము (19)

 


మానస సృష్టి వర్ణన దక్షప్రజాపతి -


సృష్టి విస్తారం


శంకరా! ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రులవైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు.

రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాలవారు ఏడుగురు అనగా బర్హిషద, అగ్నిష్వాత్త, క్రవ్యాద, ఆజ్యప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడ ఉద్భవించారు. వీరిలో మొదటి ముగ్గురూ అమూర్త రూపులు. చివరి నలుగురూ మూర్త రూపులు, అంటే కళ్ళకు కనిపిస్తారు.


కమల గర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్ఠం (కుడి బొటనవ్రేలు) నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతీ, ఎడమ బొటనవ్రేలి నుండి ఆయన భార్యా పుట్టారు. వీరికి శుభ లక్షణలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవియను పుత్రికను రుద్రునకిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు.


దక్షుడు ఒక అసాధారణ రూపవతీ, సుందర సులక్షణ లక్షిత జాతాయగు (తన) ఖ్యాతియను కూతురిని భృగుమహర్షికిచ్చి పెండ్లి చేశాడు. వారికి ధాత, విధాతలను కొడుకులూ, శ్రీయను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరి వరించి శ్రీహరియైనాడు. వారికి బల, ఉన్మాదులను కొడుకులు గలిగారు.


మహాత్ముడైన మనువుకి ఆయతి నియతి అను ఇద్దరు కన్యలు పుట్టగా వారిని భృగు పుత్రులైన ధాత, విధాతలకిచ్చి పెండ్లి చేశాడు. వారికి ప్రాణుడు, మృకండుడు పుట్టారు. నియతి పుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షియైన మార్కండేయుడు.


మరీచి - సంభూతిలకు పౌర్ణమాసుడను పుత్రుడు జనించాడు. ఆ మహాత్ముని పుత్రులు విరజుడు, సర్వగుడు. అంగిరామునికి దక్ష కన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు, సినీవాలీ, కుహూ, రాకా అనుమతీ నామక కన్యలు కలిగారు.


No comments:

Post a Comment