Friday 13 February 2015

మహాశివరాత్రి - ఉపవాసం

ఓం నమః శివాయ

17, ఫిబ్రవరి, 2015, మంగళవారం, మాఘ బహుళ చతుర్దశి, మహాశివరాత్రి సంధర్భంగా శివరాత్రి ఉపవాసం గురించి ఒక కధ చెప్పుకుందాం.

శివుడు కరుణ చూపాలి, అనుగ్రహించాలి అనుకుంటే ఎన్నో విచిత్రాలు చేస్తాడు. పూర్వం ఏమి తెలియని ఒక బోయవాడు ఉండేవాడు. పక్షులు, జంతువులు వేటాడి బ్రతికేవాడు. ఒకసారి వేట కోసం జంతువులను వెతుకుతూ అడవికి వెళ్ళాడు కానీ ఒక్క జంతువు కనపడలేదు. జంతువులను చంపకపోతే అతనికి, అతని భార్యకు ఆహారం ఉండదు. అందువల్ల ఆ రోజు వేటాడిన తరువాతే ఇంటికి వెళ్దాం అనుకున్నాడు. చాలాసేపు వెతికిన తరువాత ఓపిక నశించి అక్కడే ఉన్న ఒక చెట్టు ఎక్కుదామని క్రింద ఉన్న రాయి మీద కాలు వేసి, ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అది ఒక శివలింగం, కానీ ఆ బోయవానికి అది శివలింగం అనే సంగతి తెలియదు. అతడు ఎక్కింది మారేడు చెట్టు. చాలాసేపు ఎదురు చుశాడు. అతనికి దాహం వేయడంతో తనతో పాటు తెచ్చుకున్న నీటిని త్రాగుదామనుకున్నాడు, కాని భార్య గుర్తుకురావడంతో నోటిలో పోసుకున్న నీటిని ఉమ్మేశాడు. అవి క్రింద ఉన్న రాయి (శివలింగం) మీద పడ్డాయి. అది ఆ శివలింగానికి జరిగిన అభిషేకంగా శివుడు భావించాడు. శబ్దం చేస్తే జంతువులు రావని నిశ్శబ్దంగా దాహంతోనూ, ఆకలితోను, మౌనంగా రాత్రంతా అలాగే కూర్చున్నాడు.


రాత్రవుతోంది కాని తన భర్త ఇంటికి రాకపోవడంతో ఆందోళనగా అతని భార్య అతని కోసం వెతకడానికి బయలుదేరింది. ఆమె కూడా ఏమి తినలేదు. తన భర్త కోసం గాలిస్తూ ఆమె దగ్గరలో ఉన్న ఒక శివాలయం వద్దకు చేరుకుంది. ఆ రోజు శివరాత్రి. భక్తులు తన్మయత్వంతో భజనలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆమె ఆ భజనలు విని, వాటికి ఆకర్షితురాలయై, భజన తరువాత ఏమైనా పడతారేమో అని, ఆ భజనలు వింటూ అక్కడే కూర్చుంది. కానీ భజనలో మమేకమై ఆకలిని మరిచిపోయింది.

`ఈ బోయవాడికి బాగా ఆకలి వేయడం వలన అతనికి నిద్రరాలేదు. అతనికి కూర్చొవడం ఇబ్బందిగా ఉండడంతో, అప్పుడప్పుడు కదిలాడు. అతను కదిలిన ప్రతిసారి మారేడు చెట్టుకున్న మారేడు దళాలు రాలి, క్రింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. అలా ప్రతి జాములోను (అంటే ప్రతి మూడు గంటలకు) పడుతూనే ఉన్నాయి. అది శివుడు అతని వలన జరిగిన అర్చనగా భావించాడు. ఈ విధంగా అడవిలో బోయవాడు, గుడిలో అతని భార్య రాత్రంతా జాగరణ చేశారు.


ఉదయం సూర్యోదయం జరగగానే అతను తన భార్యను వెతుకుతూ గుడికి చేరుకుని, ఒకరినిఒకరు చూసుకుని సంతోషపడసాగారు. ఇంతలో ఆ గుడి పూజారి వచ్చి వీళ్ళకు ప్రసాదం పెట్టాడు. ఏమి దొరకక ఆకలితో ఉన్న వాళ్ళీద్దరు, ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. అక్కడితో వాళ్ళ ఉపవాసవ్రతం పూర్తయ్యింది అని శివుడు భావించాడు. ఈ వ్రతం చేయడంతో వారిలో మార్పు వచ్చింది. వేటాడడం మానేసి మంచివృత్తిని ఎంచుకుని ధర్మంగా జీవించారు.

ఇద్దరు మరణించగానే వారి ఆత్మలను తీసుకువెళ్ళడానికి యమభటులు వచ్చారు. అప్పుడే శివభటులు కూడా వచ్చి వారిని కైలాసానికి తీసుకువెళతామనగా, వీళ్ళు ఎన్నో పాపాలు చేశారు, అనేక జంతువులను చంపారు. వీరు నరకానికే వెళ్ళాలన్నారు యమభటులు. అప్పుడు శివభటులు "వీరు ఆ మహాశివరాత్రి నాడు చేసిన ప్రతి పనిని కూడా పరమశివుడు తన పూజగా భావించి, వీరికి అనంతమైన పుణ్యాన్నిప్రసాదించాడు. వీరు చెసిన వ్రతానికి వీరి పాపం మొత్తం భస్మమైపోయింది. అందువల్ల వీరికి కైలాసంలో ఉండే అవకాశం ఏర్పడింది" అని పలికి వారిని కైలాసానికి తీసుకుపోయారు. అందుకే జన్మకో శివరాత్రి అన్నారు.

మహాశివరాత్రి నాడు ఉపవాసం, శివనామంతో జాగరణ చేయడం, శివలింగాన్ని పూజించడం వలన అనంతమైన పుణ్యం, శివును ఆశీర్వాదం కలుగుతాయి. శివుడు ఆసుతోషుడు అంటే చిన్న చిన్న పూజలకే పొంగిపోయి వరాలిచ్చేవాడు. అటువంటి శివయ్య ఆశీర్వాదంతో జీవితాన్ని సంతోషదాయకం చేసుకోండి.


ఓం నమః శివాయ

No comments:

Post a Comment