Tuesday 28 July 2015

పుష్కరాలు - నా అనుభవాలు - 2

పుష్కరాలు - నా అనుభవాలు - 2

హైద్రాబాదులోనే రైలు నాలుగు గంటల లేటుగా మొదలైంది. అక్కడకు చేరుకునే సరికి, మధ్యలో సిగ్నల్ లేకపోవడం, అంతా కలిపి కొవ్వూర్ చేరడం కొద్దిగా ఆలస్యమైనా రైలు ప్రయాణం మిగ్లిచిన అనుభూతులు ఆనందాన్నే ఇచ్చాయి. కొవ్వూర్‌లో మాకు చుట్టాలు లేరు, కానీ మాకు కుటుంబ సభ్యుల స్నేహితులకు అక్కడ ఇల్లుందని వాళ్ళింటికి ఆహ్వానించారు. నిజానికి అది వాళ్ళ ఇల్లు కూడా కాదట. వాళ్ళ బంధువులదట. ఆ ఇల్లు పాడుబడి పిచ్చిమొక్కలతో ఉండేదట. పుష్కరాలు వస్తున్నాయి, పుణ్యస్నానానికి వచ్చే పదిమందికి ఆశ్రయం ఇస్తే మంచిదని తలచి, మమ్మల్ని ఆహ్వానించినవారు ఆ ఇల్లు తీసుకుని, దాన్ని బాగు చేయించి, పిచ్చి మొక్కలన్నీ తీయించి, పుణ్యకార్యం కోసం అతిధులు వస్తున్నప్పుడు పవిత్రంగా ఉండాలని గోమయంతో శుద్ధి కొని చేయించారు. వాళ్ళే లైట్లు, ఫ్యాన్లు అమర్చారు. పనివాళ్ళను కూడా నియమించారు. అందరికి ఉచిత భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఇదంతా ఎంత ఖర్చు. పోనీ ఇల్లేమైనా ఉచితంగా ఇచ్చారా అంటే అదీ లేదు. కేవలం 12 రోజుల వాడుకోవటానికి ఒక నెల అద్దె కట్టమన్నారు. అది ఏ 5 వేలో, పది వేలో కాదు. చాలా ఎక్కువే. 30 పదులు దాటింది. అంత ఖర్చు పెట్టి, చేయడం ఎందుకంటే పుణ్యం కోసం అన్నారు. అదేకాక వాళ్ళ అమ్మమ్మగారి సొంతూరు కొవ్వూరట. అప్పట్లో పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకించి డబ్బు దాచుకుని మరీ ఏర్పాట్లు చేసేవారట. వాళ్ళమ్మగారు కూడా ఆవిడకున్న దాంట్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారట. ఇప్పుడు వాళ్ళంతా లేకపోవచ్చు, ఈయన పెరిగి పెద్దవారయ్యారు, తాతయ్య కూడా అయ్యారు. కానీ పెద్దలు చేసినదేదైనా పిల్లలు తప్పక ఆచరిస్తారు. వాళ్ళ పూర్వీకులు మొదలుపెట్టిన ఈ ఆచారాన్ని ఆపడం ఇష్టం లేక, మాకు ఆతిధ్యం ఇచ్చిన కుటుంబం వారు హైద్రాబాదు నుంచి కొవ్వూరు వచ్చి, ఏర్పాట్లు చేశారు. వారు, వారి భార్య వస్తే ఫర్వాలేదు. వాళ్ళ పిల్లలు ఆపీసులకు సెలవు పెట్టి మరీ వచ్చారు. ఈయనే పెద్ద అనుకుంటే, ఈయన 90 ఏళ్ళ వయసున్న వాళ్ళ తల్లిదండ్రులను కూడా తమతో తీసుకువచ్చారు. ఇంతమందికి ఆతిధ్యం ఇచ్చి, అందరూ సంతోషంతో వెళ్తుంటే చూసి మురిసిపోవాలాని ఆ పెద్దల కోరికట.

