Sunday 27 April 2014

హిందూ ధర్మం - 54 (సత్యం)

త్రికరణ శుద్ధిగా సత్యాన్ని ఆచరించడం ధర్మం. అంటే మనసులో ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనుల్లో కూడా సత్యం ఉండాలి. అంటే నీతీగా, నిజాయతీగా బ్రతకాలి, లంచాలు తీసుకోకుండా బ్రతకాలి, అక్రమసంపాదన ఉండకూడదు, ఎవరినీ మోసగించకూడదు. అప్పుడే సత్యాన్ని పాటిస్తున్నాడని అర్దం.

ఉపనిషత్తులు చాలా గొప్పమాటలు చెప్తాయి. అక్రమంగా డబ్బు సంపాదించినవాడు, దుర్మార్గుడు వద్ద నుంచి డబ్బు తీసుకుని బ్రతికేవాడు, దుర్మార్గులని, అక్రమార్కులని ప్రోత్సహించేవారు పాపాత్ములు. వారు మోక్షానికి అనర్హులు. మనం తినే ఆహారం వలన మనసులో మంచి భావనలు ఏర్పడతాయి. అక్రమసంపాదన వలన, తినే ఆహారం కూడా కలుషితమవుతుంది, దొంగ బుద్ధి పెరుగుతుంది. అటువంటి ఆహారం మనసును అపవిత్రం చేస్తుంది. అపవిత్రమైన మనసు చెడు సంకల్పాలు చేస్తుంది, ఫలితంగా మనిషి దుర్మార్గుడిగా మారి లోకకంఠకుడవుతాడు. దైవానికి దూరం అవుతాడు. అట్లాగే అవినీతిపరుల సొమ్ము తినే బ్రతికేవారికి, అతడి వద్ద పనిచేసే ఉద్యోగూలకు ఈ దోషం ఉంటుంది. వారు ఎన్ని కర్మలు చేసినా, అవినీతిపరుడి వద్ద నుంచి వచ్చిన ధనంతో ఆహారం తిన్నారు కనుక వారు కూడా అధోగతి పాలవుతారు.  

సమాజంలో అవినీతిని, అక్రమాలను, లంచగొండితనాన్ని ప్రోత్సహించడం సత్యవ్రతానికి విరుద్ధం. పరిపాలించే రాజు సత్యవంతుడైతే దేశం సుభిక్షంగా ఉంటుంది, అదే అతడు అధర్మాత్ముడు, దొంగ అయితే దేశానికి సర్వ అరిష్టాలు చుట్టుకుని జనం నశించిపోతారని శాస్త్రమే చెప్తున్నది. కనుక సమాజంలో మంచిని పెంచడం, నీతి, నిజాయతీలను  ప్రోత్సహించడం సత్యవంతుని లక్షణం. మనసులో కూడా ఇతరుల సొమ్మును ఆశించకపోవడం సత్యం.  

To be continued...........

No comments:

Post a Comment