Wednesday 9 April 2014

హిందూ ధర్మం - 44

బుద్ధిని వికసింపజేసే ఆహారం తీసుకోవడం ధీః

ఆరోగ్యవంతమైన, పుష్టికరమైన, పోషకాహారం తీసుకుకోవడం ధర్మం అన్నారు మనుమహర్షి. బుద్ధిని వికసింపజేసే ప్రధానమైన ఆహారం ఆవుపాలు. దేశవాళీ ఆవుపాలు రోజు త్రాగేవారికి అమోఘమైన బుద్ధి ఉంటుంది. ఆవుదూడ త్రాగిన తరువాత మిగిలిన పాలనే స్వీకరించాలి. అటువంటి ఆవుపాలు మాత్రమే బుద్ధిని వృద్ధి చేస్తాయి. జెర్సీ ఆవుపాలు విషంతో సమానం. అవి తాగడం కంటే, తాగకపోవడం శ్రేయస్కరం. ఆంగ్లేయులు భారత్‌ను తన ఆధీనంలోకి తీసుకునే సమయానికి కలకత్తాలో జనాభాకు సరిసమానంగా గోవుల సంఖ్య ఉండేది అని బ్రిటీషర్ల రికార్డులు చెప్తున్నాయి. అప్పుడు వ్యవసాయం మొత్తం గో ఆధారితంగానే జరిగేది. దానికి సహజ వ్యవసాయం అని పేరు. అదే పాలేకర్ విధానం. జనమంతా ఆవుపాలనే స్వీకరించేవారు. గేదెపాలు స్వీకరించడం ఈ మధ్య కాలంలో మాత్రమే వచ్చింది. కానీ ఈ గేదెపాలు బుద్ధిపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు.

దేశవాళీ గోపేడ, గో మూత్రాలను, వేప మొదలైన కొన్ని ఇతర సహజ పదార్ధాలను కలిపి చేసే ఎరువుతో ఆహారం పండించేవారు. ఎద్దు చేత దున్నబడిన భూమిలో పండిన ఆహారం నేత్రవ్యాధులను అస్సలు రానివ్వదని వేదం అంటుంది. ఓ భూమాతా! నువ్వు మా తల్లివి. నిన్ను గోమయం చేత మరింత పవిత్రం చేస్తున్నాము అంటూ గోమయాన్ని (ఆవుపేడ) ఎరువుగా వాడాలని ఒక ఉపనిషత్‌లో మాట. ఈ విధమైన వ్యవసాయ విధానమే దేశమంతటా ఉండేది. ఆ కాలంలో వారు ఒక ఎకరం భూమిలో పండిన ఆహార ధాన్యాలను, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఎన్ని పరిశోధనలు చేసినా ఈరోజుకు పండిచలేకపోతున్నాయి. ఈ వ్య్వసాయానికి మూలం వేదం. ఈ విధమైన సహజ వ్యవసాయం విధానంలో పండిన ఆహారమే బుద్ధి వికసింపజేస్తుంది.

తద్విరుద్ధంగా రసాయనాల చేత పండిన ఆహారం శరీరాన్ని విషతుల్యం చేస్తుంది. ఆఖరికి తల్లిపాలల్లో కూడా విషం చేరిపోయిందంటే పరిస్థితి మనం అర్దం చేసుకోవచ్చు. ధీః బుద్ధిని వికసింపజేసే ఆహారం తీసుకోవడం. దీనీ అర్దం ఎంత ఎక్కువ ఆహారం తీసుకుంటే అంత మంచిది అని కాదు, మనమున్న ప్రదేశాన్ని బట్టి, నడుస్తున్న ఋతువును బట్టి, వాతవరణ పరిస్థితులను బట్టి, ఎప్పుడు ఏది తీసుకుంటే మనకు మంచిదో ఆయుర్వేదంలో ఋషులు సూచించారు. అట్లాగే అప్పుడు ఏది తీసుకోకూడదో, దాన్ని శాస్త్రంలో నిషేధించారు.

ధీః - మంచి ఆహారాన్ని ఋషులు చెప్పినట్టుగా, మనమున్న దేశకాలాలకు లోబడి స్వీకరించడం.

To be continued.........

No comments:

Post a Comment