ఏదైనా ఒక ఊరికి వెళితే, ఎంతో డబ్బు ఖర్చని భావిస్తున్నారు. అలాంటిది ఊరు కాని ఊరులో అక్కడకు వచ్చే యాత్రికుల కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడం నిజంగా ఆశ్చర్యకరం. ఇది ఈ ఒక్క కుటుంబమే చేసిన పని కాదు. దాదాపు జనవరి నుంచి రాజమండ్రి, గోదావారి పరివాహాక ప్రాంతంలో ఉన్న ఖాళీ ఇళ్ళ అద్దె ధరలకు రెక్కలు వచ్చాయి. ఎంతోమంది విదేశాల నుంచి కూడా ఈ 12 రోజుల పుష్కరంలో తమ బంధువులకు ఆతిధ్యం ఇవ్వడం కోసం ఇళ్ళు బుక్ చేసుకున్నారని జర్నలిస్ట్‌ల ద్వారా తెలిసింది.

ఇక గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉంటున్నవారి సంగతి ప్రత్యేకించి చెప్పేదేముంది? సంవత్సరం ముందు నుంచే ఆహ్వానాలు వెళ్ళిపోయాయి. 'మీరు మాత్రం మా ఇంటికే రావాలి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము, మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఇంకేక్కడికి వెళ్ళకండి, నేరుగా ఇటే వచ్చేయండి. వస్తామని మాకు మాట ఇవ్వండి' అంటూ ఎవరికి వారు తమ బంధువులను బ్రతిమాలారు. ఆహ్వానం పంపడం వేరు, బ్రతిమాలడం వేరు. ఎందుకంటే పుష్కర సమయంలో చేసిన ఏ కొద్ది పుణ్యమైనా గొప్ప ఫలాన్ని ఇస్తుందని శాస్త్రం వచనం. విచిత్రం ఏమిటంటే ఒకసారి చెప్పి వదిలేయడం వేరు, సంవత్సరం ముందు చెప్పినా, జనవరి నుంచి ప్రతి నెలా ఫోన్లే. 'టికేట్లు బుక్ చేసుకోండి, రైలుకు దొరక్కపోతే, బస్‌లో రండి, అది కాకపోతే ట్యాక్సీ కట్టుకుని రండి, కానీ మా ఇంటికే రండి, ఇంకెక్కడికి వెళ్ళకండి' అంటు బ్రతిమాలారు. ఇది నా ఒక్కడి అనుభవమే కాదు, బాసర నుంచి అంతర్వేది వరకు, గోదావరి తీరం వెంట, గోదావరి తీరానికి దగ్గరగా ఉన్న ఊర్లల్లో నివసిస్తున్న వారి బంధువులు చాలామందికి విదితమే అనుకుంటాను.

ఆయా ప్రాంతంలో నివసిస్తున్నవారికి పుణ్యం చేసుకోవటానికి ఇదో మంచి అవకాశం. దైవకార్యం మీద వెళుతున్న పదిమందికి ఆశ్రయం కల్పించటం కూడా పుణ్యమే కదా. పైగా ఇలాంటి సమయాల్లోనే బంధువులంతా కలుస్తారు. ప్రేమలు, ఆప్యాయతలు కూడా పెరుగుతాయి. పుష్కరసమయం అనగానే అదొక పుణ్యసమయమని మనసులో పాతుకుపోవడంతో, అప్పుడు కలిగే అనుభూతులే వేరు. సాయంకాలం అయ్యేసరికి ఇంతమంది బంధువులు, మిత్రులందరూ కూర్చుని, సామూహిక లలితా, విష్ణు సహస్రనామ పారాయణలు, భజనలు చేయటం, భక్తి గీతాలు ఆలపించటం నిజంగా మరువలేని ఓ అనుభూతి. మీడియా చానెల్లు పుష్కర ఘాట్లకే పరిమితమవుతాయి, అవి గుమ్మం దాటి ఇంట్లోకి రాలేవు కదా! పుష్కరప్రయాణం ఇలాంటి ఎన్నో మరువలేని అనుభూతులను ఎందరికో మిగిల్చింది.

To be continued ......................................

No comments:

Post a Comment