Tuesday 15 April 2014

శనీస్వరుడు - ఆంజనేయస్వామి

ఒకసారి శనీస్వరుడు వచ్చి హనుమంతుడి తలపై కూర్చున్నాడు. నా దగ్గరికి ఎందుకొచ్చావు అని హనుమ అడుగగా, నేను దేవతలందరినీ పట్టుకున్నాను, ఇప్పుడు నీ వంతు వచ్చింది, కనుక నిన్ను కూడా పీడిస్తా అంటాడు. సరేనన్న ఆంజనేయస్వామి వింధ్య పర్వతాన్ని ఎత్తి తన తలపై పెట్టుకుంటారు. స్వామి మహా బలవంతుడు, పరాక్రమవంతుడు, కొండలను సైతం పిండి చేయగలడు. ఆయనకు వింధ్య పర్వతం భారంగా అనిపించలేదు. కానీ స్వామి నెత్తిన కూర్చున్న శనికి భారంగా అనిపించింది. నా వల్ల కాదు, నేను మోయలేను, క్రిందకు దింపేయండి అంటూ కేకలు పెట్టారు. అయితే నన్ను విడ్చిపెడతావా అని స్వామి అడుగుతారు. అందుకు శని ఒప్పుకుంటాడు. వింధ్య పర్వతాన్ని తీసేస్తారు. శని వచ్చి స్వామి కాళ్ళపై పడి వేడుకుంటారు. అప్పుడు స్వామి, ఎవరు నన్ను ఉపసాసిస్తారో, వారికి నీ పీడ లేకుండా ఉండాలి అంటారు హనుమ. అందుకు అంగీకరించిన శని, హనుమను ఉపాసించేవారి మీద నా ప్రభావం ఉండదు అని అనుగ్రహిస్తారు.

ఎవరు హనుమను ఉపాసిస్తారో వారికి శని బాధలు ఉండవు. ఉపాసన అంటే కేవలం రోజు పూజ చేయడమే కాదు, హనుమతుడిని అనుకరించడం, ఆయన లక్షణాలను మనలో వృద్ధి చేసుకోవడం. ఉపాసన అన్న మాటకు దగ్గరగా కూర్చోవడం అని అర్దం ఉంది. స్వామి దగ్గరగా జరగడం అంటే స్వామి చెప్పినట్టుగా నడుచుకోవడం, ఆయన లక్షణాలను మనలో, మన పిల్లలో పెంపొందిచుకోవడం. ఎప్పుడైతే మనం స్వామి మీద అపారమైన నమ్మకం కలిగి ఉంటామో, ఎప్పుడు ఆయన మీద మనకు ఎనలేని ప్రేమ కలుగుతుందో, ఇక నువ్వు లేక నేను ఉండలేను అన్న స్థితి కలుగుతుందో, అప్పుడు స్వామి దర్శనం మనకు లభిస్తుంది.

జై శ్రీ రాం
జై హనుమాన్

No comments:

Post a Comment