Wednesday 2 April 2014

హిందూ ధర్మం - 42

ధర్మం యొక్క తదుపరి లక్షణం ధీః - బుద్ధి అంటుంది మనుస్మృతి.

ధర్మాచరణకు ఉండవలసిన లక్షణం బుద్ధిని ఉపయోగించడం. బుద్ధిని వృద్ధి చేసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకొవడం, బుద్ధి శక్తికి విఘాతం కలిగించే మాదకద్రవ్యాలు, మత్త పదార్ధాలు, మద్యం, ధూమపానం (సిగిరెట్టు), మత్తు కలిగించే ఆహారపదార్ధాలు, మాంసహారం మొదలైనవాటికి దూరంగా ఉండడం, బద్ధకస్తులు, దుర్మార్గులు, చెడు అలవాట్లు కలిగినవారి నుంచి దూరంగా ఉండడం, అజాగ్రత్తగా ఉండకపోవడం (సావధానంగా ఉండడం), మంచివారితో, సాధుపురుషులతో, భగవత్ భక్తులతో స్నేహం చేయడం, సత్సంబంధాలు కలిగి ఉండడం, యోగా మొదలైన ప్రక్రియలను ఆచరించడం, పుష్టికరమైన, సంతులిత ఆహారం తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధమైన అలవాట్లను కలిగి ఉండడం వంటివి బుద్ధిని వికసింపజేస్తాయి. ఈ లక్షణాలు కలిగి ఉంటూ బుద్ధి శక్తిని కాపాడుకోవడం, వృద్ధి చేసుకోవడం ధర్మం అంటున్నారు మను మహర్షి.

మనిషికి బుద్ధి జీవి అని పేరు. సృష్టిలో అన్ని జీవులకు బుద్ధి ఉన్నా, వాటి నడవడిక వాటి పూర్వజన్మ కర్మను, వాసనలను అనుసరించె ఉంటుంది. మానవుల విషయంలో కూడా అంతే. కానీ మనిషికి, ఇతర జీవులకు ఉన్న తేడా, మనిషి కొత్తగా కర్మ చేయవచ్చు, అది పుణ్యమైనా, పాపమైనా. జంతువులు కేవలం ఫలాలు మాత్రమే అనుభవిస్తాయి. అవి చేసే కర్మలకు పాపపుణ్యాలు ఉండవు. మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప సాధనం బుద్ధి.

మనమేం చేసినా అది తిరిగి మనవద్దకు వస్తుంది, ఈ సమస్త ప్రకృతి కొన్ని చక్రాల మీద నడుస్తున్నది, మనసు పూర్వజన్మ వాసనలనే చక్రంలో బంధించబడి ఉంటుంది. కర్మలు కూడా అంతే. ఈ జగత్తు మొత్తం ఒక పెద్ద యంత్రం లాంటిది. కానీ ఈ జగద్యంత్రానికి వెలుపల నుంచి పని చేసే సాధనమే బుద్ధి.

జీవితంలో మనకు ఎప్పుడు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి మంచిదారి, రెండవది చెడ్డదారి. ఏ దారిలో పయనిస్తామన్నది మనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది, మనిషికి సంపూర్ణంగా నిర్ణయాధికారం ఉంది. మీరు ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే స్వేచ్చ భగవంతుడి ఇచ్చాడు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఎంచుకున్న మార్గాన్ని బట్టి మీకు ఏ ఫలాలు లభించాలో, అవి మాత్రమే భగవంతుడు ఇస్తాడు. ఇక్కడే బుద్ధిని ఉపయోగించాలి. సరైన సమయంలో సరైన మార్గాన్ని ఎంచుకోవాలి.

To be continued..............

No comments:

Post a Comment