Saturday 19 April 2014

హిందూ ధర్మం - 49 (విద్య)

శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఆధునిక కాలంలో మళ్ళీ మనిషి ఇతర గ్రహాలపై అడుగుపెట్టాడు. విశ్వం యొక్క రహస్యాన్ని చేధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఇంకా అంతులేని ప్రశ్నలు వేల కొద్ది పుట్టుకొస్తున్నాయి. కొన్నిటికి సమాధానం ఉండదు. కొన్ని చేధించడం కష్టం. వీటిని తెలుసుకోవద్దని కానీ, ఇవి అవసరం లేదని కానీ వేదం, శాస్త్రం ఎప్పుడు చెప్పలేదు. వేదంలో కంప్యూటర్ మొదలైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది. కానీ ఇదంతా బాహ్య విషయజ్ఞానం. విద్య అంటే ఏమిటి? దెన్ని తెలుసుకుంటే ఇక ఏది తెలుసుకోవలసిన అవసరం ఉండదో, ఏది అర్దమైతే ఈ లోకంలో రహస్యాలన్నీ అర్దమవుతాయో, దేన్ని తెలుసుకున్న క్షణంలోనే మానవ మస్తిష్కానికి వచ్చే సమస్త ప్రశ్నలకు సమాధానం తొలగుతుందో, ఏ జ్ఞానం చేత ఇక మనిషికి ప్రశ్నలు అనేవి తలెత్తవో, అదే విద్య. దాని గురించే ధర్మం మాట్లాడుతోంది.

ఈ విద్య మన గురించి చెప్తుంది. 'యత్ పిండాండే తత్ బ్రహ్మాండే' అని సంస్కృత వాక్కు ఒకటి ఉంది. ఏదైతే ఈ పిండాండంలో (శరీరంలో) ఉందో, అదే బ్రహ్మాండంలో కూడా ఉంది. ఎక్కడో ఉన్న విషయాన్ని అర్దం చేసుకోవడం కంటే మనలో ఉన్న విషయాన్ని అర్దం చేసుకోవడం సులభం. ఈ రహస్యం మనకు దగ్గరగా ఉంది. మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కడికి వెళుతున్నాడు? జీవితంలో వచ్చే సుఖదుఖాలకు, కష్టనష్టాలకు కారణం ఏమిటి? అసలు అందరిలో ఉన్న 'నేను' ఎవరు? ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి అనేక రహస్యాలను విస్పష్టం చేస్తుంది విద్య.

ఇంకోమాటలో చెప్పాలంటే ఎవరో చనిపోతారు. అందరూ ఏడుస్తుంటారు, అక్కడున్న వారు అప్పుడే పోయావో అంటూ శోకాలు పెడతారు. ఇంకా శవాన్ని దహనం చేయలేదు కదా. ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. కాకపోతే ఉలుకుపలుకు లేదు, ఒక బొమ్మలాగా ఉన్నాడు, అంతేకదా. మరి ఎక్కడికో పొవడమేమిటి? అక్కడ పోయింది ఎవరు? కదలకుండా ఉన్న ఆ దేహం ఎవరు? అతనే దేహం అయితే అతను అక్కడే ఉన్నాడు కదా. మరీ ఈ ఏడుపులు, శోకాలు ఎందుకు? వెళ్ళిపోయిందెవరు, అక్కడ పడి ఉన్నది ఎవరు? అతను ప్రాణం అయితే, ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి పోయింది? అసలు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానం చెప్తుందీ విద్య.

To be continued...........

No comments:

Post a Comment