Wednesday 30 April 2014

హిందూ ధర్మం - 56 (అక్రోధః)

అక్రోధః - క్రోధము లేకుండుట. ధర్మం యొక్క లక్షణం.

మనిషికుండే అవలక్షణాల్లో ఒకటి, పరమదుర్గుణం కోపమే. కోపం ఆవేశానికి దారి తీస్తుంది. ఆవేశం కారణంగా అనకూడని మాటలు అనేస్తాం. ఆయుధం చేయి దాటితే ప్రాణం పోతుంది, మాట నోరు జారితే సమస్తం పోతుంది. ఒక్కోసారి ఆయుధ ప్రయోగం వలన తగిలే దెబ్బలు బాహ్యాంగానే ఉంటాయి. కానీ మాట జారడం వలన వ్యక్తి ఆంతరంగికంగా గాయపడతాడు. శరీరానికి తగిలిన గాయాలను నయం చేయచ్చు కానీ, మనసుకు తగిలిన గాయాలను మాంచలేము. అందుకే కోపంలేని జీవితాన్ని గడపమని ఋషులు చెప్తున్నారు.  

ఎంతో గొప్ప కీర్తివంతులు, మంచి పేరున్నవారు, సమాజంలో గౌరవంతో బ్రతుకుతున్నవారు కోపానికి గురై పొరపాటుగా పలికిన మాట వారి కీర్తిని, గొప్పతనాన్ని నాశనం చేస్తుంది. క్రోధానికి లోనవడం వలన ఆవేశంలో మంచివాడు కూడా దుర్మార్గపు పనులు చేస్తాడు. ఆవేశం అనర్ధాలకు దారి తీస్తుందన్నారు పెద్దలు. ఒక్కసారి ఆవేశానికి లోనయ్యామా, ఇక మనమేం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏమి గుర్తుకురావు. ఇంతకముందు మనం విన్న మంచిమాటలు, ధర్మసూక్ష్మాలు, శాస్త్రాలు, పురాణాలు, అన్నీ మర్చిపోతాం. అందుకే యోగి వేమన తన వేమన శతకంలో

కోపమున ఘనత కొంచెమైపోవును
కోపమునను గుణము కొరతపడును
కోపమణచనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ

కోపం వలన కీర్తి, పరువుప్రతిష్టలు నశిస్తాయి. కోపము వలన మంచిగుణాలు కోల్పోతారు. కోపాన్ని అణుచుకున్నవాడి, అదుపు చేసుకున్నవాడి, జయించినవాడి కోరికలన్నీ తీరుతాయి అని భావం.
     
కోపంలేని జీవితం ఒక్కసారిగా సాధ్యపడదు. దానికి సాధన కావాలి. కోపాన్ని అదుపు చేసుకోండి అని ఋషులు చెపలేదు, కోపాన్ని జయించమన్నారు. అదుపు చేసుకోవడం వేరు, జయించడం వేరు. అందుకు తగిన మాత్గాలు కూడా వారే నిర్దేశించారు.

To be continued...........

No comments:

Post a Comment