Monday 16 February 2015

శివరాత్రి కధ - 3

కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు. అహంకారమమకారాలు ఎంతటి పనినైనా చేయిస్తాయి. సృష్టికర్త అయిన బ్రహ్మ, తన ఆధిపత్యం కోసం 'తాను లింగం యొక్క పైభాగాన్ని చూసినట్ట్లుగా దొంగసాక్ష్యం చెప్పమన్నాడు. అబద్ధం చెప్పడం పాపం అంటుంది మొగలి పువ్వు. తాను సృష్టికర్తననీ, తన ఆదేశాలనీ పాటించితీరవలసిందే అన్నాడు. చేసేది లేక అసత్యపు సాక్ష్యానికి కేతకీ పుష్పం ఒప్పుకుంది.

ఇంతలో కామధేనువు కనపడింది. ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగగా, ఈ దివ్యజ్యోతిర్లింగాన్ని దర్శించి వస్తున్నా అని చెప్తుంది బ్రహ్మతో. నువ్వు దీనీ అగ్రభాగం చూశావా? అని అడుగగా, చూశాను అంటుంది. అయితే నువ్వు కూడా నా తరపున సాక్ష్యం చెప్పాలి అంటాడు.

తాము మొదటి నిశ్చయించుకున్న ప్రదేశానికి మొగలిపువ్వు, కామధేనువుతో చేరుకుంటాడు. విష్ణువు తన ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మ మాత్రం తాను, లింగం యొక్క అగ్రభాగాన్ని చూశానని, తానే గొప్పవాడినని, కామధేనువు, మొగలిపువ్వులే సాక్ష్యాలని చెప్తాడు. ఎప్పుడు, ఎవరు ఏమి చెస్తున్నారో ఆ పరమాత్ముడికి తెలియదా?.

అప్పుడు ఆ లింగం నుంచి 'ఓం','ఓం','ఓం' అని ప్రణవం వినిపిస్తుంది. లింగం యొక్క దక్షిణభాగం నుంచి అకారం, ఉత్తరం నుంచి మకారం, దాని తరువాత నాదం వినిపిస్తున్నాయి. అదే ఓంకారం.  వెంటనే ఆ దివ్యలింగం నుండి ఒక మహాశక్తి పుట్టింది. 10 చేతులతో, తెల్లని వర్ణంతో, 5 తలలతో, త్రిశూలం, ఢమరుకం ధరించిన ఒక దివ్యమైన, సుందరమైన ఆకారం ఏర్పడింది. ఆయనే పరమశివుడు. అబద్దం చెప్పిన బ్రహ్మ మీద పరమేశ్వరునికి కోపం కట్టలుతెంచుకుంది. ఆయన కోపం నుండి వీరభధ్రుడు పుట్టాడు. అసత్యాలు పలికితే ఎమవుతుందో, ఎలాంటి శిక్ష పడుతుందో ఇది తెలియజేస్తుంది. అబద్దం చెప్పిన బ్రహ్మ ఇదవ తలను నరికేశాడు వీరబధ్రుడు. బ్రహ్మనే హతమారుద్దాం అనుకున్నాడు, కానీ, బ్రహ్మ పశ్చాతాపడ్డాడు. క్షమించమని వేడుకున్నాడు. ఆ భీఖర సన్నివేశం చూడలేక బ్రహ్మను కాపాడమని విష్ణువు కూడా శివుడిని వేడుకున్నాడు. బ్రహ్మను వదిలేశాడు వీరభధ్రుడు.

అబద్దం చెప్పిన మొగలిపువ్వు భయంతో వణికిపోతోంది. దాని వైపు చూసిన శివుడు, నీవు అసత్యం పలికినందుకుగానూ నువ్వు నా పూజకు పనిరావు, నీతో నేను పూజింపబడను అని శపించాడు. అందుకే మొగలిపువ్వు శివపూజకు పనికిరాదు. చేసిన తప్పు తెలుసుకుని భాధపడి ఈశ్వరుని వేడుకుంది మొగలిపువ్వు. చేసిన తప్పు తెలుసుకున్నందుకు సంతోషించి నీవు నా పూజకు అర్హత కోల్పోయినా, నా పూజల కొరకు చేసే అలంకారాల్లో వాడబడతావు అన్నాడు.

శివుడు కామధేనువు వైపు చూస్తూ "కామధేనువు బ్రహ్మ అగ్రభాగం చూసినట్టూ నిలువుగా తన తల ఊపింది. కాని తోక మాత్రం అబద్దమని చెబుతు అడ్డంగా ఊపింది. అందువల్ల ఆవు తోక భాగం పూజనీయమవుతుంది. ఉదయం లేవగానే ఎవరు ఆవు తోక భాగం చూస్తారో, వారికి సకల శుభాలు కలుగుతాయి. అలా కాకుండా దాని మొహం చూస్తే దరిద్రం పడుతుంది" అని పలికాడు సదాశివుడు.

నిజాయతీగా నిజం ఒప్పుకున్న విష్ణువును చూసి, ఆనందపారవశ్యంతో నువ్వు సర్వలోకములయందు నాతో సమానంగా పూజింపబడతావు అంటూ వరం ఇచ్చాడు. ఇక్కడ ఓ విషయం మర్చిపోకూడదు. శివుడికి, విష్ణువుకు బేధం లేదు. వాళ్ళను ఇద్దరుగా వేరు చేసి చెప్పడం కూడా దోషం అవుతుందేమో. శివకేశవులు కలిసి ఆడిన మహానాటకం ఇది. అసత్యం పలికేవాళ్ళకు ఏ గతి పడుతుందో చెప్పడానికి, సత్యంగా, నిజాయతీగా బ్రతికేవాళ్ళకు సాక్షాత్తు భగవంతునికి సమాన స్థానం వస్తుందని తెలియపరచడానికి వారు ఆడిన దివ్య క్రీడ ఇది.

అటు తరువాత బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ లింగాన్ని పూజించారు.

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల బాసిత శోభిత లింగం
జన్మజ దుఖః వినాశక లింగం
తత్ప్రణమామి సదా శివలింగం

ఆఖరున శివుడు, బ్రహ్మ, విష్ణువులతో మనం ముగ్గురం ఒకే శక్తి యొక్క వేర్వేరు తత్వాలము. మన ముగ్గురికి ఎంత మాత్రమూ తేడా లేదు అని పలుకుతాడు.

ఈ మహాలింగం ఉద్భవించిన రోజే శివరాత్రి. ఆ రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అంటారు. ఆ కాలంలోనే మహాశివుడు దివ్య లింగంగా ప్రకటితమయ్యాడు. అందుకే శివనామంతో శివరాత్రికి జాగరణ చేస్తూ, ఈ కధను గుర్తు చేసుకుంటూ, మనలో ఉన్న పరమశివుడిని జాగృతం చేస్తాం.

ఓం నమః శివాయ 

No comments:

Post a Comment