Tuesday 1 September 2015

అంగారక చతుర్థి కధ

ఓం గం గణపతయే నమః

సప్త మోక్ష పురాలలో ఒకటైన అవంతికాపురి (ఉజ్జయిని,మధ్యప్రదేశ్ లో ఉంది) లో నిత్యం అగ్నిహోత్రాన్ని నిర్వహించేవాడు, సమస్త శాస్త్రకోవిదుడు, వేదస్వరూపుడైన భరద్వాజముని నివసిస్తుండేవారు. గంగా తీరానికి వెళ్ళి 3 సంధ్యలలోనూ సంధ్యావందనం, అనుష్ఠానం మొదలైనవి నిర్వర్తించేవాడు.

ఒకనాడు భరద్వాజ మహర్షి ఉషోదయాన అనుష్ఠానం నిర్వర్తించుకుని తిరిగి వస్తుండగా, గంగా తీరంలో విహారానికి వచ్చిన దేవలోకపు అప్సరస ఆతన దృష్టిలో పడింది. ఆమె సౌందర్యం ఎంత మోహపరవశాన్ని కలిగించిందంటే మహతప్పశాలి, అపర శివావతారుడు అని పిలువబడే ఆ మహర్షిని విచలితుణ్ణి చేసింది.

ఆ అప్సరస కారణంగా భరద్వాజుడికి రేతస్సు (వీర్యము) పతనమై భూమిపైన పడింది. (స్వేదం (చెమట) పడిందని అని కొందరు అంటారు. ఏది ఏమైనా కధ తెలుసుకోవడంలో ఇది అడ్డంకి కాకుడదు.) ఒక కారణజన్ముడు జన్మించాలి కనుక,భూమాత దానిని స్వీకరించింది. తద్వారా ఒక ఆజానుబాహుడు, ఎర్రని దేహకాంతి కలవాడు, విశాలమైన నేత్రాలు గల బాలకుడు ఉదయించాడు.

తన జన్మకు మహర్షి కారణమని తెలియని ఆ బాలుడు నిరంతరం తల్లిని తన తండ్రి ఎవరని వేధించేవాడు. తగిన సమయం వచ్చినప్పుడు, తెలియజేయాలని అనుకున్న భూదేవి మౌనంగా ఆ బాలుని పెంచసాగింది. 7 సంవత్సరముల వయసులో ఆ బాలకుడిని తీసుకుని, భరద్వాజ మహర్షి వద్దకు వెళ్ళిన భూదేవి "మహర్షీ! నీ కారణంగా ఈ బాలుడూ జన్మించినందున, ఇతడిన పుత్రుడుగా పరిగ్రహించు. చౌలము, ఉపనయనము మొదలైన సంస్కారాలు జరిపించి, అమోఘ విద్యాప్రాప్తి కలిగించు" అని ఆ కూమారుని అప్పగించింది.

సాక్షాత్ భూదేవి తనకు అప్పగించిన పుత్రుని వాత్సల్యంతో దగ్గరకు తీసుకున్నాడు భరద్వాజుడు. ఉపనయనాది సంస్కారాలు యధావిధిగా జరిపించి, గణపతి మహామంత్రమును ఉపదేశించాడు. "నాయనా! ఈ గణేశ మంత్రాన్ని స్వామి ప్రీతికొరకు జపించి ఆయన అనుగ్రహం పొంది, నీ జన్మ ధన్యం చేసుకో!" అని చెప్పాడు.

తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ బాలుడు నర్మదా నది తీరాన కఠోర తపస్సు చేశాడు. ఒకానొక మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థీ (చవితి) దినాన చంద్రోదయ వేళలో "ఎవరి ఆజ్ఞ చేత బ్రహ్మ సృష్టి చేస్తాడో, ఎవరి ఆజ్ఞతో విష్ణువు స్థితికారకుడిగా రక్షిస్తాడో, ఎవరి ఆజ్ఞతోనే పరమశివుడు లయం చేస్తాడో, ఎవరి అనుగ్రహం వలన యోగులు, సిద్ధులు సిద్ధిని పొందారో, ఎవరు నిత్యం మూలాధారంలో స్థిరంగా ఉంటాడో, అట్టి పరబ్రహ్మ అయిన మాహా గణపతి" ఆ బాలునకు దర్శనమిచ్చాడు. సర్వాభరణ భూషితుడైన గజానన మహారాజును ఆ బాలుడూ స్తూతించాక, గణపతి ప్రసన్నుడై "కుమారా!.........కోఠరమైన నీ తపోదీక్షకు మెచ్చి నీకు వరం ఇవ్వదలచాను. ఏ వరం కావాలో కోరుకో" అన్నాడు.

"గణనాధా! నీ దర్శనమాత్రాన నా జన్మ చరితార్ధమైంది. నాకు కోరికలు ప్రత్యేకంగా ఏమీ లేవు. నేనూ దేవతాగణాలలో ఒకడిగా ఉండేలా అనుగ్రహించు. చాలు!" అన్నాడు ఆ బాలుడు.

"నీవు నిరపేక్షతో నన్ను ప్రసనున్నుణ్ణి చేసుకునందుకు నీకు వారాలలో ఒక రోజుకు ఆధిపత్యం ఇస్తున్నా. నీకు గ్రహాలలో స్థానం కల్పిస్తాను. నేటి నుంచి నీవు "మంగళుడు" అనే పేరుతో ప్రసిద్ధుడవవుతావు. అనగా ప్రజలకు "మంగళాలను" (శుభాలను) కలిగించే వాడవు. నీకు ఆధిపత్యం ఇచ్చిన రోజున నా "చవితి తిధి" ఏర్పడితే, ఇంకా ఎక్కువ పుణ్యఫలదాయకం అయ్యేలా అనుగ్రహిస్తున్నాను. భూదేవి పుత్రునిగా నీవు "కుజుడు"అనే పేరుతో వ్యవహరించబడతావు" అని అనుగ్రహించాడు గణపతి.

అనంతరం దశభుజ గణపతిని, కుజుడు కామదాతృక్షేత్రంలో ప్రతిష్టించి తన పేరిట అంగారక చవితి వ్రతాన్ని చేసినవారికి సర్వసౌఖ్యాలు ఓనగూడెలా దీవించమని విఘ్నరాజును ప్రార్ధించాడు. చింతితమైన (కోరిన) అభీష్టాలను (కోరికలను) మణివలె ప్రసాదించేవాడైన ఈ గణపతిని చింతామణి గణపతి అంటారు .నేటికి కామాదాతృ క్షేత్రంలో చంద్రోదయ సమయంలో సిద్ధులు,యోగులు,గంధర్వులు గణపతిని సేవిస్తుంటారు.          

ఇదండీ అంగాకర చతుర్థీ కధ.         

చిత్రంలో ఉన్నది శ్రీ చింతామణి గణపతి స్వామి. భక్తులపాలిట చింతామణియై సర్వాభీష్టాలు తీరుస్తున్నాడు.

ఓం చింతామణి గణపతయే నమః

Originally Published: 1st Jan 2013
Will be Republished on every angaraka chaturthi

No comments:

Post a Comment