Thursday 30 July 2015

గురు పూర్ణిమ విశిష్టత (కధ)

31 జూలై 2015, శుక్రవారం, ఆషాడ పూర్ణిమ, గురుపూర్ణిమ సందర్భంగా .......



అనాది కాలంనించీ "ఆషాడ శుద్ధపౌర్ణమిని" "గురుపౌర్ణమి" అంటారు. దీనినే "వ్యాసపౌర్ణమి" గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహాత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ రోజు ముని శ్రేష్ఠుడైన వ్యాసమహాముని జన్మతిధి కనుక ఆ భగవానుని యొక్క జన్మదినం మానవ చరిత్రలొనే అది ఒక అపూర్వమైన ఆధ్యాత్మికమైన మహాపర్వదినంగా విరాజిల్లుతోంది. అసలు ఈ ఆషాడ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత గురించి ఒక చక్కని ప్రాచీన కధ ఉంది. పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆత్రేయసగోత్రము గల ఆ బ్రహ్మణుని యొక్క పేరు 'వేదనిధి'. ఆయన భార్య వేదవతీ. వీరిద్దరు ఎల్లప్పుడు చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తుండేవారు. వారు సంతానము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా; వారికి సంతానము మాత్రం కలుగలేదు. ఇలా ఉండగా; ఒకనాడు 'వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుంటారని వార్త తెలుసుకుని ఎలా అయినాసరే! వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజూ వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు, ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు. వెనువెంటనే వేదనిధి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడతాడు. అయినా సరే! పట్టిన పాదాలను మాత్రము వదలకుండా "మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని" నేను గ్రహించాను. అందుచేతనే, మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. ఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాంగా చేరదీసి, నాయొక్క రహస్యం మాత్రము ఎవరికి తెలియకూడదు. ఇంతకి నీకు ఏమికావాలో కోరుకో అంటాడు. మహానుభావా! రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయవలసిందిగా నా కోరిక! అని చెప్తాడు. అందులకు మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరిస్తారు.  

అనంతరం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన భార్యకి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని! ఆ దంపతులు ఎంతో ఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనంతరం వారు దేవతార్చనకు సాలగ్రామం, తులసి దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యాలు సిద్ధం చేస్తారు. వారి పూజా అనంతరం ఎంతో శుచిగా మడిగా సర్వవంటకాలను సిద్ధపరచి శ్రద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతిథ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరంకావాలో కోరుకోండి అంటారు. మేము నోయని నోము లేదు, చేయని వ్రతం లేదు, అయినా! సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు! అని బదులు పలుకుతారు. ఓ అదర్శ దంపతులారా! అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోమే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనముతో జీవితంలో ఎన్నో సుఖభోగాలను అనుభవిస్తూ అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలరు, అని అశీర్వదించి తిరుగు ప్రయాణమవుతున్న వ్యాసభగవానునితో ప్రభూ! తిరిగి తమదర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది? అని వేదనిధి ప్రశ్నిస్తాడు.

దానికి వ్యాస మహర్షి బదులుగా 'ఓ భూసురోత్తమా! నన్ను మరల మరల దర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను. అందువలకు నన్ను మీరు ఎలా దర్శించగలరో చెప్తాను, వినండి. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా సరే! మన వేదవేదాంగముల యొక్క రహస్యాలను, ఇతిహాసములయొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఉంటారో! అతడే నా యొక్క నిజస్వరూపంగా తెలుసుకుని అట్టి పురాణ కథకుడైన వ్యక్తిని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణికులందరిలోను నేను ఎల్లప్పుడూ ఉంటాను.

అదేకాదు ఎవరైనాసరే! గతకల్పాలలో జరిగిన చరిత్ర; విశ్వం యొక్క పూర్వవృత్తాంతం; పూరాణగాథలు మున్నగునవి విప్పి చెప్పాలంటే! వారికి నా అనుగ్రహము లేనిదె చేప్పలేరు. కావున అట్టి పౌరాణికుణ్ణినికి ఆషాఢ శుద్దపాడ్యమి నాడు వారికి గురుపూజ చేసి పూజించవలెనని చెప్పారు. నాటి నుండి నేటివరకు అదే ఆచారము కొనసాగడం మనం చూస్తున్నాం!. అది విన్న 'వేదనిధీ మరోమారు వ్యాసభవానుని మహాత్మాతమను ఏయే రోజుల్లో ఏ విధంగా పూజించాలి? సవిస్తరంగా చెప్పండి అని ప్రశ్నిస్తాడు.

"మమ జన్మదినే సమ్యక్ పూజనీయః ప్రయత్నతః
ఆషాధ శుక్ల పక్షేతు పూర్ణిమాయాం గురౌతథా
పూజనీయే విశేషణ వస్త్రాభరణ ధేనుభిః
దక్షిణాభిః మత్స్యరూప ప్రపూజయేత్
ఏపం కృతే త్వయా విప్రః మత్స్య రూపస్య దర్శనం
భవిష్యతి నసందేహొమ యైవోక్తం ద్విజోత్తమ."

ఓ బ్రహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాధశుద్ధ పౌర్ణమినాడు ఈ గురుపూజను శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రోజు కనుక గురువారము అయితే, అది మరింతగా శ్రేష్టమైనది. వస్త్ర, అభరణ గోదానములతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించువారికి నా స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాస మహర్షి చెప్పారు. అప్పటి నుంచి వ్యాసపౌర్ణమి, నేటికీ సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ కధ పూర్వము నారదుడు వైశంపాయనుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత వివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ స్వధర్మసింధు అనే గ్రంధములోను వివరంగా చెప్పబడి యున్నది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః

గురుపూర్ణిమ గురించి మరిన్ని విశేషాలు ఈ లింక్ మీద క్లిక్ చేసి ' గురుపూర్ణిమ ' అనే లెబుల్ క్రింద చూడగలరు.

Originally published -11-July-2014
1st Edit: 30-July-2015

3 comments: